ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దాదాపు రూ.31.95 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను ఓ సంస్థ మోసపూర్వకంగా రాబట్టుకొందని తెలుసుకున్న సీజీఎస్టీ ఢిల్లీ సౌత్ కమిషనరేట్.. ఒకరి అరెస్టు

నాడు పోస్టు చేయడమైనది: 31 OCT 2025 3:00PM by PIB Hyderabad

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదుపాయాన్ని మోసపూర్వకంగా రాబట్టుకొంటున్న ఒక భారీ వ్యవహారాన్ని సీజీఎస్టీ ఢిల్లీ సౌత్ కమిషనరేట్‌‌కు చెందిన ఎగవేత నిరోధక శాఖ వెలుగులోకి తీసుకువచ్చింది. దాదాపు రూ.31.95 కోట్ల మేరకు వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేతకు పాల్పడినందుకు వాణిజ్య సంస్థ డైరెక్టరును అరెస్టు చేసి, సాధికార న్యాయ సంస్థ ఎదుట హాజరు పరిచారు. సాధికార న్యాయ సంస్థ అతడిని 14 రోజుల పాటు న్యాయబద్ధ నిర్బంధానికి పంపించింది. వస్తువులను లేదా సేవలను అందించకుండానే అందించినట్లు చెలానాలను చూపించి, దగా చేసి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందిన విషయం దర్యాప్తులో బయటపడింది.      

ఎగవేత నిరోధక విభాగం నిర్దిష్ట రహస్య సమాచారాన్ని ఇవ్వడంతో, అనుమానాస్పద సరఫరా వ్యవస్థపైన ఆరా తీయడం మొదలుపెట్టారు. సరుకులను వాస్తవంగా చేరవేయకుండానే ఆ సంస్థ కపటంగా ఐటీసీని అందుకున్నట్లు పరిశీలనలో తేలింది. మరింత లోతుగా పరిశోధించగా కల్పితమైన సంస్థలు, మనుగడలో లేని సంస్థల ద్వారా ఐటీసీ సదుపాయాన్ని వినియోగించుకున్నారని,  సీజీఎస్టీ చట్టం-2017 నిబంధనలను అతిక్రమించారనీ దర్యాప్తులో నిర్ధరించారు.

దగాకోరు ఐటీసీ వ్యవహారం గుట్టును రట్టు చేయడానికి సీజీఎస్టీ ఢిల్లీ సౌత్ కమిషనరేట్ పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమంలో, ఈ కేసుతో భారీ రాబడికి గండి పడి న్యాయమైన మార్కెట్ పద్ధతులను నిర్లక్ష్యం చేసిన తీరును కనుగొన్నారు. ఈ రకమైన మోసకారి కార్యకలాపాలను పక్కాగా గుర్తించి, అడ్డుకట్ట వేయడానికి  డేటా ఎనలిటిక్స్‌నూ, సరఫరా వ్యవస్థ మ్యాపింగ్ సాధనాలనూ డిపార్ట్‌మెంటు ఉపయోగించుకుంటోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2184704) సందర్శకుల సూచీ సంఖ్య : : 40
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी