గనుల మంత్రిత్వ శాఖ
స్వచ్ఛ భారత్ మిషన్లో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామ్యం...
‘స్వచ్ఛతా హీ సేవా - 2025’లో భాగంగా దేశమంతటా స్వచ్ఛతా పరిరక్షణ కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు
Posted On:
15 SEP 2025 6:14PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘స్వచ్ఛ భారత్ అభియాన్’లో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు ‘‘స్వచ్ఛతా హీ సేవ’’ (ఎస్హెచ్ఎస్) పేరిట అనేక కార్యక్రమాలను నిర్వహించడానికి జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సన్నాహలు చేస్తోంది. ఈ సంవత్సరం ‘‘స్వచ్ఛోత్సవ్’’ను ఇతివృత్తంగా తీసుకుని స్వచ్ఛ, హరిత ఉత్సవాలతో పాటు వ్యర్థాల జాడ ఉండని సమాజాన్ని ఆవిష్కరించడం ప్రధానంగా పలు కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ‘ఎస్హెచ్ఎస్-2025’కు నిర్దేశించిన అయిదు లక్ష్యాలపై జీఎస్ఐ శ్రద్ధ వహిస్తుంది. ఆ అయిదు లక్ష్యాలలో.. క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ల (సీటీయూస్)లో మార్పు తీసుకురావడం, బహిరంగ ప్రదేశాల పునరుద్ధరణ, ‘సఫాయి మిత్రుల’ రక్షణ, స్వచ్ఛ హరిత ఉత్సవాలను ప్రోత్సహించడంతో పాటు స్వచ్ఛతతో ముడిపడ్డ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం.. భాగంగా ఉన్నాయి. ఈ ప్రయత్నాలన్నిటితో ఉమ్మడి బాధ్యతకు స్ఫూర్తిని అందిస్తూ, స్వచ్ఛతను రోజువారీ జీవితంలో ఓ అంతర్భాగం చేయాలని జీఎస్ఐ ధ్యేయంగా పెట్టుకుంది.
దేశమంతటా ఉన్న జీఎస్ఐ కార్యాలయాల్లో ఈ నెల 17న ‘సామూహిక స్వచ్ఛతా ప్రతిజ్ఞ’ను స్వీకరించడంతో ఈ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. ఇదే సందర్భంగా ‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం, చెత్తతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వదిలించుకోవడంతో పాటు సమాజానికి ‘సఫాయి మిత్రులు’ అందిస్తున్న అమూల్య సేవలను గమనించి వారిని సన్మానిస్తారు.
క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ల (సీటీయూస్)లో మార్పు తీసుకురావడం ఈ ప్రచార ఉద్యమ ప్రధాన లక్ష్యం. ‘బ్లాక్ స్పాట్ల’ను దత్తత తీసుకొని, స్థానికులు, అధికారుల సహకారంతో వాటిని నవీకరించడానికి దేశంలో 34 సీటీయూలను జీఎస్ఐ గుర్తించింది. దీంతో దీర్ఘకాలిక సంరక్షణనూ, స్థిరత్వాన్నీ తీసుకొస్తారు. క్లీన్ పబ్లిక్ స్పేసెస్ కార్యక్రమంలో భాగంగా, జీఎస్ఐ తన కార్యాలయాలు, మార్కెట్ ఏరియాలు, పార్కులు, ట్రాన్స్పోర్ట్ హబ్స్ భూ-వారసత్వ స్థలాల్లో వ్యవస్థాగత పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పరిసరాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రజల భాగస్వామ్యం, కార్యకలాపాలను కలిసికట్టుగా చేపట్టడం ప్రధానమని చాటిచెబుతారు.
సఫాయి మిత్ర సురక్ష శిబిరాలను జీఎస్ఐ ఏర్పాటు చేస్తుంది. రోగ నివారణే ప్రధానంగా ఆరోగ్య పరీక్షలను నిర్వహించి, పీపీఈ కిట్లను పంపిణీ చేయడంతో పాటు సఫాయి మిత్రుల స్వస్థత, సురక్షకు పూచీపడడానికి సామాజిక సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. స్వచ్ఛ హరిత ఉత్సవంలో భాగంగా, జీఎస్ఐ తన అన్ని యూనిట్లలో పర్యావరణానుకూల సంబురాల వైపు మొగ్గు చూపుతుంది. వ్యర్థ పదార్థాలకు చోటివ్వని పూజా కార్యక్రమాలు, బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛత రంగవల్లులను తీర్చడం, వ్యర్థాలతో కళాత్మక ఆకృతులకు రూపకల్పన చేయడం, ఉత్సవాల తరువాత ఆయా చోట్లను మళ్లీ అద్దంలా ఉండేటట్లు శుభ్రపరచడంపై శ్రద్ధ తీసుకుంటారు.
స్వచ్ఛతతో ముడిపడ్డ కార్యకలాపాలపై ఈ ప్రచార ఉద్యమంలో దృష్టి సారిస్తారు. యువతీయునవకులు, విద్యార్థినీ విద్యార్థులతో పాటు ప్రజలకు కూడా స్వచ్ఛత సందేశాన్ని ఇవ్వడానికి ర్యాలీలను, మానవ హారాలను, జాగృతి చర్చలను, పాఠశాలల్లో పోటీలను, ఇతర సృజనాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.
ఈ నెల 25న ‘‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’’ పేరుతో దేశవ్యాప్తంగా సాగే కార్యక్రమంలో జీఎస్ఐ పాల్గొంటుంది. అధికారులు, సిబ్బంది, స్థానికులు వేర్వేరు చోట్ల ఒక గంట సేపు స్వచ్ఛత అభియాన్లో పాలుపంచుకుంటారు. ఇది ఐకమత్యానికి ఉండే శక్తిని చాటిచెప్పనుంది. వారసత్వ స్థలాలపై ప్రత్యేకంగా శ్రద్ధను కనబరుస్తారు. దీనిలో భాగంగా.. ఒడిశాలోని నోమిరా పిలో లావా, బీహార్లోని బరాబర్ గుహలు, గుజరాత్లోని డైనోసార్ ఫాజిల్ పార్కులతో పాటు రాజస్థాన్లో ‘సేంద్డా గ్రానైట్’.. ఈ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛత, జాగృతి ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ కార్యకలాపాలు పర్యావరణ స్థిరత్వం, వారసత్వ పరిరక్షణల పట్ల జీఎస్ఐకున్న నిబద్ధతకు అద్దం పడతాయి.
ఈ ప్రచార కార్యక్రమానికి మహాత్మాగాంధీ జయంతి అక్టోబరు 2న స్వస్తి చెబుతారు. ముగింపు కార్యక్రమంలో, సఫాయి మిత్రులతో పాటు స్వచ్ఛతా హీ సేవా 2025 ప్రచార ఉద్యమంలో అసాధారణ రీతిలో భాగస్వాములైనవారిని జీఎస్ఐ సత్కరిస్తుంది. ఈ ఉమ్మడి కృషితో, జీఎస్ఐ స్వచ్ఛ భారత్ మిషన్ అంశంలో తానెంత నిబద్ధతతో ఉందీ పునరుద్ఢాటిస్తూనే స్వచ్ఛత ఓ ఉమ్మడి సామాజిక బాధ్యత అన్న అంశాన్ని స్పష్టం చేయబోతోంది.
***
(Release ID: 2167396)
Visitor Counter : 29