పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఇండియన్ ఏవియేషన్ అకాడమీలో ఏవియేషన్ కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని
ప్రారంభించిన పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు
• విద్యార్థులు గొప్ప కలలు కనడానికి ప్రేరణనిచ్చే కార్యక్రమం
Posted On:
09 APR 2025 7:03PM by PIB Hyderabad
పాఠశాల విద్యార్థుల కోసం విమానయాన రంగానికి సంబంధించిన కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఇండియన్ ఏవియేషన్ అకాడమీలో నిర్వహించారు. విమానయాన రంగంలో పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మొదలు విమాన డిజైను, విమానాశ్రయ నిర్వహణ వంటి భిన్నమైన ఉద్యోగావకాశాల వైపు 11, 12వ తరగతుల విద్యార్థులు మొగ్గు చూపేలా ప్రేరణను కలిగించి వారిలో అవగాహనను పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం.
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా పైలట్లు మాటామంతీలో పాల్గొన్నారు. విద్యార్థులడిగిన ప్రశ్నలకు వారు జవాబులివ్వడంతోపాటు తమ వృత్తి ప్రస్థానంలో లోతైన అవగాహనతో కూడిన అనుభవాలను కూడా పంచుకొన్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహాన్ని కనబరచడంతో, ఈ మాటామంతీ చాలా ఆకట్టుకొనేదిగా ఉండి, స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
భారత్లో అత్యంత యువ క్యాబినెట్ మంత్రి, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ, ఈ కార్యక్రమ ధ్యేయాలను వివరించారు. ‘‘మేం ఉత్తేజాన్ని నింపాలనుకుంటున్నాం. విమానయాన రంగంలోకి మరింత ఎక్కువ మంది ప్రజలు భాగం పంచుకోవాలని మేం కోరుకుంటున్నాం. భారతీయ విమానయాన రంగం మరే దేశంలోనూ లేనంత వేగంగా ప్రగతిపథంలో దూసుకుపోతోంది’’ అని మంత్రి అన్నారు. భారత్లో శరవేగంగా వృద్ధి చెందుతున్న విమానయాన విస్తారిత అనుబంధ వ్యవస్థకు సాటి వచ్చేలా ప్రతిభావంతులను త్వరితగతిన తీర్చిదిద్దడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాబోయే కాలంలో అవకాశాలు ఏ స్థాయిలో ఉండేదీ శ్రీ రామ్ మోహన్ నాయుడు చెబుతూ, 1700 కొత్త విమానాల అవసరం ఉందన్నారు. ‘‘ప్రతి ఒక్క విమానానికీ 15 నుంచి 20 మంది పైలట్లు కావాలి. అంటే ఒక్క పైలట్ ఉద్యోగాలే 34,000 అవసరమవుతాయని దీనికి అర్థమ’’ని ఆయన తెలిపారు. ‘‘విదేశీయులు ఇక్కడికి వచ్చి మన విమానాల్లో పైలట్లుగా పనిచేయాలని మేం కోరుకోవడంలేదు. మన సొంత భారతీయ విద్యార్థులు, మన భారతీయ సముదాయం దేశీయంగా పెరుగుతున్న డిమాండును తీర్చాలని మేం కోరుకుంటున్నాం’’ అని మంత్రి అన్నారు.
ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్తు రూపురేఖలను మంత్రి వివరిస్తూ, ‘‘2014లో దేశంలో 74 విమానాశ్రయాలున్నాయి. మేం దీనిని రెండింతలుగా అభివృద్ధి చేశాం. ప్రస్తుతం దేశంలో విమానాశ్రయాల సంఖ్య 159కి చేరుకొంది. నేను రాబోయే అయిదు సంవత్సరాలు మంత్రిగా ఉంటాను... మరో 50 విమానాశ్రయాలను నిర్మించే దిశగా ప్రణాళికలు వేయాలని నేను కోరుకుంటున్నాను. రాబోయే 10 సంవత్సరాల్లో దేశంలో 120 కొత్త ఎయిర్పోర్టుల్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింద’’ని శ్రీ రామ్ మోహన్ నాయుడు తెలిపారు.
విద్యార్థులు వారి ఆకాంక్షల్ని వారే మలచుకోవాలంటూ శ్రీ నాయుడు వారిని ప్రోత్సహించారు. ‘‘మీరు చూసే విమానాలు ఒక్క విమానాలు మాత్రమే కావు, అవి అవకాశాలతో కూడిన అనంత విశ్వం... మీ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయవి’’ అన్నారు. ‘‘మీరు ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే, ఎంత త్వరగా మీ అభిరుచిని పెంచుకొంటే, ఆ మార్గంలో మీరు ముందుకు సాగిపోవడం అంతగా సులభతరంగా మారిపోతుంద’’ని మంత్రి అన్నారు.
విధానపరమైన మద్దతు, మౌలిక సదుపాయాల విస్తరణలకు తోడు, భారతీయ వాయుయాన్ అధినియమ్, ఎయిర్క్రాఫ్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఇన్ ఆబ్జెక్ట్ బిల్ వంటి కీలక చట్ట సంస్కరణలను కూడా మంత్రి ప్రస్తావించారు. వీటి ఉద్దేశం దేశీయ విమానయాన అనుబంధ విస్తారిత వ్యవస్థను బలపరచడంతోపాటు ఉద్యోగావకాశాలను పెంచడమని ఆయన వివరించారు.
కార్యక్రమంలో మహిళా పైలట్ల భాగస్వామ్యంతోపాటు విద్యార్థినులకు ప్రోత్సాహాన్ని అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శ్రీ రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ, అనేక మంది మహిళా పైలట్లు ఇక్కడికి వచ్చారు... ఈ కార్యక్రమం పలువురి దృష్టిని ఆకట్టుకుంది. మహిళా పైలట్లు మీరు చెప్పింది ఓపికతో విని, మీరడిగిన ప్రతి ప్రశ్నకూ జవాబులిచ్చార’’న్నారు. సాంప్రదాయక కెరియర్లకన్నా భిన్నమైన ఆలోచనల సరళితో ముందుకు సాగిపోవాల్సిందిగా విద్యార్థులకు మంత్రి సూచిస్తూ వారిలో స్ఫూర్తిని రేకెత్తించారు.
ప్రపంచానికి విమానయాన కూడలిగా రూపొందే మార్గంలో భారత్ వేగంగా పయనిస్తోంది. వృద్ధిలోకి రావాలని తపిస్తున్న భారత్ విమానయాన ప్రణాళికను దేశ యువ ప్రతిభావంతుల దన్నుతో అమలుపరచాలన్న వ్యూహాత్మక ప్రయత్నమే ఈ కార్యక్రమం.
***
(Release ID: 2120755)
Visitor Counter : 23