రైల్వే మంత్రిత్వ శాఖ
క్లౌడ్ సాంకేతికతతో రైల్ వన్ యాప్ నిర్వహణ
అందుబాటులోకి ఆధునిక ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ (పీఆర్ఎస్): అశ్విని వైష్ణవ్
ఇటీవల ప్రారంభమైన రైల్వే వన్ యాప్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా మొబైల్ ద్వారా రిజర్వేషన్, రిజర్వుడుకాని టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం
ప్రయాణికుల అవసరాలు, ప్రాధాన్యతలను తీర్చేందుకు వీలుగా నిమిషానికి 25,000 టికెట్లను ఇచ్చే ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థను 1,00,000 టికెట్లు ఇచ్చే స్థాయికి ఆధునికీకరించిన రైల్వే
అనుకోని పరిస్థితుల వల్ల రిజర్వేషన్ రద్దు చేసుకోవటాన్ని తగ్గించేందుకు, ట్రెండ్కు అనుగుణంగా బుకింగ్ ఉండేందుకు ముందస్తు రిజర్వేషన్ గడువు 120 నుంచి 60 రోజులకు తగ్గింపు
Posted On:
08 AUG 2025 7:04PM by PIB Hyderabad
రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెంటర్ (సీఆర్ఐఎస్) నేతృత్వంలో భారతీయ రైల్వే ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థను (పీఆర్ఎస్) పూర్తిగా మారుస్తున్నారు. కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు సులభతరమయ్యే అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దీని కోసం హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్క్ పరికరాలు, భద్రతా మౌలిక సదుపాయాలతో ప్రస్తుత వ్యవస్థను అప్గ్రేడ్ చేయటం కానీ, మార్చేయటం కానీ చేస్తున్నారు.
ప్రస్తుత పీఆర్ఎస్ వ్యవస్థ 2010 నుంచి ఉంది. ఇటానియం సర్వర్లు , ఓపెన్ వీఎంఎస్ (వర్చువల్ మెమరీ సిస్టమ్) ఆధారంగా ఇది నడుస్తోంది. ప్రస్తుత పీఆర్ఎస్ వ్యవస్థను సంప్రదాయ సాంకేతికత వ్యవస్థల నుంచి అధునాతనమైన క్లౌడ్ సాంకేతికత వ్యవస్థలకు అధునికీకరించాల్సిన అవసరం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రయాణికుల ప్రాధాన్యతలు, అవసరాలు మారాయి. ప్రయాణికులు ప్రస్తుతం కోరుకుంటున్న విధంగా ఈ కొత్త పీఆర్ఎస్ ఉంటుంది.
రైల్వే ఇటీవలే రైల్వన్ యాప్ను ప్రారంభించింది. ఈ ఒక్క యాప్ ద్వారానే ప్రయాణికులు మొబైల్ ఫోన్లో రిజర్వేషన్, రిజర్వేనేతర టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇది పీఆర్ఎస్ సదుపాయాన్ని ప్రయాణికులకు మరింత చేరువ చేస్తుంది.
గతంలో రైల్వే టికెట్ బుక్ చేసుకునేందుకు ముందస్తు రిజర్వేషన్ గడువు (ఏఆర్పీ) 120 రోజులుగా ఉండేది. కానీ 2024 నవంబర్ 1 నుంచి దీన్ని ప్రయాణ తేదీ మినహాయించి 60 రోజులకు తగ్గించారు. బుకింగ్ ట్రెండ్కు అనుకూలంగా ఉండేందుకు, అనుకోని సంఘటనల కారణంగా టికెట్ రద్దులను తగ్గించడానికి దీన్ని తీసుకొచ్చారు.
ముందస్తు రిజర్వేషన్ గడువులో మార్పు అనేది నిరంతర ప్రక్రియ. ప్రస్తుత పీఆర్ఎస్ ద్వారా నిమిషానికి 25,000 టికెట్ల బుకింగ్కు మాత్రమే వీలుంది. దీనికి 4 రెట్ల సామర్థ్యంతో కొత్త పీఆర్ఎస్ రూపొందింది.
ఈ సమాచారాన్ని కేంద్ర రైల్వేలు, సమాచార - ప్రసార, ఎలక్ట్రానిక్స్ - ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
***
(Release ID: 2154691)