బొగ్గు మంత్రిత్వ శాఖ
సుస్థిరమైన వృద్ధి, అంతర్జాతీయ నేతృత్వం: వ్యూహాత్మక చోదకంగా బొగ్గు
(కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి రాసిన వ్యాసం)
Posted On:
26 MAY 2025 5:39PM by PIB Hyderabad
2014లో ఇదే రోజున, అంటే మే 26న మొదటిసారి ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు. పునరుజ్జీవనం లక్ష్యంగా భారత పయనం మొదలైంది. నాటి నుంచి ప్రతీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. పునరుత్పాదక ఇంధనం, బొగ్గు ఇందుకు ముఖ్యమైన ఉదాహరణలు.
గత ఆర్థిక సంవత్సరంలో 1 బిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి, పంపిణీతో భారత్ రెట్టింపు విజయం సాధించింది. ఇది మన ఇంధన భద్రత అవసరాలను బలోపేతం చేయడమే కాకుండా, తక్కువ ఖర్చుతో కూడుకున్న, విశ్వసనీయ, నిరంతర విద్యుత్ సరఫరాకు కూడా విశేషంగా దోహదపడుతుంది. మైనింగ్లో ప్రత్యక్షంగా పనిచేస్తున్న దాదాపు 5 లక్షల మంది కార్మికులతోపాటు పరోక్షంగా ఈ రంగానికి దోహదపడుతున్న అనేక మంది కార్మికుల కృషికి ఈ విజయం నిదర్శనం.
ఈ విజయం రాత్రికిరాత్రే వచ్చింది కాదు. దశాబ్ద కాలంగా సాగుతున్న విస్తృతమైన సంస్కరణల ఫలితమిది. 2014లో బొగ్గు రంగం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. ఓవైపు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండగా, మరోవైపు బొగ్గు ఉత్పత్తిలో తీవ్రమైన లోటు ఉండేది. బొగ్గు, లిగ్నైట్ ఉత్పత్తి 2009–2010లో 566 మిలియన్ టన్నుల నుంచి 2013–2014లో 610 మిలియన్ టన్నులకు స్వల్పంగా పెరిగింది. 1.89 శాతంగా ఉన్న ఈ సంచిత వార్షిక వృద్ధి రేటు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మన అవసరాలకు సరిపోయేది కాదు. కొత్తగా ఎన్నికైన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అతిపెద్ద సవాళ్లలో ఇదొకటి. 2015లో సుప్రీంకోర్టు 204 బొగ్గు బ్లాకులను రద్దు చేయడంతో సమూలమైన మార్పుల దిశగా చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి అవకాశం లభించింది. 2020లో వాణిజ్యపరంగా బొగ్గు తవ్వకాన్ని ప్రవేశపెట్టారు. పారదర్శకత, పోటీతో కూడిన కొత్త శకానికి ఇది నాంది పలికింది.
పదేళ్ల తర్వాత, ఈ ఏడాది మార్చి వరకు దాదాపు 150 బొగ్గు గనులను విజయవంతంగా వేలం వేశారు. 2020 జూన్లో వాణిజ్యపరమైన బొగ్గు గనుల తవ్వకాలను ప్రారంభించమని గౌరవ భారత ప్రధానమంత్రి చెప్పినప్పటి నుంచీ 11 రౌండ్లు పూర్తయ్యాయి. ఇటీవల ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన 12వ రౌండ్ వేలం కొనసాగుతోంది. ఫలితాలే చెబుతున్నాయి: గత దశాబ్ద కాలంలో దేశంలో బొగ్గు ఉత్పత్తిలో 70% వృద్ధి నమోదైంది. పారదర్శకత, సమర్థత, సుస్థిరతల సమ్మేళనంతో ఈ రంగం భారీ వృద్ధిని నమోదు చేసింది. దాదాపు రూ. 2.50 లక్షల కోట్ల వేలం ప్రీమియంలతో రాష్ట్ర ప్రభుత్వాలు అతిపెద్ద లబ్ధిదారుల్లో ఒకటిగా ఉన్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు రాయల్టీలు అందుతున్నాయి.
