పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ)లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ)
Posted On:
15 JUN 2025 7:06PM by PIB Hyderabad
భారత వైమానిక దళ (ఐఏఎఫ్) ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల ఫ్లైట్ క్యాడెట్ ల ప్రీ-కమిషనింగ్ శిక్షణ విజయవంతంగా ముగిసింది. దీనికి సూచికగా ఈరోజు హైదరాబాద్లోని దుండిగల్ వద్ద గల ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ)లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) నిర్వహించారు. ఈ పరేడ్ కు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రివ్యూయింగ్ అధికారి (ఆర్ఓ)గా వ్యవహరించిన చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (సీఏఎస్).. గ్రాడ్యుయేటింగ్ ఫ్లైట్ క్యాడెట్లకు ప్రెసిడెంట్స్ కమిషన్ ప్రదానం చేశారు. పురుషులు, మహిళలు సహా మొత్తం 254 మంది ఫ్లైట్ క్యాడెట్లు ప్రీ-కమిషనింగ్ పూర్తి చేసుకున్నారు.
శిక్షణ కమాండ్.. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్, ఏఎఫ్ఏ కమాండెంట్ ఎయిర్ మార్షల్ పీకే వోహ్రాలు సీఎఎస్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఆర్ఓకు పరేడ్ గౌరవ వందనం సమర్పించిన అనంతరం.. కవాతు నిర్వహించారు.
భారత నావికాదళానికి చెందిన తొమ్మిది మంది అధికారులు, భారత తీర రక్షక దళానికి చెందిన ఏడుగురు అధికారులు, మిత్ర దేశం నుంచి ఒక శిక్షణార్థి సైతం వైమానిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి 'వింగ్స్' అవార్డులను ప్రదానం చేశారు. ఈ వేడుకకు ప్రముఖులతో పాటు ప్రీ-కమిషనింగ్ పూర్తి చేసుకున్న అధికారుల కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
ఈ 'కమిషనింగ్ వేడుక' పరేడ్ సందర్భంగా, ప్రీ-కమిషనింగ్ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు ఫ్లయింగ్ ఆఫీసర్లుగా నియామక పత్రాలను ఆర్ఓ అందజేశారు. గ్రాడ్యుయేటింగ్ అధికారుల చేత అకాడమీ కమాండెంట్ ప్రమాణం చేయించారు.. వారు దేశ సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని కాపాడతామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకాష్ గంగాటీమ్, ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్ చేసిన ఉత్కంఠభరితమైన ప్రదర్శనలు.. సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం చేసిన సింక్రొనైజ్డ్ ఏరోబాటిక్స్ అద్భుతంగా సాగాయి. గ్రాడ్యుయేషన్ పరేడ్లో పిలాటస్ పీసీ-7 ఎమ్కేlI, హాక్, కిరణ్ ఎమ్కేl, చేతక్ సహా పలు శిక్షణ విమానాల సమన్వయం, ప్రత్యేక నమూనాలతో అద్భుత వైమానిక ప్రదర్శనను నిర్వహించారు.
వివిధ శిక్షణా విభాగాల్లో అసాధారణ పనితీరును ప్రదర్శించిన గ్రాడ్యుయేటింగ్ అధికారులను ప్రశంసిస్తూ, వారిని ఆర్ఓ సత్కరించారు. పైలట్ల కోర్సులో మొత్తం మెరిట్ క్రమంలో మొదటి స్థానంలో నిలిచినందుకు.. ఫ్లయింగ్ బ్రాంచ్ నుంచి ఫ్లయింగ్ ఆఫీసర్ రోహన్ కృష్ణమూర్తికి ప్రెసిడెంట్స్ ప్లాక్ తో పాటు చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్ లభించింది. గ్రౌండ్ డ్యూటీ విభాగంలో మొత్తం మెరిట్ క్రమంలో మొదటి స్థానంలో నిలిచినందుకు ఫ్లయింగ్ ఆఫీసర్ నిష్ఠా వైద్ కు ప్రెసిడెంట్స్ ప్లాక్ లభించింది.
