సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
మారిషస్ ప్రధానితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధాని ప్రకటన
Posted On:
11 SEP 2025 4:02PM by PIB Hyderabad
ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రాం గూలం గారు,
ఇరు దేశాల ప్రతినిధులు,
మీడియా మిత్రులకు,
నమస్కారం,
నా పార్లమెంటరీ నియోజకవర్గానికి మిమ్మల్ని స్వాగతించడం నాకు గర్వకారణం. కాశీ ఎల్లవేళలా భారత నాగరికతకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక.
శతాబ్దాల కిందటే మన సంస్కృతీ సంప్రదాయాలు భారత్ నుంచి మారిషస్కు వెళ్లి అక్కడి దైనందిన జీవితంలో భాగమయ్యాయి. కాశీలో శాశ్వత గంగావాహిని లాగే.. నిరంతర భారతీయ సంస్కృతీ ప్రవాహం మారిషస్ ను సుసంపన్నం చేసింది.
నేడు మారిషస్ మిత్రులకు కాశీలో మనం స్వాగతం పలుకుతున్నాం. ఇది కేవలం లాంఛనప్రాయం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సంగమం. అందుకే భారత్ - మారిషస్ భాగస్వాములు మాత్రమే కాదు.. ఒకే కుటుంబమని నేను గర్వంగా చెప్తాను.
మిత్రులారా,
‘పొరుగు దేశాలకు ప్రాధాన్యం’ అన్న భారత్ విధానం, మన ‘మహాసాగర్’ లక్ష్యంలో మారిషస్ది కీలక పాత్ర. మార్చిలో మారిషస్ జాతీయ దినోత్సవానికి హాజరయ్యే అవకాశం నాకు లభించింది. అప్పుడే మా సంబంధాలను ‘మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యం’గా ఉన్నతీకరించాం. అన్ని రంగాల్లోనూ సహకారంపై నేడు వివరంగా మేం సమీక్షించాం. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించాం.
మిత్రులారా,
చాగోస్ ఒప్పందం ఖరారైన సందర్భంగా ప్రధానమంత్రి రాం గూలం గారికి, మారిషస్ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు. మారిషస్ సార్వభౌమత్వానికి ఇదొక చరిత్రాత్మక ప్రస్థానం. వలసవాద నిష్క్రమణకు, మారిషస్ సార్వభౌమత్వాన్ని సంపూర్ణంగా గుర్తించేందుకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తూనే ఉంది. ఈ ప్రయాణంలో భారత్ ఎల్లవేళలా మారిషస్కు అండగా నిలిచింది.
మిత్రులారా,
మారిషస్ అభివృద్ధిలో విశ్వసనీయ ప్రాథమిక భాగస్వామిగా ఉండడం భారత్కు గర్వకారణం. మారిషస్ అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా రూపొందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఈ రోజు మేం ప్రకటించాం. ఇది మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఆరోగ్య రక్షణ సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తుంది.
భారత్ వెలుపల తొలి జనఔషధి కేంద్రాన్ని మారిషస్లో నెలకొల్పాం. నేడు మారిషస్లో ఆయుష్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, 500 పడకల సర్ శివ్ సాగూర్ రాం గూలం నేషనల్ హాస్పిటల్, పశువైద్య పాఠశాల, పశువుల ఆస్పత్రుల ఏర్పాటులో భారత్ సహకారాన్ని అందించాలని నేడు నిర్ణయించాం.
అదే సమయంలో.. చాగోస్ సముద్ర రక్షిత ప్రాంతం, ఎస్ఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏటీసీ టవర్, హైవేలూ రింగ్ రోడ్డుల విస్తరణ వంటి ప్రాజెక్టులను కూడా మేం అభివృద్ధి చేస్తాం.
ఈ ప్యాకేజీ కేవలం సాయం కాదు.. మన సమష్టి భవితకు పెట్టుబడి.
మిత్రులారా,
యూపీఐ, రూపే కార్డులను మారిషస్లో గతేడాది ప్రారంభించాం. ఇప్పుడు స్థానిక కరెన్సీల్లో వాణిజ్యాన్ని ప్రారంభించే దిశగా కృషి చేస్తాం.
