పదాతిదళ దినోత్సవం లేదా శౌర్య దివాస్ సందర్భంగా భారత సైన్యం న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళి కార్యక్రమం నిర్వహించింది. పదాతిదళ సైనికుల పరాక్రమానికి, త్యాగానికి, అలుపెరుగని స్ఫూర్తికి శ్రద్ధాంజలి ఘటించింది.
దేశ సేవలో ప్రాణలర్పించిన పదాతిదళ సైనికుల ధైర్య సాహసాలు, అత్యున్నత త్యాగాలను గౌరవిస్తూ జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలోని అమర్ చక్ర వద్ద ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ ఆర్మీ అధికారులు, ప్రస్తుత సైనికులు, మాజీ సైనికులు, యుద్ధ వీరుల కుటుంబసభ్యులు హాజరయ్యారు.
వీర్ చక్ర పురస్కార గ్రహీతలు, పదవీ విరమణ పొందిన ముగ్గురు సైనికులు మేజర్ ఆశిశ్ సోనాల్, ఆపరేషన్ పవన్ (1990); సుబేదార్ మేజర్ అండ్ గౌరవ కెప్టెన్ కున్వర్ సింగ్, ఆపరేషన్ మేఘదూత్ (1989), లాన్స్ నాయక్ అమృత్, ఆపరేషన్ కాక్టస్ లిల్లీ (1971), పదాతిదళ మాజీ సైనికుల తరపున నివాళులు అర్పించటం ద్వారా పరాక్రమం, నిస్వార్థ సేవల శాశ్వత వారసత్వం స్పష్టమైంది.
ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరిగిన వేడుకల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. లక్నోలో ఫీల్డ్ మార్షల్ కె.ఎం. కరియప్ప స్మారక సెమినార్, ఢిల్లీలోని కంటోన్మెంట్ లో శౌర్యవీర్ రన్, వీర నారీమణులకు సన్మాన కార్యక్రమాలు జరిగాయి. పదాతిదళ బహుముఖ సామర్థ్యాన్ని స్పష్టం చేస్తూ, సాహసోపేతమైన కథనాలను వివరిస్తూ రూపొందించిన 'ఇన్ ఫాంట్రీ మ్యాగజైన్'ను ఈ సందర్భంగా విడుదల చేశారు.
ఏటా అక్టోబర్ 27న జరుపుకునే పదాతిదళ దినోత్సవం దేశ చరిత్రలో కీలకమైన రోజు. 1947లో ఇదే రోజున, భారత సైన్యంలోని పదాతిదళ సిబ్బంది శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకున్న తొలి సైనికులుగా నిలిచారు. అనంతరం ఈ దళాలు చేపట్టిన సాహసోపేత కార్యకలాపాలు పాకిస్తాన్ మద్దతున్న గిరిజన దండయాత్రను తిప్పి కొట్టి, దేశ సరిహద్దు భద్రతను కాపాడాయి. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో పదాతిదళాల స్థిరమైన అంకితభావం, ప్రదర్శించిన సాటిలేని అంకితభావానికి ఈరోజు శాశ్వత గుర్తుగా నిలిచింది.




***