వ్యూహాత్మక భాగస్వామిగా ప్రైవేటు రంగం
స్వాతంత్ర్యానంతరం బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి, వృద్ధిలో కొత్త శకానికి నాంది పలికేందుకు అనేక అవకాశాలున్నాయి. అయితే, ప్రైవేటు రంగాన్ని సమర్థంగా ఉపయోగించుకునేలా వ్యూహాత్మక అవగాహన లేకపోవడం ముఖ్యమైన లోపం. సరుకు రవాణా ఈక్వలైజేషన్ వంటి విధానాలు మైనింగ్ ప్రాంతాలకు దగ్గరగా పరిశ్రమలను నెలకొల్పేలా ప్రోత్సహించలేదు. వాటికి దూరంగా ఫ్యాక్టరీలు ఏర్పాటవడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టాలు కలిగాయి.
బొగ్గు గనుల పరిశ్రమపై ప్రభుత్వ నియంత్రణ అధికంగా ఉండడం, అలాగే బొగ్గు నిక్షేపాలున్న లేదా ఆ అవకాశమున్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో.. నాటి ఉక్కు, గనులు, ఇంధన మంత్రి సర్దార్ స్వరణ్ సింగ్ 1957 మే 17న లోక్సభలో బొగ్గు నిక్షేప ప్రాంతాల (సేకరణ, అభివృద్ధి) బిల్లును ప్రవేశపెట్టారు. 1951 - 1956 మధ్యమొదటి పంచవర్ష ప్రణాళిక ముగిసే నాటికి మన దేశ బొగ్గు ఉత్పత్తి 38 మిలియన్ టన్నులు. సభలో మంత్రి మాట్లాడుతూ.. ‘‘మన దేశం కన్నా 13 రెట్లు చిన్నదైన బ్రిటన్లో బొగ్గు ఉత్పత్తి 230 మిలియన్ టన్నులు. అమెరికాను తీసుకుంటే అది సంవత్సరానికి 460 మిలియన్ టన్నులు. సోవియట్ యూనియన్లో ఇది దాదాపు 390 మిలియన్ టన్నులుగా ఉంది. చైనా కూడా ఇటీవల తన బొగ్గు ఉత్పత్తిని ఏటా 100 నుంచి 120 మిలియన్ టన్నులకు పెంచింది’’ అన్నారు.
1990 నాటికీ బొగ్గు ఉత్పత్తి దాదాపు 200 మిలియన్ మెట్రిక్ టన్నుల వద్దే ఉంది. ప్రైవేటు రంగ ఆవిష్కరణ, సాహసోపేత సామర్థ్యాలపై నమ్మకం లేకపోవడం, భారతీయ యువతలో ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తి పెద్దగా లేకపోవడం వంటి అంశాలు దీనికి కారణం. నేడు అనుసరిస్తున్న వాణిజ్యపరమైన వేలం విధానం కారణంగా.. గతానికి భిన్నంగా పారదర్శకమైన, నిర్మాణాత్మకమైన పద్ధతిలో ప్రైవేటు రంగం కీలక భాగస్వామిగా ఉపయోగపడుతోంది.
పర్యావరణ... సుస్థిరత సమస్యల పరిష్కారం
బొగ్గు, గనుల రంగం సంబంధిత పర్యావరణ సమస్యలు దశాబ్దాలుగా దాటవేతకు గురయ్యాయి. కానీ, గడచిన దశాబ్దానికిపైగా కాలంలో సుస్థిరతకు ప్రాధాన్యమిస్తూ అనేక చర్యలు చేపట్టాం. ఈ మేరకు భారీ స్థాయిలో అటవీకరణ, గనుల తవ్వకంలో పర్యావరణ హిత విధానాలతోపాటు కాలుష్యరహిత బొగ్గు సాంకేతికతల అనుసరణ వగైరాల ద్వారా ఈ రంగంలో పర్యావరణ సమస్య స్థాయిని తగ్గించాం.
