కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సిమ్ అమ్మకాలతో పాటు మొబైల్ రీచార్జి సేవలను అందించడానికి తపాలా విభాగం, బీఎస్ఎన్ఎల్ వ్యూహాత్మక అవగాహన ఒప్పందం
Posted On:
17 SEP 2025 7:48PM by PIB Hyderabad
కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ఆధీనంలో పనిచేస్తున్న తపాలా శాఖ (డీఓపీ), భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ రోజు ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ మొబైల్ అనుసంధాన సేవలను దేశమంతటా విస్తరించడం ఈ ఒప్పందం ఉద్దేశం.
ఎంఓయూపై డీఓపీ పక్షాన పౌర ప్రధాన సేవలు, ఆర్బీ జనరల్ మేనేజర్ మనీషా బన్సల్ బాదల్, బీఎస్ఎన్ఎల్ పక్షాన ఆ సంస్థ అమ్మకాలు, మార్కెటింగ్, కన్స్యూమర్ మొబిలిటీ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ దీపక్ గర్గ్ సంతకాలు చేశారు.
ఒప్పందంలో భాగంగా, తపాలా శాఖ ఒక లక్షా అరవై అయిదు వేల కన్నా ఎక్కువగా ఉన్న తపాలా కార్యాలయాల ద్వారా వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులతో పాటు మొబైల్ రీచార్జి సేవలను అందుబాటులోకి తీసుకు వస్తుంది. మన దేశంలో దాదాపు ప్రతి గ్రామానికీ, ప్రతి పట్టణానీకీ విస్తరించిన ఇండియా పోస్ట్ నెట్వర్కు.. బీఎస్ఎన్ఎల్ సేవలను గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలలో కూడా అందించగలిగేందుకు ఓ వారధిగా ఉపయోగపడుతుంది.
దేశంలో సుదూర ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం అరకొర సంధాన సదుపాయంతో తరచు ఇబ్బందులను ఎదుర్కోవాల్సివస్తోంది. బీఎస్ఎన్ఎల్ టెలికం సేవలను ఇప్పటి కన్నా ఎక్కువగా, మరింత మందికి.. ప్రధానంగా దేశంలో సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి చెంతకు.. చేర్చడమే తాజా అవగాహన ఒప్పంద ఉద్దేశం. తపాలా కార్యాలయాలలో వివిధ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ భాగస్వామ్యంతో తగిన ఏర్పాట్లు చేసి గ్రామీణ కుటుంబాలకు మొబైల్ సంబంధిత సేవలను అందించడం ద్వారా డిజిటల్ వారధిని నిర్మించాలని భావిస్తున్నారు. దీంతో సామాజిక, ఆర్థిక అభివృద్ధి, సమాజంలో అన్ని వర్గాల వారు ఆర్థిక సేవలను అందుకొనేటట్లు చూడడం, ‘డిజిటల్ ఇండియా’ను ఆవిష్కరించడం వంటి విస్తృత లక్ష్యాలను సాధనలో ముందడుగు వేయాలని ఆశిస్తున్నారు. ఈ దిశగా అస్సాంలో చేపట్టిన ప్రయత్నాలు ఇప్పటికే చక్కని ఫలితాలను అందించి, ఈ కృషిని అఖిల భారత స్థాయిలోనూ విస్తరించ వచ్చని నిరూపించాయి.
ఇకపై తపాలా కార్యాలయాలు బీఎస్ఎన్ఎల్ తరఫున విక్రయ కేంద్రాలు (పాయింట్స్ ఆఫ్ సేల్..పీఓఎస్)గా వ్యవహరిస్తాయి. బీఎస్ఎన్ఎల్ మొబైల్ సిమ్, మొబైల్ రీచార్జులను పోస్టాఫీసుల్లో పొందవచ్చు. సిమ్ నిల్వలను, శిక్షణను బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది. తపాలా శాఖ తన వంతుగా కొత్త వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపేటట్లు తోడ్పడడంతో పాటు లావాదేవీలు సురక్షితంగా, నిర్దేశిత ప్రమాణాల మేరకు పూర్తి అయ్యేటట్లు ఉపయోగపడుతుంది.
‘‘చౌకైన అనుసంధానాన్ని దేశంలో అందరికీ అందుబాటులోకీ తీసుకు రావడానికి ఈ భాగస్వామ్యం.. ఇండియా పోస్ట్ సువిశాల, విశ్వసనీయ వ్యవస్థను టెలికం రంగంలో బీఎస్ఎన్ఎల్ సాధించుకున్న ప్రావీణ్యానికి జోడిస్తుంది’’ అని తపాలా విభాగం పౌర ప్రధాన సేవలు, ఆర్బీ జనరల్ మేనేజర్ మనీషా బన్సల్ బాదల్ తెలిపారు.
బీఎస్ఎన్ఎల్ అమ్మకాలు, మార్కెటింగ్, కన్స్యూమర్ మొబిలిటీ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ దీపక్ గర్గ్ మాట్లాడుతూ, ‘‘ఈ సహకార ఒప్పందంతో, బీఎస్ఎన్ఎల్ సేవలు ఇక దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తాయి.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల వారు ఇంతవరకు ఈ సేవలకు నోచుకోని ప్రాంతాల వారు మొబైల్ సేవలను తమకు అతి దగ్గరగా ఉన్న పోస్టాఫీసులో అందుకోగలుగుతారు’’ అన్నారు.
నేటి నుంచి ఒక సంవత్సరం వరకు అమలులో ఉండే ఈ ఒప్పందాన్ని ఆ తరువాత పునరుద్ధరించుకొనేందుకు అవకాశం ఉంది. సేవల లభ్యత తీరును పక్కాగా పర్యవేక్షించడం, నెల నెలా సమీక్షించడం, సైబర్ భద్రత పరిరక్షణ అంశాలతో పాటు సమాచార గోప్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించడానికి ఇరు పక్షాలు చేతులు కలిపాయి. ఈ అవగాహన ఒప్పందం దేశవ్యాప్తంగా ఇండియా పోస్ట్కున్న విస్తృత వ్యవస్థతో బీఎస్ఎన్ఎల్ టెలికం మౌలిక సదుపాయాలను జత చేస్తూ, పౌరులకు సేవ చేయడానికి ప్రభుత్వ రంగానికి ఉన్న సత్తాను సమర్థంగా వినియోగించడంలో ఓ కొత్త ప్రమాణాన్ని ఏర్పరచబోతోంది.

న్యూఢిల్లీలో ఎంఓయూపై సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న తపాలా విభాగం (పౌర ప్రధాన సేవలు, ఆర్బీ) జనరల్ మేనేజర్ మనీషా బన్సల్ బాదల్, బీఎస్ఎన్ఎల్ (అమ్మకాలు, మార్కెటింగ్, కన్స్యూమర్ మొబిలిటీ) ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ దీపక్ గర్గ్
***
(Release ID: 2168270)