పరేడ్ ను ఉద్దేశించి ఆర్ఓ ప్రసంగిస్తూ, కొత్తగా నియమితులైన అధికారులు వారి పరిపూర్ణమైన టర్న్ అవుట్, కచ్చితమైన డ్రిల్ కదలికలు, అత్యున్నత పరేడ్ ప్రమాణాలను ప్రదర్శించారని ప్రశంసించారు.
గ్రాడ్యుయేటింగ్ అధికారులను అభినందిస్తూ, ఆయన ఇలా అన్నారు.. "మీరు దేశానికి సేవ చేయాలని ఎంచుకోవడం ద్వారా, మీరు మంచి డిమాండ్ గల వృత్తిని మాత్రమే కాకుండా, అత్యంత ప్రతిఫలదాయకమైన, గౌరవప్రదమైన వృత్తిని ఎంచుకున్నారు. మనం భవిష్యత్తును చూస్తున్నప్పుడు, రెండు విషయాలు కచ్చితంగా ఉన్నాయి. అవి - వేగంగా అభివృద్ధి చెందుతున్న యుద్ధ స్వభావం, పెరుగుతున్న ఏరోస్పేస్ ఔచిత్యం."
"ఆపరేషన్ సింధూర్ భారత వైమానిక దళ అసమానమైన నైపుణ్యానికి ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది. శత్రువుపై కచ్చితమైన, నిర్ణయాత్మక దాడి చేయగల మన సామర్థ్యాన్ని ఈ ఆపరేషన్ ద్వారా మనం ప్రదర్శించాం. వైమానిక దళ భవిష్యత్తుగా.. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, జాతీయ సంక్షోభ సమయాల్లో మొదట ప్రతిస్పందించేదిగా ఐఏఎఫ్ ఎల్లప్పుడూ ఉంది. అది కొనసాగుతుంది" అని ఆయన అన్నారు.
"ప్రతి భారతీయుడు భారత వైమానిక దళంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మన పవిత్ర కర్తవ్యం" అని పేర్కొనడం ద్వారా, అధికారులకు అప్పగించిన సమష్టి బాధ్యతలను సీఎఎస్ స్పష్టం చేశారు. “సంవత్సరాల తరబడి కఠినమైన శిక్షణ, పట్టుదలకు ఈనాటి వేడుకలు ప్రతిబింబిస్తాయి. అయితే ఇది మీ వృత్తిపరమైన ప్రయాణానికి ప్రారంభం మాత్రమే. మీరు మీ పరిధులను విస్తరించుకోవడానికి, కొత్త సామర్థ్యాలను కనుగొనడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి." అని సూచించారు.
"భవిష్యత్తులో యుద్ధభూమి మరింత సంక్లిష్టంగా మారనుంది. ఐఏఎఫ్ నిజమైన ఏరోస్పేస్ శక్తిగా రూపాంతరం చెందుతున్న క్రమంలో, మీలో చాలా మంది భారత అంతరిక్ష రంగ ప్రయత్నాల్లో ముందంజలో ఉంటారు. ఈ సవాళ్ల కోసం మీరు పూర్తి నిబద్ధత, అవిశ్రాంత కృషి, ఆవిష్కరణలు, మీ బాధ్యతల పట్ల అత్యంత మక్కువ కలిగి ఉండడం అవసరం. మీరు ధరించే యూనిఫాం దేశ గర్వానికి చిహ్నం - దానిని గౌరవంగా ధరించండి, ధైర్యంగా ముందుకు సాగండి, ఎల్లప్పుడూ భారత వైమానిక దళ ప్రధాన విలువలకు కట్టుబడి ఉండండి" అని పిలుపునిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
తాజాగా నియామక పత్రాలను అందుకున్న అధికారులు మార్షల్ పరేడ్ ట్యూన్ లను అనుసరిస్తూ రెండు వరుసలుగా నిర్వహించిన కవాతుతో ఈ పరేడ్ ముగిసింది. వైమానిక దళ అధికారులు వారికి గర్వకారణమైన వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రెసిడెంట్స్ కమిషన్ అందుకున్న ఈ నియామక కార్యక్రమం.. వారి జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఇది వారి కెరీర్లో అత్యంత చిరస్మరణీయమైన రోజు అవుతుంది. దేశ సేవలో గౌరవం, గర్వం, ఆత్మగౌరవంతో నిండిన జీవితానికి నాంది పలుకుతుంది.
***
(Release ID: 2136513)