బొగ్గు మంత్రిత్వ శాఖ
భారత బొగ్గు, ఖనిజ రంగాల్లో చరిత్రాత్మక మార్పులు పెరుగుతున్న డిమాండుకు తోడుగా పెరుగుతున్న హరిత ఇంధనం: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
ఒక బిలియన్ టన్నులను దాటిన దేశీయ బొగ్గు ఉత్పత్తి...
దేశ భవితకు ఊతాన్నిస్తున్న పునరుత్పాదక ఇంధనం, కీలక ఖనిజాలతో పాటు గ్యాసిఫికేషన్ మిషన్లు
Posted On:
24 SEP 2025 7:13PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత బొగ్గు, ఖనిజ రంగాలు ఒక చరిత్రాత్మక మార్పును ఆవిష్కరిస్తున్నాయనీ, దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను ఈ మార్పు సాహసిక సుస్థిరత సాధన లక్ష్యాలతో సమతౌల్యం చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అన్నారు.
‘ది ఎకనామిక్ టైమ్స్’ ఏర్పాటు చేసిన ఎనర్జీ లీడర్షిప్ సమ్మిట్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024-25లో బొగ్గు ఉత్పత్తి, సరఫరాలు బిలియన్ టన్నులను అధిగమించాయనీ, 2030 నాటికల్లా బొగ్గు డిమాండు 1.6 బిలియన్ టన్నులుండవచ్చని ఆయన అన్నారు. ‘‘స్థిరత్వానికి పెద్ద పీట వేస్తూనే ఈ పెరుగుతున్న డిమాండును తీర్చడానికి మేం బొగ్గును హరిత వృద్ధికి చోదక శక్తిగా మారుస్తున్నాం. కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ 2030 నాటికి 100 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని సాధించడానికి సిద్ధంగా ఉంది. ఈ మిషనుకు రూ.8,500 కోట్ల ప్రోత్సాహక పథకం మద్దతు లభిస్తోంది. దీనికి తోడు ఏడు ప్రాజెక్టులు ఇప్పటికే అమలవుతున్నాయి’’ అని ఆయన వివరించారు. బొగ్గు పీఎస్యూలు పునరుత్పాదక ఇంధన రంగంలో వైవిధ్యానికి బాట వేస్తున్నాయనీ, ఇప్పటికే 1,900 మెగావాట్ సౌర, పవన ఇంధన సామర్థ్యం తోడైందనీ, 2030 కల్లా 15 గిగావాట్ స్థాయిని అందుకోవాలన్నదే లక్ష్యమనీ ఆయన తెలిపారు. నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఒక్కటే 10.11 గిగావాట్ సాధన దిశగా పయనిస్తోందన్నారు.
పర్యావరణ పరంగా చూస్తే, 57,000 హెక్టార్ల మేరకు గనులున్న భూములను ఇప్పటికే పర్యావరణ హిత భూములుగా మార్చామనీ, మరో 16,000 హెక్టార్లను మిషన్ గ్రీన్ కోల్ రీజియన్స్ లో భాగంగా పర్యావరణ హిత భూములుగా మార్చేందుకు చూస్తున్నామన్నారు.
గనుల తవ్వకం రంగంలో సంస్కరణలపై మంత్రి మాట్లాడుతూ, 542 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలం వేశామనీ, ఇందులో 34 కీలక ఖనిజాల బ్లాకులు కూడా ఉన్నాయన్నారు. ‘‘మొదటిసారి, ప్రయివేటు ఏజెన్సీలతో పాటు జూనియర్ అన్వేషణ సంస్థలను దీనిలో చేర్చారు. డ్రోన్ సర్వేలు, ఏఐ ఆధారంగా పనిచేసే నమూనాలు, రిమోట్ సెన్సింగ్ సాయంతో అన్వేషణ ప్రక్రియలో వేగం చోటుచేసుకొంటోంది. 13 అన్వేషణ లైసెన్సులను ఇప్పటికే మంజూరు చేశారు. ఈ పరిణామం గనుల రంగంలో ఒక నూతన యుగానికి ప్రతీకగా నిలిచింది’’ అని మంత్రి వివరించారు.
అంతర్జాతీయంగా భారత్ అందుకున్న స్థానాన్ని మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ‘‘జాతీయ కీలక ఖనిజాల మిషన్ ద్వారా, మేం వ్యూహాత్మక నిల్వలను సిద్ధం చేస్తున్నాం. విదేశాల్లో ఆస్తులను సంపాదించుకొంటున్నాం. అర్జెంటీనాలో లిథియం బ్లాకులను కాబిల్ ఇప్పటికే చేజిక్కించుకొంది. విదేశాల్లో నోడల్ అధికారులు భారత ఖనిజ సంబంధిత దౌత్యాన్ని బలోపేతం చేస్తున్నారు. కీలక ఖనిజాల పునరుపయోగానికి ఉద్దేశించిన రూ.1,500 కోట్ల ప్రోత్సాహక పథకంతో పాటు, కొత్తగా ఎక్స్ లెన్స్ కేంద్రాల ఏర్పాటు మన దేశ సామర్థ్యాలకూ, పరిశోధనకూ మరిన్ని అండదండలను అందిస్తాయి’’ అని తెలిపారు.
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2047కల్లా అభివృద్ధి చెందిన, సమృద్ధియుక్త, స్వావలంబన దేశం వికసిత్ భారత్ ను సాధించేందుకు ఒక స్పష్టమైన దృష్టి కోణాన్ని మన ముందుంచారు’’ అని చెబుతూ కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
***
(Release ID: 2171100)
Visitor Counter : 11