ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీని 3 గంటల్లో 90 శాతం ఛార్జ్ చేయగల దేశీయ వైర్లెస్ ఛార్జర్ : సీడాక్, వీఎన్ఐటీ నాగపూర్ అభివృద్ధి చేసిన సాంకేతికత బదిలీ
* రైల్వేల్లో విద్యుద్దీకరణ, పారిశ్రామికీకరణను ప్రోత్సహించడానికి దేశీయ ప్రొపల్షన్ వ్యవస్థను తయారు చేసేందుకు మొయిటీతో ఒప్పందం: హై పవర్ కన్వర్టర్లు, అధునాతన నియంత్రణ, నిర్వహణ వ్యవస్థల వినియోగం
* సీడాక్ గ్రీన్ టెక్నాలజీ వినియోగించి నూతన అధ్యాయానికి నాంది పలికిన కేరళ కే-డిస్క్: లో ఓల్టేజీ డైరెక్ట్ కరెంట్ ద్వారా కార్యాలయ భవనంలో విద్యుత్ ఆదా
* పరిశ్రమల సహకారంతో పరిశోధనలు కార్యరూపం దాల్చాలి: శ్రీ ఎస్. కృష్ణన్, మొయిటీ కార్యదర్శి
* ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర భారత్’ లక్ష్యాలను సాధించేందుకు పవర్ ఎలక్ట్రానిక్స్ లో దేశీయ పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించాలన్న కార్యదర్శి
Posted On:
07 APR 2025 7:29PM by PIB Hyderabad
నేషనల్ మిషన్ ఆన్ పవర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (ఎన్ఎఎంపీఈటీ) కింద అభివృద్ధి చేసిన సాంకేతికతల వ్యాపారానికి టీవోటీ/ఎంఓఏ/ఎంవోయూపై సంతకం చేసినట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ (మొయిటీ) కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ ప్రకటించారు. న్యూఢిల్లీలోని ఎలక్ట్రానిక్స్ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. పవర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశీయ సాంకేతికతను ఉపయోగించాల్సిన అవసరాన్ని మైటీ కార్యదర్శి ఈ సమావేశంలో వివరించారు.
ఎన్ఏఎంపీఈటీ ఆధ్వర్యంలో మొయిటీ తోడ్పాటుతో అభివృద్ధి చేసిన సాంకేతికతలను ఈ సమావేశంలో ప్రముఖంగా ప్రదర్శించారు. ఈ సాంకేతికతలు వాణిజ్యపరమైన అవసరాల కోసం అభివృద్ధి చేశారు. వాటిని అమలు చేసి, పరీక్షించి, ధ్రువీకరించారు. సాంకేతిక బదిలీ (టీవోటీ), అవగాహనా ఒప్పందం (ఎంవోయూ), ఒప్పంద పత్రం (ఎంవోఏ)లపై కార్యదర్శి సమక్షంలో సంతకం చేశారు. వాటి వివరాలు:
ఎలక్ట్రిక్ వాహనాల కోసం వైర్లెస్ ఛార్జర్
దేశీయంగా సీ-డాక్ (టీ), నాగపూర్ వీఎన్ఐటీ తయారు చేసిన 1.5 కి.వా. వైర్లెస్ ఛార్జర్ టెక్నాలజీని గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేయడం: ఈ ఛార్జర్కు 230 వోల్టుల, 50 హెర్ట్స్ ఏసీ సింగిల్ ఫేజ్ సరఫరాపై పనిచేసే సామర్థ్యం ఉంది. అంతేకాకుండా, 48 వోల్టుల వద్ద 4.8 కి.వా. ఆన్బోర్డు బ్యాటరీ ప్యాక్ను 30 ఆంపియర్ల విద్యుత్తో 3 గంటల్లో ఛార్జి చేస్తుంది. 7.5 నుంచి 12.5 సెం.మీ.ల కాయిల్ సెపరేషన్తో 89.4 శాతం గరిష్ఠ సామర్థ్యాన్ని చేరుకుంటుంది. ఈ ఛార్జర్లలో 88 కి.హెర్ట్స్ వద్ద పనిచేసే సిలికాన్ కార్బైడ్ ఆధారిత ఎంఓఎస్ ట్రాన్సిస్టర్లు ఉంటాయి. అలాగే షార్ట్ సర్క్యూట్, ఓపెన్ సర్క్యూట్ నుంచి రక్షణ అందించే సౌలభ్యాన్ని కలిగి ఉంటాయి.
