పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
పైలట్ల కోసం డిజిటల్ లైసెన్సును ప్రారంభించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
పౌర విమానయానంలో ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ (ఈపీఎల్)ను ప్రారంభించిన రెండో దేశంగా భారత్
Posted On:
20 FEB 2025 3:57PM by PIB Hyderabad
పైలట్ల కోసం ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ (ఈపీఎల్)ను పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ఈ రోజు ప్రారంభించారు. దేశ పౌర విమానయాన రంగాన్ని ఆధునికీకరించడంతో పాటు భద్రతను, రక్షణను, సామర్థ్యాన్ని విస్తరించే దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) అనుమతితో ఈ అత్యాధునిక వ్యవస్థను ప్రారంభించిన రెండో దేశంగా భారత్ నిలిచింది.
పైలట్ల వ్యక్తిగత లైసెన్సుకు డిజిటల్ రూపమే ఈపీఎల్. ఇది పైలట్లకు ముద్రించి ఇచ్చే సంప్రదాయ లైసెన్స్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఈజీసీఏ మొబైల్ అప్లికేషన్ ద్వారా దీన్ని సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ పక్రియ భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ‘సులభతర వ్యాపారం’, ‘డిజిటల్ ఇండియా’ విధానాలకు అనుగుణంగా సజావుగా, పారదర్శకంగా సాగుతుంది.
ఈపీఎల్, ఐసీఏవో సవరణ 178 నుంచి వ్యక్తిగత లైసెన్సింగ్ అనుబంధం-1 ను అనుసరిస్తుంది. ఇది భద్రతను, సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా ఎలక్ట్రానిక్ లైసెన్సులు ఉపయోగించేలా సభ్యదేశాలను ప్రోత్సహిస్తుంది. పౌర విమానయాన రంగంలో మనకంటే ముందున్న దేశాలు ఇప్పటికీ ఈ వ్యవస్థలను రూపొందించే ప్రక్రియలోనే నిమగ్నమై ఉన్నాయి. డిజిటల్ పౌర విమానయాన పరిష్కారాలను అనుసరించడంలో భారత్ ముందంజలో ఉంది.
‘‘భారత పౌర విమానయాన రంగం వేగంగా పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో సుమారుగా 20,000 మంది పైలట్ల అవసరం ఉంది. పౌర విమానయాన రంగానికి పైలట్లే వెన్నెముక. ఈజీసీఏ, ఈపీఎల్ సహకారంతో ప్రపంచవ్యాప్తంగా వారికి ఉద్యోగాలను కల్పించేందుకు వినూత్నమైన, సాంకేతిక ఆధారిత పరిష్కారాలను వినియోగిస్తున్నాం. అదే సమయంలో భద్రతా కార్యకలాపాల్లో భాగంగా వారి వివరాలను తక్షణమే ఉపయోగించుకొనేలా అందుబాటులో ఉంచుతాం’’ అని కేంద్ర మంత్రి అన్నారు.
ఈ విధానాన్ని అమలు చేయడానికి ముందు స్మార్ట్ కార్డు రూపంలో ఇప్పటి వరకు 62,000 లైసైన్సులను పైలట్లకు డీజీసీఏ అందించింది. 2024లో ముద్రించిన కార్డుల రూపంలో 20,000 అంటే సగటున నెలకు 1,667 కార్డులు జారీ చేశారు. ఈపీఎల్ ప్రారంభంతో లైసెన్సింగ్ ప్రక్రియను వ్యవస్థీకృతం చేయడం ద్వారా దశల వారీగా కార్డులు ముద్రించాల్సిన అవసరాన్ని తగ్గిస్తారు. తద్వారా కాగితం, ప్లాస్టిక్ వినియోగం తగ్గి పర్యావరణ సుస్థిరతపై సానుకూల ప్రభావం కలుగుతుంది.
డిజిటల్ ఆవిష్కరణలతో పాటు సమర్థవంతమైన కార్యకలాపాల ద్వారా భారత పౌర విమానయాన రంగ రూపురేఖలు మార్చేందుకు చేపడుతున్న కార్యక్రమాల గురించి మంత్రి వివరించారు. వీటిలో లైసెన్సింగ్ విధానాన్ని వ్యవస్థీకరించడానికి ఈజీసీఏ, డ్రోన్ల కోసం డిజిటల్ స్కై, ఎయిర్లైన్ కార్యకలాపాల కోసం ఎలక్ట్రానిక్ ఫ్లైట్ ఫోల్డర్ (ఈఎఫ్ఎఫ్) తదితర కీలకమైన కార్యక్రమాలు ఉన్నాయి.
పైలట్ల కోసం ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ (ఈపీఎల్) ప్రక్రియను ప్రారంభించడం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నియమావళిని దేశంలో అమలు చేయడంంలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది విమానయాన కార్యకలాపాల్లో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడంతో పాటు.. నకిలీలకు ఆస్కారం లేని లైసెన్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
***
(Release ID: 2105165)
Visitor Counter : 16