మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
పశువుల ఆరోగ్యం, వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (ఎల్ హెచ్ డి సి పి) సవరణకు మంత్రివర్గం ఆమోదం
Posted On:
05 MAR 2025 3:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పశువుల ఆరోగ్యం, వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని (ఎల్ హెచ్ డి సి పి) సవరించేందుకు ఆమోదం తెలిపింది.
ఈ పథకంలో నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్ఏడీసీపీ), ఎల్ హెచ్ అండ్ డి సి, పశు ఔషధి అనే మూడు భాగాలు ఉన్నాయి. ఎల్ హెచ్ అండ్ డి సి లో క్రిటికల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (సిఎడిసిపి), వెటర్నరీ ఆసుపత్రులు, డిస్పెన్సరీల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న వాటి బలోపేతం - మొబైల్ వెటర్నరీ యూనిట్ (ఈఎస్వీహెచ్డీ-ఎంవీయూ), స్టేట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ యానిమల్ డిసీజెస్ (ఏఎస్సీఏడీ) అనే మూడు ఉప భాగాలు ఉన్నాయి. పశు ఔషధి అనేది ఎల్ హెచ్ డి సి పి పథకానికి జోడించిన కొత్త భాగం. ఈ పథకానికి 2024-25, 2025-26 సంవత్సరాలకు మొత్తం రూ.3,880 కోట్లు ఖర్చు చేస్తారు. ఇందులో నాణ్యమైన, తక్కువ ఖర్చయ్యే జనరిక్ మందుల్ని అందించడానికి రూ.75 కోట్ల కేటాయింపు, పశు ఔషధి కాంపోనెంట్ కింద మందుల అమ్మకాలకు ప్రోత్సాహకం అందించడం వంటివి ఉన్నాయి.
ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (ఎఫ్ ఎం డి), బ్రూసెల్లోసిస్, పెస్టే డెస్ పెటిట్స్ రూమినెంట్స్ (పిపిఆర్), సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ (సిఎస్ఎఫ్), లంపీ స్కిన్ డిసీజ్ వంటి వ్యాధులు పశువుల ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఎల్ హెచ్ డి సి అమలు ద్వారా టీకాలతో ఈ వ్యాధులను నిరోధించి, నష్టాలను తగ్గించేందుకు అవకాశం కలుగుతుంది. సంచార పశువైద్య యూనిట్ల (ఈఎస్వీహెచ్డీ-ఎంవీయూ) ఉప విభాగాల ద్వారా ఇళ్ల వద్దే పశువులకు ఆరోగ్య సంరక్షణను అందించడానికి, పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రం ద్వారా, సహకార సంఘాల ద్వారా జనరిక్ మందుల్ని - పశు ఔషధి లభ్యతను మెరుగుపరచడానికి ఈ పథకం తోడ్పడుతుంది.
ఈ విధంగా వ్యాక్సినేషన్, పర్యవేక్షణ, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా పశువుల వ్యాధుల నివారణ, నియంత్రణకు ఈ పథకం దోహదపడుతుంది. అలాగే, ఈ పథకం ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. ఉపాధిని సృష్టిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది. ఇంకా పశువుల వ్యాధులకు చికిత్సల కోసం రైతులు ఆర్థికంగా నష్టపోకుండా నిరోధిస్తుంది.
***
(Release ID: 2108499)