రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో కలిసి మంగళగిరి నుంచి రూ.5,233 కోట్లు పెట్టుబడితో 272 కిలోమీటర్ల 29 జాతీయ రహదారి ప్రాజెక్టులకు
శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ...
Posted On:
02 AUG 2025 10:02PM by PIB Hyderabad
272 కిలోమీటర్ల మేర విస్తరించిన 29 జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదార్ల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు శ్రీ కింజరాపు రామ్ మోహన్ నాయుడు, శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ, డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులపై రూ.5,233 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నారు.
సభను ఉద్దేశించి శ్రీ గడ్కరీ మాట్లాడుతూ, “ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా.... ప్రమాదభరిత ప్రాంతాలు, రైల్వే క్రాసింగ్లను తొలగించేందుకు, రవాణా ఖర్చులను తగ్గించేందుకు, గ్రామీణ-గిరిజన ప్రాంతాలలో తుది దశలోని అనుసంధానతను బలపర్చేందుకు, తిరుపతి, నెల్లూరు, రాయచోటి వంటి ప్రధాన పట్టణ కేంద్రాల్లో ట్రాఫిక్ను తగ్గించేందుకు ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేసినట్లు చెప్పారు. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ను భారత అభివృద్ధి గాథలో ముందుండే రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు గణనీయంగా తగ్గిన విషయాన్ని శ్రీ గడ్కరీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. మెరుగైన రహదారి మౌలిక సదుపాయాల వల్ల లాజిస్టిక్స్ ఖర్చు 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గిందని, 2025 డిసెంబర్ నాటికి ఇది 9 శాతానికి దిగివచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ తగ్గుదల ఎగుమతులను రెట్టింపు చేయడానికి, ఉద్యోగావకాశాలను పెంచడానికీ దోహదపడుతుందని అన్నారు. అదేవిధంగా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో జాతీయ రహదారుల పొడవు 2014లో 4,000 కిలోమీటర్ల నుంచి 2025లో 8,700 కిలోమీటర్లకు అంటే 120% మేర పెరిగిందని తెలిపారు. ఇది మౌలిక ఆధారిత ఆర్థిక అభివృద్ధిపై ప్రభుత్వం చేసిన గట్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఎన్హెచ్–71లోని మదనపల్లె నుంచి పీలేరు వరకు 56 కిలోమీటర్ల పొడవున్న మార్గాన్ని 4 లైన్ల కారిడార్గా నవీకరించారు. ఈ ప్రాజెక్టుపై రూ.1,994 కోట్లు వెచ్చించారు. ఇందులో 9 ఫ్లైఓవర్లు, ఒక రైలు ఓవర్బ్రిడ్జ్, 19 ప్రధాన వంతెనలు, 5 వాహన అండర్పాస్లు, 10 స్థానిక అండర్పాస్లు ఉన్నాయి.
అదే విధంగా, కర్నూలు నుంచి మండ్లెం వరకు 31 కిలోమీటర్ల పొడవైన ఎన్హెచ్–340సీ రోడ్డును ఫేవ్డ్ షోల్డర్లు కలిగిన నాలుగు లైన్ల మార్గంగా అభివృద్ధి చేశారు. దీన్ని రూ.858 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఇందులో ఒక ఫ్లైఓవర్, 4 వయడక్ట్స్, 3 స్థానిక అండర్పాస్లు, ఒక చిన్న అండర్పాస్ ఉన్నాయి.
ఈ అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచేందుకు మరో 27 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఇవి తిరుపతి, శ్రీశైలం, కదిరి వంటి పుణ్యక్షేత్రాలకు, హార్స్ లీ హిల్స్, ఓడరేవు బీచ్ వంటి పర్యాటక కేంద్రాలకు చేరువ చేస్తాయి. శ్రీ సిటీ, కృష్ణపట్నం పోర్ట్, తిరుపతి విమానాశ్రయం వంటి ఆర్థిక కేంద్రాలకు మరింత కనెక్టివిటీను అందించనున్నాయి.
***
(Release ID: 2152026)