గనుల మంత్రిత్వ శాఖ
సుస్థిరతను పెంపొందిస్తున్న గనుల మంత్రిత్వ శాఖ: ఇ- వ్యర్థాలపై ప్రత్యేక దృష్టితో స్పెషల్ క్యాంపెయిన్ 5.0కు సన్నాహాలు
నాడు పోస్టు చేయడమైనది:
15 SEP 2025 5:44PM by PIB Hyderabad
సుస్థిర నిర్వహణ, పరిపాలన సామర్థ్యాన్ని ప్రోత్సహించడంలో గనుల మంత్రిత్వ శాఖ ఆదర్శంగా నిలుస్తోంది. స్పెషల్ క్యాంపెయిన్ 4.0 విజయవంతమైన నేపథ్యంలో, ఇప్పుడు స్పెషల్ క్యాంపెయిన్ 5.0కి మంత్రిత్వ శాఖ సన్నద్ధమవుతోంది. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఇ- వ్యర్థాల నిర్వహణ నియమాలు- 2022కు అనుగుణంగా ఇ-వ్యర్థాల తొలగింపుపై ఇందులో ప్రత్యేకంగా దృష్టి సారించింది.
స్పెషల్ క్యాంపెయిన్ 4.0 (2024 అక్టోబర్ 2 - 2024 అక్టోబర్ 31) సందర్భంగా దేశవ్యాప్తంగా 376 కార్యకలాపాలను మంత్రిత్వ శాఖ చేపట్టింది. వీటిలో భాగంగా 1,65,119 చదరపు అడుగుల మేర కార్యాలయ స్థలాలను శుభ్రపరచి, వ్యర్థాలను క్రమబద్ధంగా తొలగించడం ద్వారా రూ.1.1 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. హైదరాబాద్లోని భారత భూ సర్వేక్షణ సంస్థ (జీఎస్ఐటీఐ)లో కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి చేతుల మీదుగా రూఫ్ టాప్ సౌర విద్యుత్ ప్లాంటు ప్రారంభోత్సవం, జాతీయ రహదారి-6 వెంబడి ఉన్న రాణి లక్ష్మీబాయి ఉద్యాన్ పబ్లిక్ పార్కు వద్ద 1.6 టన్నుల అల్యూమినియం వ్యర్థాలతో తయారు చేసిన కళాకృతిని నెలకొల్పడం, మధ్యప్రదేశ్లోని ఎంసీపీ - ఐసీసీ యూనిట్ వద్ద 1,000 కేడబ్ల్యూపీ సామర్థ్యం గల నేలపై నిలిపిన (గ్రౌండ్ మౌంటెడ్) సోలార్ ప్యానెళ్లను పూర్తి చేయడం, సేంద్రీయ వ్యర్థాల నిర్వహణ కోసం నాగపూర్లోని ఎంఈసీఎల్లో వినూత్న కంపోస్టింగ్ యంత్రం అభివృద్ధి వంటి కీలక కార్యక్రమాలు.. ఈ క్యాంపెయిన్ ఇతివృత్తం ‘సుస్థిరత’ను ప్రతిబింబిస్తున్నాయి.
ఈ వేగాన్ని మరింత పెంచుతూ, 2024 నవంబరు - 2025 ఆగస్టు మధ్య.. మంత్రిత్వ శాఖ, క్షేత్రస్థాయిలోని దాని కార్యాలయాలు 1,080,590 చదరపు అడుగుల మేర కార్యాలయ స్థలాల్లో కాలం చెల్లిన రికార్డులు, వ్యర్థాలను శుభ్రపరచడం ద్వారా రూ.11.05 కోట్ల ఆదాయం సమకూరింది. 2,172 ఫైళ్ల తొలగింపు, 938 ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ద్వారా.. రికార్డుల నిర్వహణ, ప్రజా సేవలు మెరుగుపడ్డాయి.
దీన్ని ముందుకు తీసుకెళ్తూ.. స్పెషల్ క్యాంపెయిన్ 5.0 సన్నాహక దశలో (2025 సెప్టెంబరు 15 – 30) పీఎంవో, వీఐపీ రిఫరెన్సులు, రాష్ట్ర ప్రభుత్వం, పార్లమెంటరీ అంశాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు సంబంధించి కీలక లక్ష్యాలను గుర్తించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వీటితోపాటు రికార్డులు, కార్యాలయ నిర్వహణ పద్ధతులను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అమలు దశలో (2025 అక్టోబరు 2 – 31) అనుబంధ, ఆధీన కార్యాలయాలు, సీపీఎస్ఈలు, స్వయంప్రతిపత్త సంస్థలు, ఇతర భాగస్వామ్య పక్షాల సమష్టి కృషితో ఇ- వ్యర్థాల సురక్షిత, బాధ్యతాయుత నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారిస్తారు.
ఈ నిరంతర ప్రయత్నాల ద్వారా.. గనుల మంత్రిత్వ శాఖ పరిపాలన ప్రక్రియలను బలోపేతం చేయడంతోపాటు సుస్థిరాభివృద్ధికి చేయూతనిస్తోంది. బాధ్యతాయుత పాలనతో ఆదర్శంగా నిలవడంతోపాటు ప్రజా సంక్షేమాన్ని పెంపొందిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2167378)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19