పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మనసు.. శరీరం.. ఆత్మల మధ్య సమన్వయ సాధనకు యోగా సరైన పరిష్కారం: పౌర విమానయాన మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు


పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉత్సాహంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

Posted On: 21 JUN 2025 4:00PM by PIB Hyderabad

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సహకారంతో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎమ్ఓసీఏ) న్యూఢిల్లీలోని రాజీవ్‌గాంధీభవన్ ఏవియేషన్ పార్కులో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ (ఐడీవై-2025) వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ, ఏఏఐలకు చెందిన అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు పట్ల వారి నిబద్ధతను చాటింది.

ఈ రోజు తెల్లవారు జామున ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సంప్రదాయిక ప్రదర్శనలు, స్వాగతోపన్యాసం, జ్యోతి ప్రజ్వలన, యోగా ప్రతిజ్ఞ, సర్టిఫైడ్ నిపుణుల నేతృత్వంలో సామూహిక యోగా సాధన నిర్వహించారు. జాతీయ గీతాలాపనతో ఈ వేడుక ముగిసింది.

ఈ కార్యక్రమానికి ఎమ్ఓసీఏ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా, ఏఏఐ చైర్మన్ శ్రీ విపిన్ కుమార్, మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారి భాగస్వామ్యం.. రోజువారీ పని జీవితంలో ఆరోగ్యం, శ్రేయస్సు విధానాలను సమీకృతం చేయు విషయంలో మంత్రిత్వ శాఖ ప్రాధాన్యాన్ని స్పష్టం చేసింది.

పౌర విమానయాన మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు ఇచ్చిన ప్రత్యేక వీడియో సందేశాన్ని ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ సందేశం ద్వారా కేంద్ర మంత్రి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ అర్థవంతమైన వేడుకలను ఘనంగా నిర్వహించడంలో ఎమ్ఓసీఏ, ఏఏఐల కృషిని ప్రశంసించారు.

మనసు.. శరీరం.. ఆత్మల మధ్య సమన్యయ సాధనకు యోగా సరైన పరిష్కారమని కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, ప్రాచీన గ్రంథాల నుంచి ఆవిర్భవించిన ఈ అమూల్య సంప్రదాయాన్ని పరిరక్షించిన మన పూర్వీకులకు మనమంతా కృతజ్ఞులమై ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. యోగాను మరోసారి మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఫిట్ ఇండియా ఉద్యమం.. స్థూలకాయ వ్యతిరేక ప్రచారం.. యోగా దినోత్సవ వేడుకలు.. ఇలా మనల్ని శారీరకంగా చురుగ్గా ఉండేలా ప్రేరేపించే అనేక కార్యక్రమాలకు శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించారన్నారు. ప్రతి సంవత్సరం మనం యోగా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ సంవత్సరం 'యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్' నినాదం.. యోగాను సుస్థిరత, ప్రపంచ శ్రేయస్సుతో అద్భుతంగా అనుసంధానిస్తుందని శ్రీ రామ్ మోహన్ నాయుడు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్ఓసీఎ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, యోగాను ఒక రోజుకు మాత్రమే పరిమితం చేయకుండా, మనందరి దైనందిన జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాలని కోరారు. యోగా, ప్రాణాయామం, ధ్యానం కోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయం కేటాయించాలని, ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా జీవితానికి శక్తిని, క్రమశిక్షణను, సమతుల్యతను కూడా అందిస్తుందన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతతో ప్రేరణ పొందిన ఈ దేశవ్యాప్త వేడుకలో హృదయపూర్వకంగా పాల్గొనడం ద్వారా శ్రేయస్సు, సమగ్ర ఆరోగ్యం పట్ల తన నిబద్ధతను మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. బలమైన, సుస్థిరమైన పౌర విమానయాన రంగానికి సంపూర్ణ ఆరోగ్యవంతులైన సిబ్బంది అవసరమనే మంత్రిత్వ శాఖ నమ్మకాన్ని ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతిబింబించింది.

భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పౌరులకు అందిస్తున్న ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంలో.. దీర్ఘకాలిక ఆరోగ్యం, సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ ఆధునిక జీవనశైలితో యోగాను అనుసంధానించే ఈ సంప్రదాయాన్ని ప్రతిరోజూ కొనసాగించాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.


 

****


(Release ID: 2138717)
Read this release in: English , Urdu , Hindi , Tamil