ఆయుష్
రాష్ట్రీయ కర్మయోగి జన్ సేవ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
16 APR 2025 6:58PM by PIB Hyderabad
‘రాష్ట్రీయ కర్మయోగి జన్ సేవ కార్యక్రమం’లో భాగంగా ఒక సమావేశాన్ని ఆయుష్ శాఖ బుధవారం నిర్వహించింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉద్యోగుల్లో సేవాప్రధాన ధోరణిని, వృత్తినైపుణ్యాలను పెంచడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ సమావేశాన్ని ‘మిషన్ కర్మయోగి’లో భాగంగా కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సహకారంతో నిర్వహించారు.

ఇదివరకు మార్చి నెల 18న ఏర్పాటు చేసిన ఇదే తరహా సమావేశం ఒకటో దశను ఆయుష్ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కోటేచా ప్రారంభించారు. సిబ్బందిని మరింత సమర్థులుగాను, బాధ్యతాయుతంగాను తీర్చిదిద్దడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని శ్రీ వైద్య రాజేశ్ కోటేచా స్పష్టం చేశారు. సేవలను మెరుగుపరచాలన్న ధ్యేయంతో అందిస్తున్న శిక్షణను దీనిలో పాల్గొన్న వారు తమ రోజువారీ విధుల నిర్వహణలో అమలు చేయండంటూ వారిని ఆయన ప్రోత్సహించారు.
సమావేశం రెండో దశకు ప్రోగ్రాం డైరెక్టరు డాక్టర్ సుబోధ్ కుమార్ నాయకత్వం వహించగా శిప్రా సింగ్ ఈ సమావేశాన్ని సమన్వయపరిచారు. దీనిలో మాటామంతీ నమూనాను అనుసరించారు. సాంప్రదాయక ఉపన్యాసాలకు బదులు ఆచరణాత్మక శిక్షణకు ప్రాధాన్యాన్నిచ్చారు. ఉద్యోగులు వారు పోషించాల్సిన భూమికలను, అందించాల్సిన తోడ్పాటులను అర్థం చేసుకొనేటట్లు వారితో చర్చించడం, వారిని జట్లు జట్లుగా పనిచేయాలని సూచించడం, వారికి కొన్ని సమస్యలను ఇచ్చి వాటిని పరిష్కరించాలని చెప్పడం వంటి పద్ధతులను శిక్షణలో భాగంగా పొందుపరిచారు.
స్వీయ అవగాహన, ప్రేరణ, నాయకత్వం వహించడం వంటి విషయాలపై దృష్టిని సారిస్తూ నాలుగు సమావేశాల్ని ఏర్పాటు చేశారు. ఆయుర్వేద, యోగా, ఇతర సాంప్రదాయిక వైద్య వ్యవస్థలలో ప్రస్తుతం సాగుతున్న కార్యక్రమాలకు సంబంధించిన కేస్ స్టడీస్ను కూడా ఈ ఆచరణాత్మక శిక్షణ కోసం అందజేశారు.
మంత్రిత్వ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. వ్యక్తిగతంగా స్వీకరించాల్సిన బాధ్యతలు, ప్రజాసేవకు ఉన్న విస్తృత ప్రభావం..వీటి విషయంలో అవగాహనను పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఆయుష్ శాఖ తన సిబ్బందిలో సామర్థ్యాలను, దక్షతను బలోపేతం చేయడానికి తన ప్రయత్నాలను ఇకముందు కూడా కొనసాగిస్తూ ఉంటుంది.
***
(రిలీజ్ ఐడి: 2122383)
సందర్శకుల సూచీ సంఖ్య : : 48