శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
నఫిత్రోమైసిన్… తొలి భారతీయ రోగనివారిణి శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లకు, క్యాన్సర్, అదుపులో లేని మధుమేహానికీ మేలు
వోక్ హార్డ్ భాగస్వామ్యంతో ఈ మందును అభివృద్ధి చేసిన ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం
పారిశ్రామిక- పరిశోధనా సంస్థల భాగస్వామ్య విజయానికి ఉదాహరణ
స్వావలంబన సాధించిన ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించాలన్న కేంద్ర మంత్రి
ఫలితంగా పరిశోధన, ఆవిష్కరణల్లో అంతర్జాతీయ గుర్తింపు
ప్రభుత్వ నిధులపై ఆధారపడటం తగ్గి, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం, దాతృత్వ సహకార సంస్కృతికి అవకాశం
హీమోఫీలియా చికిత్సలో మొదటిసారి దేశీయంగా నిర్వహించిన క్లినికల్ ట్రయల్..
ప్రభుత్వ-ప్రభుత్వేతర సంస్థల మధ్య సహకారంలో సాధించిన మరో విజయం
‘‘మల్టీ-ఒమిక్స్ డేటా ఏకీకరణ, విశ్లేషణ కోసం కృత్రిమ మేధను వినియోగించుకోవడం’’ అంశంపై మూడు రోజుల వర్క్షాపును ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
పరిశోధన, ఆవిష్కరణల్లో అంతర్జాతీయ గుర్తింపు సాధించాలంటే.. స్వయం సమృద్ధమైన ఆవిష్కరణల వ్యవస్థను భారత్ నిర్మించుకోవాలి: డాక్టర్ జితేంద్ర సింగ్
ఆరోగ్యసేవలను, పరిపాలనా సామర్థ్యాన్ని, నిర్ణయం తీసుకోవడంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన కృత్రిమ మేధ: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
18 OCT 2025 3:01PM by PIB Hyderabad
యాంటీబయోటిక్ ‘‘నఫిత్రోమైసిన్’’ను పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తొలిసారి భారత్ అభివృద్ధి చేసిందని శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం (స్వతంత్ర హోదా), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్షం మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు తెలియజేశారు. ఇది శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్లకు, ముఖ్యంగా క్యాన్సర్ రోగులjp, మధుమేహం నియంత్రణలో లేని వారికీ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది పూర్తిగా భారత్లోనే సిద్ధాంతీకరించి, అభివృద్ధి చేసి, క్లినికల్గా ధ్రువీకరించిన మొదటి యాంటీబయోటిక్ అని.. ఇది ఫార్మాసూటికల్ రంగంలో స్వావలంబన దిశగా భారత్ సాధించిన కీలకమైన విజయాన్ని సూచిస్తుందని మంత్రి అన్నారు.
నఫిత్రోమైసిన్ యాంటిబయోటిక్ను ప్రముఖ ఫార్మా సంస్థ వోక్ హార్డ్తో కలసి భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే బయోటెక్నాలజీ విభాగం అభివృద్ధి చేసింది.
దీనిని భారతీయ బయోఫార్మాసూటికల్ అభివృద్ధిని నడిపించే పారిశ్రామిక-పరిశోధనా సంస్థల భాగస్వామ్యం సాధించిన విజయానికి ఉదాహరణగా చూపిస్తూ.. స్వావలంబన సాధించిన ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించాల్సిన అవసరాన్ని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. తద్వారా పరిశోధన, ఆవిష్కరణల్లో అంతర్జాతీయ గుర్తింపు సాధించడానికి ప్రభుత్వ నిధులపై ఆధారపడటం తగ్గి, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం, దాతృత్వ సహకార సంస్కృతి విస్తరిస్తుందన్నారు.
‘‘మల్టీ-ఒమిక్స్ డేటా ఏకీకరణ, విశ్లేషణ కోసం కృత్రిమ మేధను వినియోగించుకోవడం’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించే మెడికల్ వర్క్షాపును డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. శాస్త్రీయ, పరిశోధన వృద్ధిని ముందుకు నడిపించే స్వయం సమృద్ధి సాధించిన వ్యవస్థను భారత్ అభివృద్ధి చేసుకోవాలన్నారు. విస్తృతమైన ప్రైవేటు రంగం భాగస్వామ్యం ఉన్న స్వావలంబన సాధించిన, ఆవిష్కరణ ఆధారిత విధానాల ద్వారానే అనేక దేశాలు అంతర్జాతీయ గుర్తింపును సాధించాయని ఆయన వివరించారు.