రైలింజన్ల కోసం స్వదేశీ పరిజ్ఞానంతో ప్రొపల్షన్ వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు ఒప్పంద పత్రం
భారతీయ రైల్వేల్లో ప్రొపల్షన్ వ్యవస్థలను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడానికి సీ-డాక్, చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్డబ్ల్యూ)కు పారిశ్రామిక ప్రతినిధుల మధ్య అవగాహన కుదిరింది. ఒప్పంద పత్రంపై ఈ సంస్థలు సంతకాలు చేశాయి. 2030 నాటికి భారతీయ రైల్వేల్లో పూర్తి విద్యుద్దీకరణ చేయాలన్న లక్ష్యంతో 3-ఫేజ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్లకు దేశీయంగా ప్రొపల్షన్ వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రయత్నాలను ఈ ఒప్పందం తెలియజేస్తుంది. ప్రతిపాదిత ప్రొపల్షన్ వ్యవస్థ అధిక శక్తి కలిగిన రెండు 2.5 ఎంవీఏ ట్రాక్షన్ కన్వర్టర్లు, మూడు 130 కేవీఏ ఆగ్జిలరీ కన్వర్టర్లు, ఒక అధునాతన రైలు నియంత్రణ, నిర్వహణ వ్యవస్థ (టీసీఎంఎస్)లను ఏకీకృతం చేస్తుంది. ఇది ఆధునిక రైలింజన్ల పనితీరు, విశ్వసనీయత, కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దౌలత్ రామ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (భోపాల్), జేఎంవీ ఎల్పీఎస్ లిమిటెడ్ (నోయిడా), ఎలక్ట్రో-వేవ్స్ ఎలక్ట్రానిక్స్ (హెచ్పీ) సంస్థలు ఒప్పంద పత్రంపై సంతకం చేశాయి. పరిశ్రమలు-విద్యాసంస్థలు-ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యాన్ని ఇది తెలియజేస్తుంది. పరీక్షించడం, ఉత్పత్తి ఇంజనీరింగ్, నమూనా అభివృద్ధి, భారతీయ రైల్వేల క్షేత్రస్థాయి ధ్రువీకరణ, పరిశ్రమల నిర్మాణాత్మక స్వీకరణ, వాణిజ్య విస్తరణలో ఈ సహకారంలో భాగస్వాములుగా కీలకపాత్ర పోషిస్తారు.
ఎల్వీడీసీ వ్యవస్థల కోసం కే-డిస్క్ తయారీకీ ఎంవోయూ
హరిత, సుస్థిరమైన గ్రిడ్ పరిష్కారాలను అమలు చేసేందుకు సీ-డాక్, కేరళ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ కౌన్సిల్ (కే-డిస్క్) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఇంధన వనరుల సంరక్షణ, హరిత విద్యుత్ ఏకీకరణ, తక్కువ ఖర్చులో విద్యుత్ పంపిణీలో మార్పులకు నాంది పలికే సాంకేతికతగా ఎన్ఏఎంపీఈటీ కార్యక్రమం ద్వారా సీడాక్ అభివృద్ధి చేసిన 48 వి- లో ఓల్టేజీ డైరెక్ట్ కరెంట్ (ఎల్వీడీసీ) వ్యవస్థ నిలుస్తుంది. ఈ వ్యవస్థ సామర్థ్యాన్ని గుర్తించిన కేరళ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ కౌన్సిల్ (కే-డిస్క్) తన ప్రధాన కార్యాలయంలో అమలు చేసింది. దీంతో 20-30 శాతం మేర విద్యుత్ ఆదా అవడమే కాకుండా 2050 నాటికి కార్బన్ తటస్థీకరణ సాధించాలన్న కేరళ లక్ష్యానికి, 2070 నాటికి సున్నా కర్బన ఉద్ఘారాలు సాధించాలన్న భారత్ లక్ష్యానికి ఈ కార్యక్రమం సహకరిస్తుంది.
న్యూఢిల్లీలోని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి సమక్షంలో పైన పేర్కొన్న టీవోటీ/ఎంవోయూ/ఎంవోఏలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ, నూతన, పునరుత్పాదక మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ), నీతి ఆయోగ్, రైల్వే మంత్రిత్వశాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు ఈవీ ఛార్జర్లు, స్మార్ట్ మీటరింగ్, రైల్ ప్రొపల్షన్, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్ఏఎంపీఈటీ గురించి:
ఇది పవర్ ఎలక్ట్రానిక్స్ (పీఈ) రంగంలో పరిశోధన, అభివృద్ధి, అమలు, ప్రదర్శన, టెక్నాలజీలకు సంబంధించిన వ్యాపారాలను ప్రత్యేకంగా చేపట్టేందుకు మొయిటీ అమలు చేస్తున్న కార్యక్రమమే ఎన్ఏఎంపీఈటీ. ఈ కార్యక్రమాన్ని విద్యాసంస్థలు, పరిశోధన-అభివృద్ధి సంస్థలు, పరిశ్రమలకు నోడల్ కేంద్రంగా వ్యవహరించిన తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) అమలు చేస్తోంది. మారుమూల గ్రామాలకు విద్యుత్ అందించే మైక్రో గ్రిడ్లు, సామూహిక భవనాలకు హరిత విద్యుత్, విద్యుత్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేయడం, పంపిణీ వ్యవస్థలో స్మార్ట్ పవర్ క్వాలిటీ సెంటర్, ఆహార శుద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమల కోసం హై ఓల్టేజి పవర్ ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ మార్కెటింగ్, సాంకేతికతలను అందించే వేదికల ద్వారా స్టార్టప్లకు ప్రోత్సాహం తదితరమైన అంశాలపై ఈ కార్యక్రమం ప్రధాన దృష్టి సారిస్తుంది.
***
(Release ID: 2120018)
Visitor Counter : 30