ఆర్థిక మంత్రిత్వ శాఖ
వ్యూహాత్మక, నూతన రంగాల్లో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రీసెర్చి డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ (ఆర్డీఐ) పథకానికి క్యాబినెట్ ఆమోదం
Posted On:
01 JUL 2025 3:09PM by PIB Hyderabad
భారత్లో పరిశోధన, ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చేసే ప్రయత్నాల్లో భాగంగా.. రూ.1 లక్ష కోట్ల కార్పస్ ఫండ్తో రీసెర్చి డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ (ఆర్డీఐ) పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో, పరిశోధనను వాణిజ్యీకరించడంలో ప్రైవేటు రంగం పోషిస్తున్న కీలకపాత్రను గుర్తిస్తూ.. ఆర్డీఐలో ప్రైవేటు రంగం పెట్టుబడులను ప్రోత్సహించడానికి తక్కువ లేదా సున్నా వడ్డీ రేట్లతో దీర్ఘకాల వ్యవధిలో ఫైనాన్సింగ్, రీఫైనాన్సింగ్ను అందించడమే ఆర్డీఐ పథకం లక్ష్యం. నిధుల సమీకరణలో ప్రైవేటు రంగం ఎదుర్కొంటున్న అవరోధాలు, సవాళ్లను అధిగమించడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే నూతన, వ్యూహాత్మక రంగాల్లో ఆవిష్కరణలను సులభతరం చేయడానికి, సాంకేతికత స్వీకరణను ప్రోత్సహించడానికి, పోటీతత్వాన్ని పెంచడానికి వృద్ధి, రిస్క్ క్యాపిటల్ అందించడమే ఈ పథకం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ పథకంలో ప్రధానాంశాలు:
ఎ) నూతనంగా ఆవిర్భవిస్తున్న రంగాలతో పాటు, ఆర్థిక భద్రత, వ్యూహాత్మక ప్రయోజనం, స్వావలంబనకు సంబంధించిన ఇతర రంగాల్లో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను చేపట్టేలా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం.
బీ) ఉన్నత సాంకేతిక సంసిద్ధత స్థాయులు (టీఆర్ఎల్) వద్ద పరివర్తన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం.
సీ) కీలకమైన, లేదా వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యమున్న సాంకేతిక పరిజ్ఞానాలను పొందేందుకు తోడ్పాటు.
డీ) డీప్-టెక్ సంస్థలకు ఫండ్ ఆఫ్ ఫండ్స్ ను ఏర్పాటుచేయడం.
ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే అనుసంధాన్ నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) పాలకమండలి ఆర్డీఐ పథకానికి అవసరమైన విస్తృత వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తుంది. పథకం మార్గదర్శకాలను ఏఎన్ఆర్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) ఆమోదిస్తుంది. అలాగే ద్వితీయ శ్రేణి ఫండ్ మేనేజర్లు, నూతన రంగాల్లో చేపట్టే ప్రాజెక్టుల పరిధి, వాటి రకాన్ని సిఫార్సు చేస్తుంది. కేబినెట్ కార్యదర్శి నాయకత్వంలోని కార్యదర్శుల సాధికారత బృందం (ఈజీవోఎస్) పథకంలో చేసే మార్పులు, రంగాలు, ప్రాజెక్టుల రకాలను ఆమోదిస్తుంది. అలాగే ద్వితీయ శ్రేణి ఫండ్ మేనేజర్ల పనితీరు, పథకం అమలు సమీక్షకు బాధ్యత వహిస్తుంది. ఆర్డీఐ పథకాన్ని అమలు చేయడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్టీ) నోడల్ విభాగంగా పనిచేస్తుంది.
ఆర్డీఐ పథకంలో రెండంచెల నిధుల విధానం ఉంటుంది. మొదటి అంచెలో ఏఎన్ఆర్ఎఫ్ పరిధిలో ప్రత్యేక ప్రయోజన నిధి (ఎస్పీఎఫ్)ను ఏర్పాటు చేస్తారు. ఇది నిధులకు సంరక్షకురాలిగా వ్యవహరిస్తుంది. వివిధ ద్వితీయ శ్రేణి మేనేజర్లకు ఎస్పీఎఫ్ నుంచి నిధులు కేటాయిస్తారు. ఇది ప్రధానంగా దీర్ఘకాలిక రాయితీ రుణాల రూపంలో ఉంటుంది. ఆర్ఎండ్డీ ప్రాజెక్టులకు ద్వితీయ శ్రేణి ఫండ్ మేనేజర్లు ద్వారా ఆర్ఎండ్డీ ప్రాజెక్టులకు అందించే నిధులు తక్కువ వడ్డీ లేదా సున్నా వడ్డీ రేట్లతో దీర్ఘకాలిక రుణం రూపంలో ఉంటాయి. ఈక్విటీ రూపంలో సైతం ఈ రుణాలను ముఖ్యంగా అంకుర సంస్థలకు అందించవచ్చు. డీప్ టెక్ అంకుర సంస్థలకు నిధులు (ఎఫ్ఓఎఫ్), లేదా ఆర్డీఐకు ఉద్దేశించిన ఇతర ఎఫ్ఓఎఫ్ సహకారాన్ని సైతం పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రైవేటు రంగంలో దీర్ఘకాల, అందుబాటులో ఉండే రుణాల కీలక అవసరాన్ని గుర్తించి పరిష్కారం చూపించడం ద్వారా ఆర్డీఐ పథకం స్వావలంబన, అంతర్జాతీయ పోటీ తత్వాన్ని పెంపొందిస్తుంది. తద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా చేస్తున్న ప్రయాణంలో దేశానికి అనుకూలమైన ఆవిష్కరణల వ్యవస్థను సులభతరం చేస్తుంది.
***
(Release ID: 2141234)