నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
ఏఎల్ఎంఎం ద్వారా 100 గిగావాట్ల సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని చేరుకున్న భారత్
* ఏఎల్ఎంఎం ద్వారా సోలార్ పీవీ తయారీ సామర్థ్యం 2014లో 2.3 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకు గణనీయంగా పెరిగింది: కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి
Posted On:
13 AUG 2025 8:00PM by PIB Hyderabad
సోలార్ పీవీ మాడ్యూళ్ల కోసం ఆమోదించిన నమూనాలు, తయారీదారుల జాబితా (ఏఎల్ఎంఎం) ప్రకారం 100 గిగావాట్ల సోలార్ పీవీ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యాన్ని భారత్ సాధించింది. స్వచ్ఛ ఇంధన పరివర్తనలో ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి, అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా దృఢమైన, స్వావలంబన సాధించిన సౌర తయారీ వ్యవస్థను నిర్మించడంలో దేశం సాధిస్తున్న వేగవంతమైన పురోగతిని ఈ విజయం ప్రతిబింబిస్తుంది.
‘‘ఆమోదించిన నమూనాలు, తయారీదారుల జాబితా (ఏఎల్ఎంఎం) ప్రకారం భారత్ 100 గిగావాట్ల సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని సాధించింది. 2014లో 2.3 గిగా వాట్ల నుంచి గణనీయంగా ఈ సామర్థ్యం పెరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, అధిక సామర్థ్యం ఉన్న సోలార్ మాడ్యూళ్ల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) లాంటి పరివర్తనాత్మక పథకాల ద్వారా దృఢమైన, స్వావలంబన సాధించిన సోలార్ తయారీ రంగాన్ని నిర్మిస్తున్నాం. ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ దిశగా మన ప్రయాణాన్ని బలోపేతం చేయడానికి, 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధనాల సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పడుతుంది’’ అని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషి అన్నారు.
సోలార్ ప్యానెళ్ల తయారీలో దేశాన్ని స్వయం సమృద్ధం చేయాలని, అంతర్జాతీయ విలువ ఆధారిత వ్యవస్థలో కీలకంగా మార్చాలనే అంకితభావంతో భారత ప్రభుత్వం ఉంది. ఈ నిబద్ధతకు అత్యధిక సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యూళ్ల కోసం పీఎల్ఐ పథకంతో సహా ఇతర సమగ్ర పథకాలు, దేశీయ తయారీదారులకు సమాన అవకాశాలు అందించే చర్యల తోడ్పాటు లభిస్తోంది. వీటి సానుకూల ప్రభావం ఫలితంగా సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యం 2014లో 2.3 గిగావాట్ల నుంచి ప్రస్తుతం 100 గిగావాట్లకు చేరుకుంది. ఇది 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్న భారత్ లక్ష్యాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే అంతర్జాతీయంగా చేపడుతున్న డీకార్బనైజేషన్ ప్రయత్నాలకు అర్థవంతమైన సహకారాన్ని అందిస్తుంది.
నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) 2019, జనవరి 2న ఈ ఏఎల్ఎంఎం ఉత్తర్వులను జారీ చేసింది. సోలార్ పీవీ మాడ్యూళ్ల కోసం మొదటి ఏఎల్ఎంఎం జాబితా 2021, మార్చి 10న ప్రచురితమైంది. దీని ప్రారంభ నమోదు సామర్థ్యం 8.2 గిగావాట్లుగా ఉంది. నాలుగేళ్ల వ్యవధిలోనే ఈ సామర్థ్యం 12 రెట్లు కంటే ఎక్కువగా 100 గిగావాట్లను అధిగమించింది. దీనితో పాటుగా తయారీదారుల సంఖ్య సైతం పెరిగింది. ఇది 2021లో 21 నుంచి 100కు చేరుకుంది. వీరంతా ప్రస్తుతం 123 తయారీ యూనిట్లను నిర్వహిస్తున్నారు.
ఈ రంగంలో ఇప్పటికే నిలదొక్కుకున్న సంస్థలు, కొత్తగా ప్రారంభమైన సంస్థలు ఈ వృద్ధిని సాధించేందుకు తోడ్పడ్డాయి. ఈ సంస్థల్లో ఎక్కువ భాగం అత్యధిక సామర్థ్యం ఉన్న సాంకేతికతలు, వివిధ అంచెల్లో సమగ్ర సరఫరా వ్యవస్థలను అనుసరిస్తున్నాయి. దీని ఫలితంగా, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను తీర్చగల వైవిధ్యమైన, పోటీతత్వం నిండిన తయారీ వ్యవస్థ ఏర్పాటయింది. 100 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని అధిగమించడం ద్వారా భారత సోలార్ పీవీ తయారీ రంగం సాధించిన విజయం, పరిశ్రమ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సమష్టి ప్రయత్నాలు స్పష్టమవుతున్నాయి.
నిరంతర విధాన మద్ధతు, మౌలిక వసతుల అభివృద్ధి, ఆవిష్కరణల ద్వారా సోలార్ తయారీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎంఎన్ఆర్ఈ కట్టుబడి ఉంది. భారత సౌర విద్యుత్ ప్రయాణాన్ని సమ్మిళితంగా, పోటీతత్వంగా, భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా ఉండేలా చూసుకోవడానికి మంత్రిత్వ శాఖ భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది.
***
(Release ID: 2156304)