రక్షణ మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా స్మార్ట్, గ్రీన్, సుస్థిర పట్టణ వ్యవస్థలుగా కంటోన్మెంట్ ప్రాంతాలు
2035 నాటికి లక్ష్యాన్ని సాధించాలని ఐడీఈఎస్ అధికారులకు రక్షణ మంత్రి పిలుపు
Posted On:
18 SEP 2025 6:04PM by PIB Hyderabad
భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాలను స్మార్ట్, గ్రీన్, సుస్థిర పట్టణ వ్యవస్థలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలనీ.. 2035 నాటికి లక్ష్యాన్ని సాధించాలని రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ (ఐడీఈఎస్) అధికారులకు పిలుపునిచ్చారు. 'వికసిత్ భారత్ @2047 కోసం వ్యూహాత్మక రోడ్మ్యాప్' ప్రధాన ఇతివృత్తంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ (డీజీడీఈ) ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు- 'మంథన్ 2025'లో ఆయన కీలకోపన్యాసం చేశారు.
18 లక్షల ఎకరాలకు పైగా రక్షణ భూముల నిర్వహణ.. దేశవ్యాప్తంగా 61 కంటోన్మెంట్లలో నివసిస్తున్న పౌరుల సంక్షేమం వంటి రెండు బాధ్యతలనూ విజయవంతంగా నిర్వర్తిస్తున్న ఐడీఈఎస్ అధికారులను రక్షణ మంత్రి అభినందించారు. మరింత సమర్థంగా, పారదర్శకంగా, పౌరులకు అనుకూలంగా సేవలందించేలా వ్యవస్థలు, ప్రక్రియలను నిరంతరం అప్గ్రేడ్ చేస్తూ ఆధునిక నగరాలకు ధీటుగా కంటోన్మెంట్లను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని శ్రీ రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. “ప్రజలు ఇంటి నుంచే పారదర్శకంగా, సకాలంలో సేవలను పొందగలిగేలా మనం డిజిటల్ సేవలను మెరుగుపరచాలి. కంటోన్మెంట్ల భవిష్యత్తు ప్రణాళికల్లో నివాసితుల భాగస్వామ్యాన్ని పెంచాలి. కాలానుగుణంగా తలెత్తే డిమాండ్లకు అనుగుణంగా సేవలను అందించగల ఆధునిక, పారదర్శక, జవాబుదారీ సంస్థలుగా కంటోన్మెంట్ బోర్డులను మార్చాలి. కంటోన్మెంట్ నివాసితులకు అత్యుత్తమ సదుపాయాలు కల్పించడం, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించే యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచడం మన సమష్టి బాధ్యత” అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు.
నివాసితుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరముందన్న రక్షణ మంత్రి.. ఏఐ-ఆధారిత ఫిర్యాదుల పరిష్కారం, బహుభాషా సేవలు, స్మార్ట్ హెల్త్ను భాగం చేస్తూ ఇ-ఛవానీ 2.0 వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కంటోన్మెంట్లలోని పేదలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, బుద్ధిమాంద్యంతో గల పిల్లల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. భవిష్యత్ కంటోన్మెంట్లు స్మార్ట్ పవర్ సిస్టమ్లు, పునరుత్పాదక ఇంధన గ్రిడ్లు, ఈవీ ఛార్జింగ్ హబ్లు, స్మార్ట్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లు, ఏఐ-ఆధారిత నిఘా వ్యవస్థలతో స్మార్ట్గా అభివృద్ధి చెందాలని రక్షణ మంత్రి ఆకాంక్షించారు.
ఐడీఈఎస్, కంటోన్మెంట్ బోర్డుల ఆర్థిక స్వాతంత్య్రం కోసం మద్దతు పలికిన రక్షణ మంత్రి.. ఈ అంశంపై మేధోమథనం చేయాలనీ, దార్శనికత సాకారం కోసం ఒక ప్రాథమిక ప్రణాళికనూ సిద్ధం చేయాలని కోరారు. ఈ ప్రయత్నంలో ప్రభుత్వ సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసానిచ్చారు.
చిరు వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకురసంస్థలను ప్రోత్సహించడానికి ఇ-కనెక్ట్ వంటి వేదికలను ప్రారంభించడం సహా కంటోన్మెంట్లలో వ్యాపార నిర్వహణ సులభతరం చేయడానికి డీజీడీఈ చేసిన ప్రయత్నాలను శ్రీ రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. పర్యావరణ హితమైన కంటోన్మెంట్ బోర్డుల ఏర్పాటు సంకల్పాన్ని ఆయన అభినందించారు. “పచ్చదనం క్షీణిస్తున్న నేటి సమయలో అభివృద్ధి-పర్యావరణం కలిసి ఉండవచ్చని కంటోన్మెంట్లు రుజువు చేస్తున్నాయి” అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు.
సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో నిరంతర పురోగతిని దృష్టిలో ఉంచుకుని అధికారులు తమ నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని రక్షణ మంత్రి కోరారు.“చేస్తున్న పనిని కేవలం ఉద్యోగంగా పరిగణించకూడదు. ఇది జాతి నిర్మాణానికి ఒక మాధ్యమం. మీ ప్రతిభను, శక్తిని, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతిరోజూ మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. మీరు చేసే ప్రతి ప్రయత్నం దేశాన్ని బలోపేతం చేస్తుంది” అని ఆయన అధికారులకు సూచించారు.
వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, డైరెక్టర్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్స్ (డీజీడీఈ) శ్రీ శైలేంద్ర నాథ్ గుప్తా, డీజీడీఈగా నియమితులైన శ్రీమతి శోభా గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రక్షణ భూముల నిర్వహణ రంగంలో గత ఏడాది కాలంగా డీజీడీఈ నిర్వహించిన అత్యుత్తమ కార్యక్రమాలు, సాధించిన విజయాలపై ప్రత్యేక ప్రదర్శనలు.. వికసిత్ భారత్@2047 సాధన కోసం వ్యూహాత్మక రోడ్మ్యాప్... ప్రారంభ సమావేశంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. రెండో రోజు సమావేశంలో భూ వనరుల శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి, భారత అటార్నీ జనరల్ శ్రీ ఆర్ వెంకటరమణి, భారత డిప్యూటీ కంప్ట్రోలర్-ఆడిటర్ జనరల్ శ్రీ సుబీర్ మాలిక్, ఇతర మేధావులు, నిపుణులతో సమావేశాలు నిర్వహిస్తారు.
రక్షణ రంగంలో భూముల నిర్వహణ గురించిన కొత్త ఆలోచనలు రూపొందించడం, అధునాతన డిజిటల్ సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం, పాలనాపరమైన ప్రాథమిక ప్రణాళికలు, సుస్థిరతను బలోపేతం చేయడంలో మెరుగవుతున్న డీజీడీఈ పాత్రపై ఈ సమావేశం దృష్టి సారిస్తోంది. రక్షణ రంగంలో భూ నిర్వహణ భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన అంశాలపై సీనియర్ ప్రభుత్వ అధికారులు, ఈ రంగానికి చెందిన నిపుణుల అభిప్రాయాలు పంచుకునే సమావేశాలు, వారి ప్రసంగాలు దీనిలో భాగంగా ఉంటాయి.
****
(Release ID: 2168328)