అలాగే దేశవ్యాప్తంగా వైవిధ్యీకరణ వేగం పుంజుకుంది. ప్రస్తుత సౌర-పవన విద్యుత్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, కోల్ ఇండియా తొలి బొగ్గేతర కీలక ఖనిజ గనుల సమీకరణ ఇందులో అంతర్భాగాలు. బొగ్గు ఉత్పత్తిలో పేలుడు రహిత గనుల వాటా ఇప్పుడు 55 శాతం కావడంతో కాలుష్యం గణనీయంగా తగ్గింది. దీనికితోడు రూ.8,500 కోట్ల వ్యయంతో బొగ్గును వాయువుగా మార్చే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. అంతేగాక ఈ కాలుష్యరహిత బొగ్గు ప్రత్యామ్నాయ సాంకేతికతలో పెట్టుబడి పెంపు, సుస్థిర ఇంధన భవితకు భరోసా దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. రాబోయే కాలంలో గని మూసివేత ఒక ప్రథమ ప్రాధాన్యంగా ఉంటుంది. తదనుగుణంగా సముచిత, ప్రగతిశీల, సుస్థిర పద్ధతులలో గని మూసివేత కార్యకలాపాలకు శ్రీకారం చుట్టే దిశగా మార్గదర్శకాలను సవరిస్తోంది.
భూమి దిగువ పొరలకు భంగం కలగని రీతిలో భూగర్భ గనుల తవ్వకం వల్ల ఒనగూడే పర్యావరణ ప్రయోజనాలను ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల ఉద్గారాల తగ్గుదలతోపాటు ఎక్కువ లోతుల నుంచి బొగ్గు వెలికితీతకూ అవకాశం ఉంటుంది. అందుకే, ఈ విధానానికి మా ప్రభుత్వం మరింత ప్రోత్సాహమిస్తోంది. బొగ్గు ఉత్పత్తి 2029-30 నాటికి 100 మిలియన్ టన్నుల స్థాయికి చేరగల స్పష్టమైన భవిష్యత్ ప్రణాళికతో ఇప్పటికే ఇది పూర్తి నిబద్ధతతో అమలవుతోంది.
మరోవైపు సమీప రవాణా సంధానం (ఫస్ట్ మైల్ కనెక్టివిటీ)గల ప్రాజెక్టులను మామంత్రిత్వ శాఖ వేగంగా అమలు చేస్తోంది. ఈ మేరకు తవ్విన బొగ్గులో 90 శాతాన్ని కన్వేయర్ బెల్టులు, సిలో, రాపిడ్ లోడింగ్ సిస్టమ్స్, వాటర్ స్ప్రింక్లర్లు తదితర యాంత్రిక, పర్యావరణ హిత వ్యవస్థల ద్వారా లోడింగ్కు పంపుతారు.
దేశంలో బొగ్గు ఉత్పత్తి-పంపిణీ రికార్డు స్థాయిలో సాగుతున్నప్పటికీ చైనా, ఆస్ట్రేలియా, అమెరికా, ఐరోపా దేశాల్లో తలసరి బొగ్గు ఇంధన వినియోగం భారత్తో పోలిస్తే గణనీయంగా అధికం. అంతేగాక బొగ్గు ఇంధన మొత్తం వినియోగం రీత్యా కూడా చైనాతోపాటు అభివృద్ధి చెందిన ‘ఒఇసిడి’ కూటమి దేశాల తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. ఇక విద్యుచ్ఛక్తి మొత్తం స్థాపిత సామర్థ్యంలో బొగ్గు వాటా తగ్గుముఖం పట్టింది. దేశంలో 2014–2015 నాటికి ఈ వాటా 60 శాతం కాగా, ఇప్పుడు 47 శాతానికి దిగివచ్చింది. సౌర-ఇతర పునరుత్పాదక వనరులు పెరగడమే ఇందుకు కారణం. అయినప్పటికీ, దేశాన్ని 2047నాటికి వికసిత భారత్గా రూపుదిద్దడంలో బొగ్గు కీలక ప్రాథమిక ఇంధన వనరుగా కొనసాగుతుంది.