ప్రభుత్వ-ప్రభుత్వేతర సహకారంలో విజయానికి మరో ఉదాహరణను ఉటంకిస్తూ.. జన్యు చికిత్సలో భారత్ గొప్ప విజయాన్ని సాధించిందని, హీమోఫీలియా చికిత్సలో మొదటిసారి దేశీయంగా నిర్వహించిన క్లినికల్ పరీక్ష విజయవంతమైందని ప్రకటించారు. భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం అందించిన సహకారంతో ప్రభుత్వేతర రంగంలో ఉన్న వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఈ పరీక్ష నిర్వహించారు.
ఇప్పటికే 10,000కి పైగా మానవ జన్యువుల క్రమాన్ని భారత్ తయారుచేసిందని, వీటిని ఒక మిలియన్కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు. ఈ జీన్ థెరపీ పరీక్షల్లో సున్నా రక్తస్రావంతో 60 నుంచి 70 శాతం నివారణ రేటు సాధ్యమైందని, ఇది భారతీయ వైద్య పరిశోధనా రంగంలో గొప్ప విజయాన్ని సూచిస్తుందన్నారు. న్యూ ఇంగ్లాండ్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన ఈ పరిశోధనా ఫలితాలు.. అధునాతన బయోమెడికల్ ఆవిష్కరణల్లో విస్తరిస్తున్న భారత్ నాయకత్వాన్ని తెలియజేస్తున్నాయి.
అనుసంధాన్ నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) ఈ దిశగా చేపట్టిన ప్రధాన కార్యక్రమమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అయిదేళ్ల కాలానికి రూ.50,000 కోట్ల వ్యయ అంచనాతో దీన్ని ఏర్పాటు చేశామని, ఈ మొత్తంలో రూ.36,000 కోట్లు ప్రభుత్వేతర వనరుల నుంచి సమకూరుతాయని తెలియజేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. పరిశోధనా సంస్థలు, పరిశ్రమల సహకారంతో.. పరిశోధనాభివృద్ధి రంగంలో భారత అనుసరిస్తున్న విధానంలో మార్పును ఈ విధానం సూచిస్తుందని వివరించారు.
ఆధునిక యుగంలో పరివర్తన తీసుకొచ్చే సాధనాల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఒకటని, ఇది ఆరోగ్య సేవలను, పరిపాలనా సామర్థ్యాన్ని, నిర్ణయాలను తీసుకోవడాన్ని పునర్నిర్వచిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అందరికీ నాణ్యమైన ఆరోగ్యసేవలు అందించేలా.. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఏఐ ఆధారిత హైబ్రిడ్ మొబైల్ క్లినిక్లు పనిచేస్తున్నాయని ఆయన తెలియజేశారు. పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్పీజీ) అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. వారానికి 97 నుంచి 98 శాతం వరకు ఫిర్యాదులను పరిష్కరిస్తూ.. ప్రజలకు అందించే సంతృప్తికరమైన సేవలను మెరుగుపరిచింది.
ఆరోగ్య సేవల ఫలితాలను మెరుగుపరచడానికి ఏఐ, బయోటెక్నాలజీ, జీనోమిక్స్ను ఏకీకృతం చేయడం ద్వారా అంతర విభాగ విధానాలను అనుసరించడంలో మార్గదర్శిగా నిలుస్తున్న సర్ గంగారాం ఆసుపత్రి లాంటి సంస్థలను మంత్రి ప్రశంసించారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు ఆసుపత్రులు, పరిశోధనా సంస్థలు మధ్య మరింత సహకారం అవసరమని ఆయన అన్నారు.
బయోటెక్నాలజీ, ఏఐ, జీనోమిక్ మెడిసిన్లో స్వావలంబన అనే కొత్త యుగంలోకి భారత్ అడుగు పెడుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు భారత్ చేస్తున్న ప్రయాణాన్ని.. ఆవిష్కరణ, సహకారం, కరుణల మేలు కలయిక నిర్వచిస్తుందని, అంతర్జాతీయ సైన్స్, సాంకేతికత రంగాల్లో దేశ నాయకత్వాన్ని నిలబెడుతుందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో అనుసంధాన్ నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివ కుమార్ కల్యాణ రామన్, డాక్టర్ ఎన్కే గంగూలి, డాక్టర్ డీఎస్ రాణా, డాక్టర్ అజయ్ స్వరూప్ పాల్గొన్నారు.
***
(Release ID: 2182030)
Visitor Counter : 4