మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
రూ.5862 కోట్లకు పైగా వ్యయంతో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాల (కేవీఎస్) ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం
Posted On:
01 OCT 2025 3:14PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెరిగిన దృష్ట్యా వారి పిల్లల విద్యావసరాలను తీర్చేందుకు దేశవ్యాప్తంగా ప్రజా విభాగంలో 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను (కేవీ) ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 2026-27 మధ్య తొమ్మిది సంవత్సరాల పాటు ఈ 57 కొత్త కేవీల ఏర్పాటు, నిర్వహణకు దాదాపు రూ. 5862.55 కోట్లు వ్యయమవుతుందన్న అంచనా ఉంది. ఇందులో రూ. 2585.52 కోట్లు (సుమారుగా) మూలధన వ్యయం కాగా.. రూ. 3277.03 కోట్లు (సుమారుగా) నిర్వహణ వ్యయం. ఎన్ఈపీ 2020కి ఆదర్శవంతమైన పాఠశాలలుగా నిలిచేలా మొదటిసారిగా ఈ 57 విద్యాలయాల్లో బాలవాటికలు అంటే 3 సంవత్సరాల ఫౌండేషన్ దశ సౌకర్యాలు (ప్రీ-ప్రైమరీ) ఉండనున్నాయి.
రక్షణ, పారామిలిటరీ దళాలతో సహా బదిలీ అయ్యే, బదిలీ కాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా అవసరాలను తీర్చేందుకు, దేశవ్యాప్తంగా ఒకే ప్రామాణిక విద్యనందించేందుకు భారత ప్రభుత్వం 1962 నవంబర్లో కేంద్రీయ విద్యాలయాల పథకాన్ని ఆమోదించింది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో "కేంద్రీయ పాఠశాలల సంస్థ (సెంట్రల్ స్కూల్స్ ఆర్గనైజేషన్)" ప్రారంభమైంది.
కొత్త కేవీలను ప్రారంభించటం నిరంతర ప్రక్రియ. కొత్త కేవీలను ఏర్పాటుచేసేందుకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు-విభాగాలు, రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలతో సహా వివిధ స్పాన్సరింగ్ యంత్రంగాల నుంచి మంత్రిత్వ శాఖ, కేవీఎస్లు (కేంద్రీయ విద్యాలయ సంఘటన్) తరచుగా ప్రతిపాదనలు అందుకుంటుంటాయి. ఈ ప్రతిపాదనలను సంబంధిత స్పాన్సరింగ్ యంత్రంగాలు అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు స్పాన్సర్ చేస్తాయి. నేటికి 1288 కేవీలు పనిచేస్తున్నాయి. వీటిలో 3 విదేశాల్లో (మాస్కో, ఖాట్మండు, టెహ్రాన్) ఉన్నాయి. 2025 జూన్ 30 నాటికి నమోదైన మొత్తం విద్యార్థుల సంఖ్య 13.62 లక్షలు (దాదాపు).
దేశవ్యాప్తంగా కేవీలను నెలకొల్పటంతో పాటు కేవీలకు ఉన్న అధిక డిమాండ్కు అనుగుణంగా గతంలో మంజూరు చేసిన 85 కేవీలకు కొనసాగింపుగా ఈ తాజా ముంజూరు ఉంది. ఈ 57 విద్యాలయాల్లో 7 కేవీలను హోం మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేయగా.. మిగిలిన 50 కేవీలకు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు స్వాన్సర్గా ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయాల కోసం వచ్చిన 57 కొత్త ప్రతిపాదనలు వెనుకబడిన, వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాలను చేరుకునే విషయంలో బలమైన నిబద్ధతను తెలియజేస్తున్నాయి. తూర్పు ప్రాంతంలో వృద్ధిని నిర్ధారిస్తూ ఉత్తర, దక్షిణ, పశ్చిమ ప్రాంతాలకు సమతుల్య ప్రాతినిధ్యం ఉండేలా చూసుకుంటూ సమ్మిళితత్వం, జాతీయ సమైక్యతను బలోపేతం చేసేందుకు అవలంబించిన విధానాన్ని ఈ కొత్త విద్యాలయాలు మంజూరు తెలియజేస్తోంది. డిసెంబర్ 2024లో మంజూరు చేసిన 85 కేవీలకు కొనసాగింపుగా ప్రస్తుతం ముంజూరైన కేవీలు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రానున్నాయి. ప్రస్తుతం ఆమోదించిన వాటిలో 20 కేవీలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గణనీయంగా ఉన్నప్పటికీ... కేవీల్లేని జిలాల్లో రానున్నాయి. ఆకాంక్షాత్మక జిల్లాల్లో 14 కేవీలు, ఎల్డబ్ల్యుఈ జిల్లాల్లో 4 కేవీలు, ఎన్ఈఆర్- కొండ ప్రాంతాల్లో 5 కేవీలు ఉన్నాయి. మార్చి 2019 నుంచి కేవీల మంజూరులో ప్రాధాన్యత లభించని రాష్ట్రాలకు ఈ విడతలో కేవీలను కేటాయించారు. డిసెంబర్ 2024లో చేసిన 85 కేవీల మంజూరుకు కొనసాగింపుగా ప్రస్తుతం 57 విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
కొత్త కేవీల ప్రాజెక్టును అమలుచేసేందుకు దాదాపు 1520 మంది విద్యార్థుల సామర్థ్యంతో ఒక పూర్తి స్థాయి కేవీని నిర్వహించేందుకు సంఘటన్ నిర్ణయించిన నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుంది. మొత్తంగా 86640 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక పూర్తి స్థాయి కేవీ (బాల్వాటిక నుంచి 12వ తరగతి వరకు) 81 మందికి ఉపాధి కల్పిస్తుంది. తదనుగుణంగా 57 కొత్త కేవీల ఆమోదంతో ప్రత్యక్షంగా మొత్తం 4617 మంది శాశ్వత ఉపాధి పొందనున్నారు. కేవీల నిర్మాణం, సౌకర్యాల పెంపుతో సంబంధం ఉన్న పనులు.. అనేక మంది నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది.
జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 913 కేవీలను ‘పీఎం శ్రీ’ పాఠశాలలుగా మార్చారు. ఇది ఎన్ఈపీ 2020 అమలవుతోన్న తీరును తెలియజేస్తోంది. నాణ్యమైన విద్య, వినూత్న బోధన, అధునాతన మౌలిక సదుపాయాల కారణంగా కేవీలకు డిమాండు ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం కేవీలలో బాలవాటిక, ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. సీబీఎస్ నిర్వహించే బోర్డు పరీక్షలలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల ఉత్తీర్ణత అన్ని విద్యా వ్యవస్థలతో పోల్చితే అత్యుత్తమంగా ఉంది.
కేవీలు మోడల్ పాఠశాలలుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు చేసిన మంజూరులలో ప్రాతినిధ్యం పొందని లేదా తక్కువ ప్రాతినిధ్యం లభించిన రాష్ట్రాలలో నాణ్యమైన విద్యను పెంపొందించేందుకు తాజా మంజూరు ఉపయోగపడుతుంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గణనీయమైన సంఖ్యలో ఉండి అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలలో, ఆకాంక్షాత్మక జిల్లాల్లో కేవీలను బలోపేతం చేయడం.. కేవీఎస్ నెట్వర్క్ను భౌగోళిక సవాళ్లున్న, సామాజికంగా కీలకమైన ప్రాంతాలకు విస్తరించేలా ప్రస్తుత ప్రతిపాదన చూసుకోనుంది.
***
(Release ID: 2173877)
Visitor Counter : 7