ఇంధన భద్రత మన భాగస్వామ్యానికి ముఖ్యాధారం. మారిషస్ ఇంధన పరివర్తనలో భారత్ అండగా నిలుస్తోంది. మేం మారిషస్కు 100 ఎలక్ట్రిక్ బస్సులను అందిస్తున్నాం. వాటిలో పదింటిని ఇప్పటికే పంపించాం. ఇంధన రంగంలో కుదిరిన సమగ్ర భాగస్వామ్య ఒప్పందం ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. టామరిండ్ జలపాతం వద్ద 17.5 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు కూడా సహకరించాలని మేం నిర్ణయించాం.
మానవ వనరుల అభివృద్ధి రంగంలో మాకు దీర్ఘకాల భాగస్వామ్యం ఉంది. మారిషస్కు చెందిన 5,000 మందికి పైగా పౌరులు ఇప్పటికే భారతదేశంలో శిక్షణ పొందారు. 500 మంది సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇవ్వాలని మార్చిలో నేను మారిషస్ ను సందర్శించిన సమయంలో నిర్ణయించాం. మొదటి బ్యాచ్ ప్రస్తుతం ముస్సోరీలో శిక్షణ పొందుతుండడం సంతోషాన్నిచ్చే విషయం.
మారిషస్లో కొత్త ‘డైరెక్టరేట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ ఏర్పాటుకు ఈ రోజు మేం నిర్ణయించాం. మిషన్ కర్మయోగి శిక్షణ మ్యాడ్యూళ్లను కూడా త్వరలోనే మారిషస్లో ప్రారంభించబోతున్నాం.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- మద్రాస్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ రెండూ మారిషస్ విశ్వవిద్యాలయంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలతో పరిశోధన, విద్య, ఆవిష్కరణల్లో మన భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరుతుంది.
మిత్రులారా,
స్వేచ్ఛాయుత, సార్వత్రిక, సురక్షిత, స్థిరమైన, సుసంపన్నమైన హిందూ మహాసముద్రం మన ఉమ్మడి ప్రాధాన్యం. ఈ నేపథ్యంలో.. మారిషస్ ప్రత్యేక ఆర్థిక మండలి భద్రతను బలోపేతం చేయడానికి, సముద్ర సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉంది.
హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అంశాలపై భారత్ ఎల్లప్పుడూ అందరికన్నా ముందుగా స్పందించడమేకాకుండా, అక్కడ కీలక రక్షణ చర్యలనూ తీసుకుంటున్నది.
మారిషస్ తీర రక్షక దళం నావను తిరిగి బాగుచేసే పని భారత్లో జరుగుతోంది. అంతేకాకుండా, వారి 120 మంది అధికారులు భారత్లో శిక్షణ పొందుతున్నారు.
జలాధ్యయన (హైడ్రోగ్రఫీ) రంగంలో సహకారంపై ఈ రోజు ఓ ఒప్పందం కుదిరింది. రాబోయే అయిదేళ్లలో.. ఉమ్మడి సర్వేలు, నౌకాయాన చిత్రపటాలు, ఈఈజెడ్ సంబంధిత హైడ్రోగ్రఫీ డేటాపై కలిసి పనిచేస్తాం.
గౌరవనీయులారా,
భారత్, మారిషస్ - రెండూ వేర్వేరు దేశాలే అయినా... వాటి స్వప్నాలు, గమ్యం ఒక్కటే.
ఈ ఏడాది సర్ శివ్ సాగర్ రాం గూలం 125వ జయంతిని నిర్వహించుకుంటున్నాం. ఆయన మారిషస్ జాతిపిత మాత్రమే కాదు... భారత్ - మారిషస్ మధ్య శాశ్వత వారధిని నిర్మించిన వాస్తుశిల్పి కూడా. మన సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేలా కలిసి పనిచేయడానికి ఆయన జయంతి మనకు స్ఫూర్తినిస్తుంది.
ప్రతినిధి బృందానికి మరోసారి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి ప్రకటనకు ఇంచుమించుగా చేసిన అనువాదమిది. మౌలిక ప్రకటన హిందీలో చేశారు.
***
(Release ID: 2165734)
Visitor Counter : 2