రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
మహారాష్ట్రలోని పుణేలో రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు
శంకుస్థాపన చేసిన కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
పుణే జిల్లాలోని ఎన్ హెచ్ -965 పై మోహోల్- ఆలండి (పాల్ఖీ మార్గ్ ఆరో ప్యాకేజ్ )లో డైవ్ ఘాట్ నుండి హడప్సర్ సెక్షన్ ( 220.900 కి.మీ నుండి 234.150 కి.మీ అంటే 13.25 కి.మీ) వరకు ప్రస్తుతం ఉన్న రెండు లేన్ల రహదారి నాలుగు లేన్ల రహదారిగా మార్పు (మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 819 కోట్లు)
జాతీయ రహదారి-48పై పుణే సతారా సెక్షనులో ములా, ముతా నదిపై ప్రధాన వంతెనల నిర్మాణం (మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 80 కోట్లు)
Posted On:
21 SEP 2024 6:55PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని పుణేలో రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర పౌర విమాన యాన, సహకార శాఖల సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మొహోల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతీయ రహదారి 965 (పాల్ఖీ మార్గ్ ప్యాకేజీ 6)లోని మొహోల్- అలండి సెక్షన్లో డైవ్ ఘాట్ నుండి హడప్సర్ వరకు 13 కిలోమీటర్ల రెండు వరసల మార్గాన్ని నాలుగు లేన్లుగా మార్చే ప్రాజెక్టుకు, ములా-ముతా నదిపై ప్రధాన వంతెనల నిర్మాణంతో పాటు జాతీయ రహదారి 48 లోని పూణే-సతారా సెక్షన్లో సింహగడ్ రోడ్ నుండి వార్జే వరకు సర్వీస్ రోడ్ల నిర్మాణం ప్రాజెక్టుకు శ్రీ గడ్కరీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా శ్రీ నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఎన్ హెచ్ -965లోని దువే ఘాట్ సెక్షన్ వరకు రహదారిని వెడల్పు, అభివృద్ధి చేయడం వల్ల ఈ సెక్షన్లో రద్దీ గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. ఇంకా ఇది పాల్కీ యాత్రకు వెళ్లే వారికి సురక్షితమైన, ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందిస్తుందని తెలిపారు.. పాల్కీ యాత్ర మార్గాల వెంబడి ఉన్న విశ్రాంతి స్థలాలను ఎంఎస్ఐడీసీ ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు.
ములా, ముతా నదిపై ప్రధాన వంతెనల నిర్మాణం, నార్హే నుంచి నవలే బ్రిడ్జి వరకు సర్వీస్ రోడ్డు వెడల్పుతో పాటు సింహగఢ్ రోడ్డు నుంచి వార్జే వరకు కలపడం వల్ల ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని చెప్పారు.
రూ.7500 కోట్ల విలువైన ఎన్ హెచ్ 60లోని నాసిక్ ఫాటా ఖేడ్ సెక్షన్లో ఎలివేటెడ్ కారిడార్ కోసం కూడా జాతీయ రహదారుల సంస్థ టెండర్ ను ఆహ్వానించిందని ఆయన తెలిపారు.
రూ.5 వేల కోట్లతో రావెట్ నుంచి నార్హే ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) పూర్తయిందని, 2024 డిసెంబర్-2024లో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని శ్రీ గడ్కరీ తెలిపారు. జాతీయ రహదారి-548డిలోని తలేగావ్ చకన్ శిక్రాపూర్ సెక్షన్, జాతీయ రహదారి- 753 ఎఫ్ లోని పుణె-షిరూర్ సెక్షన్ ఎలివేటెడ్ కారిడార్లను ఎంఎస్ఐడిసి అభివృద్ధి చేస్తుందని చెప్పారు. రెండు నగరాలను కలుపుతూ ముంబయి, పుణే, బెంగళూరు నుంచి ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు న్యూ ముంబై - బెంగళూరు ఎక్స్ ప్రెస్ వేకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) ను రూపొందించినట్లు తెలిపారు.
పుణే, సతారా, షోలాపూర్ లను కలపడం వల్ల విఠల్ స్వామి పవిత్ర ఆలయానికి వెళ్లే భక్తులకు సున్నితమైన ప్రయాణాన్ని అందించడం ఈ ప్రాజెక్టుల లక్ష్యం. ఇంకా, ఈ విస్తరణ ప్రాజెక్టులు ప్రయాణాన్ని వేగవంతం, సులభతరం చేస్తాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తాయి.
ప్రాజెక్టు ప్రయోజనాలు:
-
దేశవ్యాప్తంగా, దేశం బయట ఉన్న భక్తులను విఠల్ స్వామి పవిత్ర ఆలయానికి చేరువ చేస్తాయి.
-
జాతీయ రహదారికి ఇరువైపులా పాల్కీ యాత్రకు ప్రత్యేక నడకదారి.
-
భక్తులకు ఇబ్బంది లేకుండా సురక్షితమైన ప్రయాణం.
-
ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనంతో పాటు సమయం, ఇంధనం ఆదా.
-
వ్యవసాయ ఉత్పత్తులను, స్థానిక ఉత్పత్తులను పెద్ద మార్కెట్లకు సులభంగా రవాణా చేయడానికి వీలు.
-
పాల్కీ యాత్ర ఊరేగింపులో దాదాపు 9-10 లక్షల మంది వార్కరీలు పాల్గొంటారు.
-
పుణే, సతారా, సోలాపూర్ జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి.
-
పుణే పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.
ఉన్నత, సాంకేతిక విద్య, జౌళి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ చంద్రకాంత్ దాదా పాటిల్, బారామతి ఎంపీ శ్రీమతి సుప్రియా సూలే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2057644)
Visitor Counter : 16