ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
డెహ్రడూన్ లో అక్టోబర్ 17న జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2025ను ప్రారంభించనున్న కేంద్ర సహాయమంత్రి శ్రీ జితిన్ ప్రసాద
బాధ్యతాయుతమైన, సమ్మిళిత ఏఐ వృద్ధి కోసం 2026లో జరగనున్న ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు
ముందుగా ఒక సమావేశాన్ని నిర్వహించనున్న ఉత్తరాఖండ్
డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా ఆవిష్కరణ, పాలన, వ్యవస్థాపకతతో జరిగే ఈ కార్యక్రమంలో డిజిటల్ ఉత్తరాఖండ్ దార్శనికత దిశగా కార్యక్రమంలో
పాల్గొననున్న విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, విద్యావేత్తలు
Posted On:
16 OCT 2025 11:40AM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) ఆధ్వర్యంలోని ఇండియా ఏఐ మిషన్ తో కలిసి ఉత్తరాఖండ్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2025ను అక్టోబర్ 17న డెహ్రడూన్ లోని హోటల్ రమదాలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్వహించనుంది. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఫిబ్రవరి 19 నుంచి 20, 2026న జరగనున్న ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు ముందుగా జరిగే సమావేశమే ఈ కార్యక్రమం.
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి (ఎంఓఎస్) శ్రీ జితిన్ ప్రసాద, ఉత్తరాఖండ్ ప్రభుత్వ సీనియర్ అధికారులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
గ్లోబల్ సౌత్ దేశాల్లో మొదటిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఏఐ ఫోరమ్, ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కార్యక్రమం. ఇది ప్రపంచ ఏఐ అజెండాను రూపొందించటంలో భారత నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. "ఏఐ ఫర్ ఆల్" అని దేశ లక్ష్యానికి అనుగుణంగా, వచ్చే ఏడాది జరిగే అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ కు సంబంధించిన ముందస్తు సమావేశం.. సామాజిక సమ్మిళితం, ఆవిష్కరణ, మెరుగైన ప్రజా సేవలను అందించేందుకు కృత్రిమ మేధాశక్తిని వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 మూడు ప్రధాన మార్గదర్శక సూత్రాలు ప్రజలు, ప్రపంచం, పురోగతిపై ఆధారపడి ఉంది. మానవాళికి ఏఐ చేసే సేవ, పర్యావరణ పరిరక్షణ, సమ్మిళిత వృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలను ఈ సూత్రాలు నిర్దేశిస్తాయి. ఏడు చక్రాలు, నేపథ్య కార్యనిర్వాహక బృందాల ద్వారా ఈ మార్గదర్శక సూత్రాల అమలు జరుగుతుంది. వీటిలో ప్రతీదీ ఏఐపై ప్రపంచ ప్రభావాల్లోని ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తుంది. ఈ సూత్రాలు, చక్రాలు కలిసి అందించే సమన్వయ వ్యవస్థ.. సంభాషణను ఆశావహమైన హామీల నుంచి మెరుగైన ఫలితాల దిశకు నడిపించటంతో ఏఐ ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా సమానంగా అందుతాయి.
ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్తరాఖండ్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2025 కార్యక్రమం ఆ రాష్ట్రాన్ని బాధ్యతాయుతమైన, సమ్మిళిత ఏఐ వృద్ధిలో ముందువరుసలో నిలబెడుతుంది. విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, విద్యావేత్తలు ఈ ముందస్తు కార్యక్రమంలో పాల్గొని, బాధ్యతాయుతమైన, సమ్మిళిత ఏఐ వినియోగంతో ఆవిష్కరణలను ప్రోత్సహించటం, పాలనను మెరుగుపరచటం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను శక్తిమంతం చేయటం ద్వారా ఉత్తరాఖండ్ లో స్థిరమైన అభివృద్ధికి ఏఐ ఎలా సహకరించగలదన్న అంశంపై చర్చించి, డిజిటల్ ఉత్తరాఖండ్ విజన్ ను ముందుకు తీసుకెళ్తారు. భారత డిజిటల్ పరివర్తన అజెండా, ఇండియా ఏఐ మిషన్ కు అనుగుణంగా నమ్మకం, నైతికత, సమ్మిళితత్వం.. వర్దమాన సాంకేతికతల్లో ప్రపంచ నాయకత్వం వహించే దిశగా భారత్ దూసుకెళ్లాలనే ఎంఈఐటీవై ప్రాధాన్యతను ఈ సమ్మిట్ స్పష్టం చేస్తుంది.
ఉత్తరాఖండ్ లో మార్పునకు కారణమైన అత్యంత అధునాతన ఏఐ అప్లికేషన్లు, ఔత్సాహిక కార్యక్రమాలను ఈ సమ్మిట్ లో ప్రదర్శిస్తారు. ఐఐఎం కాశీపూర్, ఎస్ టీపీఐ డెహ్రాడూన్ మద్దతుతో పనిచేసే ప్రముఖ ఏఐ ఆధారిత స్టార్టప్ ల ద్వారా ప్రజెంటేషన్లు ఉంటాయి. రాష్ట్ర ఐటీ రోడ్ మ్యాప్, ఏఐ పాలన విజన్ ను వివరిస్తూ కీలక ఉపన్యాస సెషన్లు ఉంటాయి. ఇవి సుస్థిరమైన, ఆవిష్కరణ ఆధారిత వృద్ధిని ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని రూపొందిస్తాయి.
ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 గురించి
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19 నుంచి 20, 2026న న్యూఢిల్లీలో ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరగనుంది. సమ్మిళిత వృద్ధి, సుస్థిరత, సమానమైన ప్రగతిని పెంపొందించటంలో ఏఐ పరివర్తనాత్మక పాత్రను ఈ ప్రపంచ వేదిక ప్రదర్శించనుంది. మానవాళికి సేవ చేయటం, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించటం, సామాజిక అభివృద్ధిని పెంపొందించటం, ప్రపంచాన్ని రక్షించే ఆవిష్కరణలు చేయటం వంటి లక్ష్యాలను ఏఐ ద్వారా సాధించేందుకు ఈ సమ్మిట్ మార్గ నిర్దేశం చేస్తుంది.
మూడు సూత్రాలు
ఈ సమావేశం మూడు మార్గదర్శక సూత్రాలపై ఆధారపడి ఉంది.
ప్రజలు: ఏఐ, మానవాళి మొత్తానికి సేవ చేయాలి. వైవిధ్యాన్ని, సాంస్కృతిక గుర్తింపులను గౌరవిస్తూ, వ్యక్తి గౌరవాన్ని కాపాడుతూ, ఏ ఒక్కరూ వెనుకబడకుండా చూడాలి. ఏఐ ప్రపంచంలో మానవాభివృద్ధి, బహుభాషా, అందుబాటులో ఉండే వ్యవస్థలు, సురక్షితమైన, విశ్వసనీయమైన ఏఐ వినియోగం వంటివి దృష్టి సారించాల్సిన ప్రధానాంశాలు.
ప్రపంచం: ఏఐ అభివృద్ధి, వినియోగం వనరుల సామర్థ్యం కలిగి ఉండి, వాతావరణ స్థితిస్థాపకత, పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ ఆవిష్కరణలను వేగవంతం చేయాలి. ప్రపంచ పర్యవేక్షణ, ప్రపంచ సుస్థిర లక్ష్యాలకు అనుగుణంగా ఏఐ ఉండాలి.
పురోగతి: ఏఐ ప్రయోజనాలను సమానంగా పంపిణీ చేసేందుకు డేటాసెట్లు, కంప్యూట్, నమూనాలను అందరికీ అందుబాటులో ఉండేలా విస్తరించి.. వైద్యం, విద్య, పరిపాలన, వ్యవసాయ రంగాల్లో ఏఐని అమలు చేయాలి.
ఏడు చక్రాలు
మార్గదర్శక సూత్రాలు ఏడు చక్రాల ద్వారా అమలవుతాయి. వివిధ సహకార విభాగాలు, ఫలితాలను అందించేందుకు ఈ చక్రాలను రూపొందించారు.
మానవ వనరుల పెట్టుబడి - ఉపాధి, నైపుణ్యం, శ్రామిక శక్తి పరివర్తన అంశాలను పరిష్కరించటం. అక్షరాస్యత, కొత్త నైపుణ్యాల శిక్షణ, భవిష్యత్ నైపుణ్యాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థను అభివృద్ధి చేయటం.
సమ్మిళిత సామాజిక సాధికారత – భాషలు, సంస్కృతులు, గుర్తింపులను ప్రతిబింబించే ఏఐని రూపొందించటం, వికలాంగులుకు అందుబాటులో ఉంచటం, లింగపరమైన, డేటా పక్షపాతాలను నిరోధించటం.
సురక్షిత, విశ్వసనీయ ఏఐ – భద్రతాపరమైన పరీక్షలు, పారదర్శకత, ఆడిటింగ్ సాధనాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం. సమైక్య పాలనా, హామీ వ్యవస్థలను నిర్మించటం.
స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సామర్థ్యం - వనరులను సమర్థంగా వినియోగించుకునే, తక్కువ భారంతో, స్థానిక వాస్తవాలకు అనుగుణంగా మార్చుకోగలిగే ఏఐని ప్రోత్సహించటం వల్ల అసమానతలు, పర్యావరణ భారం తగ్గుతాయి.
సైన్స్ - పరిశోధన, ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు బాధ్యతాయుతమైన ఏఐ వినియోగాన్ని విస్తరించాలి. గ్లోబల్ సౌత్ దేశాల్లో పర్యావరణ వ్యవస్థలను, భాగస్వామ్యాలను బలోపేతం చేయాలి. బహిరంగ, వివిధ విభాగాల పరిశోధనను ప్రోత్సహించాలి.
ఏఐ వనరులను అందరికీ అందుబాటులో ఉంచటం - డేటా, కంప్యూట్, నమూనాలు, కీలక మౌలిక సదుపాయాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ మార్గాలను ఏర్పరచటం ద్వారా ప్రపంచ వాస్తవికతను ప్రతిబింబించే వైవిధ్యమైన ఏఐ పరిష్కారాలను రూపొందించానికి వీలవుతుంది.
ఆర్థికాభివృద్ధి, సామాజిక శ్రేయస్సుకు ఏఐ – ప్రజాప్రయోజన రంగాల్లో ఏఐ అప్లికేషన్లను గుర్తించి, వాటిని విస్తృతం చేయాలి. జ్ఞానం, వనరులను పంచుకోవటానికి వేదికలను సృష్టించాలి. అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించాలి.
ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ఏఐ ప్రభావంపై, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో చర్చించనున్నారు. గ్లోబల్ సౌత్ దేశాలతో సహా ప్రపంచ దేశాలన్నిటికీ సమావేశకర్తగా భారత్ పాత్రను ఈ సదస్సు స్పష్టం చేస్తుంది. ప్రపంచ నాయకులు, ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలు, పారిశ్రామిక నిపుణులు ఈ సదస్సులో పాల్గొని ఎక్కువ మందికి సేవలందించే ఏఐకి ఉమ్మడి దార్శనికతను రూపొందిస్తారు.
***
(Release ID: 2180101)
Visitor Counter : 9