పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
వింగ్స్ ఇండియా- 2026 సన్నాహక కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా భారత్
త్వరలో మూడో అతిపెద్ద విమాన ప్రయాణికుల మార్కెట్గా నిలవనున్న భారత్: రాం మోహన్ నాయుడు
Posted On:
23 MAY 2025 9:18PM by PIB Hyderabad
గౌరవ మంత్రి శ్రీ రాం మోహన్ నాయుడు నేతృత్వంలో భారత వాణిజ్య, పారిశ్రామిక సంఘాల సమాఖ్య (ఫిక్కీ) సహకారంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆసియాలో అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమం వింగ్స్ ఇండియా- 2026 సన్నాహక కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్లో నిర్వహించింది. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మొహోల్, పౌర విమానయాన కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ విపిన్ కుమార్, డీజీ బీసీఏఎస్ శ్రీ రాజేశ్ నిర్వాణ్, ఫిక్కీ పౌర విమానయాన కమిటీ చైర్మన్ శ్రీ రెమి మెయిలార్డ్, ఫిక్కీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి జ్యోతి విజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వింగ్స్ ఇండియా-2026 బ్రోషర్ను ఆవిష్కరించడంతోపాటు ప్రచార వీడియోను విడుదల చేశారు. కార్యక్రమంలో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని సులభతరం చేసే లక్ష్యంతో వింగ్స్ ఇండియా-2026 మొబైల్ యాప్ను అధికారికంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ముఖ్యోపన్యాసం చేసిన గౌరవ కేంద్ర పౌర విమానయాన మంత్రి శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు విమానయాన రంగంలో భారత్ సాధించిన అద్భుతమైన అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా భారత్ అవతరించిందని, త్వరలో మూడో అతిపెద్ద విమాన ప్రయాణికుల మార్కెట్గా అవతరించనుందని తెలిపారు. ఆధునికీకరణ, భవిష్యత్ సాంకేతికతలను అందిపుచ్చుకోవడం, క్షేత్రస్థాయిలో అనుసంధానంపై దృష్టి సారిస్తూ.. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేలా ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
వింగ్స్ ఇండియా- 2026 ఇతివృత్తాన్ని కూడా గౌరవ మంత్రి రాం మోహన్ నాయుడు ప్రకటించారు. ‘భారతీయ విమానయానం: రూపకల్పన నుంచి మోహరించే వరకు, తయారీ నుంచి నిర్వహణ వరకు, సమ్మిళితత్వం నుంచి ఆవిష్కరణ వరకు, భద్రత నుంచి సుస్థిరత వరకు భవిష్యత్తును సుగమం చేయడం’ అని పేర్కొన్నారు.
అంతర్జాతీయ విమానయాన రంగంలో విస్తృతమైన అవకాశాలతోపాటు న్యాయబద్ధమైన విధానాలు, నిజాయితీగల భాగస్వామ్యాలకు భారత్ కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. “భారత్ నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగ భాగస్వాములు, ఔత్సాహికులు విస్తృతంగా పాల్గొనేలా అమితంగా ఆకట్టుకుంటూ.. వింగ్స్ ఇండియా- 2026 ఘనమైన ఖ్యాతిని సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. వింగ్స్ ఇండియా-2026ను నేను కేవలం ఓ ఈవెంట్గా చూడడం లేదు. ఇది దార్శనిక దృక్పథం. అంతర్జాతీయ విమానయానంలో భాగస్వామ్యానికే పరిమితం కాదు.. దానికి నేతృత్వం వహించాలన్న భారత్ ఆశయాన్ని తేటతెల్లం చేసే ప్రకటన ఇది” అని మంత్రి వ్యాఖ్యానించారు.