అందువల్ల, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లడమే కాకుండా సుస్థిర బొగ్గు ఉత్పత్తి దిశగా పర్యావరణ హిత చర్యల ఆవిష్కారం, ఆచరణ మధ్య సమతౌల్యం సాధించడానికి మనమంతా నిరంతరం కృషి చేయాలి.
వికసిత్ భారత్-2047 దిశగా బొగ్గు రంగం
దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1.10 ‘ఎండబ్ల్యుహెచ్’ కాగా, ప్రపంచ సగటు 3.42 ‘ఎండబ్ల్యుహెచ్’తో పోలిస్తే మూడింట ఒక వంతుకన్నా తక్కువే. మనం వృద్ధి పథంలో సాగుతూ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొంది, 2047 నాటికి సర్వతోముఖాభివృద్ధితో 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందే వరకు కూడా మన ఇంధన అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. అలాగే మన ఇంధన సమ్మేళనంలో బొగ్గు కీలక స్తంభంగా కొనసాగుతుంది.
భారత బొగ్గు రంగం దేశ ప్రగతికి ఉరవడి ఇవ్వడమే కాకుండా ఆధునిక మైనింగ్ ఆర్థిక వ్యవస్థలో ఏవేవి సాధ్యమో సదరు సూత్రావళిని తిరగరాస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే తన తొలి బొగ్గు వాణిజ్య ఎక్స్ఛేంజిని ప్రారంభించనుంది. పరిశ్రమలకు బొగ్గు లభ్యతలో ఈ వేదిక విప్లవాత్మక మార్పులు తెస్తుంది. అంతేగాక సముచిత వాణిజ్యం, పారదర్శక ధరల ఆవిష్కరణకు వీలు కల్పిస్తుంది. మరోవైపు మన ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థను శక్తిమంతం చేసేదిశగా సుస్థిర ఇంధన సరఫరాకు భరోసా ఇస్తుంది. ఇక కార్యకలాపాల క్రమబద్ధీకరణ, పాలనలో మెరుగుదల దిశగా ఈ రంగం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను కూడా ప్రవేశపెట్టింది. భద్రత, సామర్థ్యాలకు భరోసా ఇవ్వడంలో భాగంగా పారదర్శకత, డిజిటల్ ప్రతిరూప బొగ్గు గనుల (డిజిటల్ ట్విన్స్) సాంకేతికతతో బొగ్గు గనుల డిజిటలీకరణను ‘డిజికోల్’ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా 5జి సాంకేతికతలు, ఏఐ-ఆధారిత పర్యవేక్షణ, బొగ్గు రవాణా కోసం ‘జిపిఎస్’ ట్రాకింగ్, డ్రోన్ సర్వే, డిజిటల్ వేలం వేదికల నిర్వహణ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
ఒకనాడు అవినీతికి ఆలవాలమైన, ఉత్ప్రేక్ష, అసమర్థతలతో శిలాసదృశమైనదిగా అపఖ్యాతి పాలైన బొగ్గు-గనుల రంగం గత దశాబ్ద కాలంలో కనీవినీ ఎరుగని మార్పులకు లోనైంది. ఆధునికీకరణ, అంతర్జాతీయ సహకారం, సుస్థిర విధానాలపై నిశిత, నిరంతర దృష్టితో మనం భవిష్యత్తు వైపు పరికిస్తే- ప్రపంచ మైనింగ్, వనరుల ఆర్థిక వ్యవస్థలో అగ్రశక్తిగా భారత్ పాత్రను పటిష్ఠం చేయగల గొప్ప విజయాలు సాకారం కావడం తథ్యం.
(కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు)
***
(Release ID: 2131516)