దేశంలో విమానయాన రంగం అభివృద్ధి తీరును పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మొహోల్ వివరించారు. జాతీయ విధానం ద్వారా మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాల క్రియాశీల భాగస్వామ్యమూ ఈ రంగాన్ని ముందుకు నడుపుతోందన్నారు. కొత్త విమానాశ్రయాలను ప్రారంభించడం నుంచి ప్రాంతీయ విమానయాన సంస్థలకు చేయూతనవ్వడం వరకు.. అనుసంధానాన్ని బలోపేతం చేయడంలో, స్థానిక ఆర్థిక సామర్థ్యాన్ని ఆవిష్కరించడంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయన్నారు.
ఉడాన్ పథకం కింద ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు ఇప్పుడు జాతీయ విమానయాన గ్రిడ్లో భాగంగా ఉన్నాయి. ఇది పర్యాటకం, వాణిజ్యం, ఉపాధికి ఊతమిస్తుంది. ప్రాంతీయ సమన్వయాన్ని మరింత పెంపొందించడం కోసం మంత్రిత్వ శాఖ వరుసగా ప్రాంతీయ మంత్రివర్గ సమావేశాలను నిర్వహిస్తోంది. ‘‘ఆలోచనలను పంచుకోడానికి, స్థానిక సమస్యలను పరిష్కరించుకోవడానికి, ఉమ్మడి లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్లడానికి ఈ సమావేశాలు వేదికలవుతున్నాయి. మొత్తంగా మరింత సమ్మిళిత, అనుసంధాన వైమానిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.’’
భారత విమానయాన భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సుస్థిరత, ఆవిష్కరణలపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టి సారించిందని కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా తన ప్రత్యేక ప్రసంగంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ వాతావరణ లక్ష్యాలకు అనుగుణంగా.. పర్యావరణ హిత విమాన ఇంధనం (ఎస్ఏఎఫ్)లో అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలవగల స్థానంలో ప్రస్తుతం భారత్ ఉందన్నారు. డ్రోన్లు, eVTOLలు సహా అధునాతన వైమానిక రవాణా (ఏఏఎం)కు వింగ్స్ ఇండియా- 2026 ఉత్ప్రేరకంగా పనిచేస్తుందనీ.. పట్టణ, ప్రాంతీయ అనుసంధానంలో ఇది కొత్త శకానికి నాంది పలుకుతుందని అన్నారు.
భారత విమానాశ్రయాల ఆధీకృత సంస్థ చైర్మన్ శ్రీ విపిన్ కుమార్ స్వాగతోపన్యాసం చేశారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయ మౌలిక సదుపాయాలను విస్తరించడం, విమాన రవాణా సేవలను మెరుగుపరచడంలో ఆ సంస్థ కీలక పాత్ర పోషించిన తీరును వివరించారు.
ఫిక్కీ పౌర విమానయాన కమిటీ చైర్మన్, ఎయిర్ బస్ ఇండియా ప్రెసిడెంట్ దక్షిణాసియా ఎండా శ్రీ రెమీ మెయిలార్డ్ మాట్లాడుతూ.. ఈ రంగంలో పరిశ్రమల దృక్కోణాన్ని వివరించారు. ప్రపంచంలో అగ్ర విమానయాన మార్కెట్గా అవతరించే దశలో భారత్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆవిష్కరణ, సుస్థిరత, సామర్థ్యాభివృద్ధి అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేశారు.
పౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఏఏఐ, ఫిక్కీ సీనియర్ అధికారులు దౌత్య ప్రతినిధులు, అంతర్జాతతీయ విమానయాన పారిశ్రామిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు.
2026 జనవరి 28 నుంచి 31 వరకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా- 2026 నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు, తయారీదారులు, రాష్ట్ర ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు, విమానాశ్రయ డెవలపర్లు, కార్గో, రవాణా రంగ భాగస్వాములు, ఎమ్మార్వోలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు, ఆర్థిక సంస్థల వంటి కీలక భాగస్వాములందరినీ ఈ ఈవెంట్ ఒక్కచోట చేర్చబోతోంది.
***
(Release ID: 2131067)