నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"విశ్వ కర్మ" తో సంప్రదాయ హస్త కళాకారులకు గట్టి చేయూత : శ్రీ ఈటెల రాజేందర్

నాడు పోస్టు చేయడమైనది: 20 SEP 2024 4:46PM by PIB Hyderabad

ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయింది.  ఈ నేపథ్యంలో మహారాష్ట్ర లోని వార్ధాలో జాతీయ ‘పీఎం విశ్వకర్మ’  కార్యక్రమాన్ని నిర్వహించగా,  తదునుగుణంగానే ఈరోజు హైదరాబాద్ విద్యానగర్ లోని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (ఎన్ ఎస్ టీ ఐ) లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.    

ఈ కార్యక్రమానికి తెలంగాణ మల్కాజిగిరి  నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు శ్రీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం సంప్రదాయ చేతివృత్తి కళాకారులకు సాధికారత కల్పించడంలో కీలక ముందడుగుగా అభివర్ణించారు. ఈ పథకం ఎంతోమంది విశ్వకర్మల జీవితాల్లో పెనుమార్పులు తీసుకు రావడమేగాక, దేశ ఘన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో ముఖ్య భూమిక పోషిస్తోందని అన్నారు. తెలంగాణలో ఈ పథకం సత్ఫలితాలు ఇస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పేర్లు నమోదవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కుట్టుపనివారు అత్యధిక సంఖ్యలో ఈ పథకం కింద తమ పేర్లు నమోదు చేసుకున్నారని అన్నారు. సంప్రదాయ చేతివృత్తుల వారు, కళాకారులకు ఆధునిక పనిముట్లు, ఆర్థిక సాయం అందించడం ద్వారా  వారిని ఈ పథకం సాధికారులను  చేస్తోందని అన్నారు.



కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు శ్రీ రాజేందర్ సర్టిఫికెట్లను అందజేశారు. డైనమిక్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్,  జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ, విద్యానగర్ ఐఎంసి  ఛైర్మన్  శ్రీ జీ ఆర్ సూర్య రాజ్;  నేషనల్ ఇన్స్ట్రక్షనల్ మీడియా ఇన్స్టిట్యూట్, చెన్నై డైరెక్టర్ ,ఆర్డీఎస్డీఈ  తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీ కె. శ్రీనివాస రావుతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల హస్తకళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

 

నేపథ్యం:

చేతులు, పనిముట్లతో  పనిచేసే 18 రంగాలకు చెందిన కళాకారులు,  చేతివృత్తుల వారికి సంపూర్ణ సహకారం అందించే లక్ష్యంతో గత ఏడాది సెప్టెంబర్ 17 న ప్రధానమంత్రి "పీఎం విశ్వకర్మ" పథకాన్ని ప్రారంభించారు.

ఈ కింది 18 రంగాల వారు ఈ పథకం పరిధిలోకి వస్తారు...

1. వడ్రంగులు  2. నావలను తయారుచేసే వారు 3. ఆయుధ పనిముట్ల తయారీదార్లు 4. కమ్మరి పనివారు 5. సుత్తి/ఇతర పనిముట్లు తయారు చేసేవారు 6. తాళంకప్పల తయారీదార్లు 7. కంసాలి పనివారు 8. కుమ్మరి పనివారు 9. శిల్పులు/రాళ్ళు కొట్టే వారు 10. చెప్పులు తయారుచేసే వారు  11. మేస్త్రీలు 12. బుట్టలు/చాపలు/చీపుర్ల అల్లికదార్లు, కొబ్బరి పీచు తో వివిధ గృహోపయోగ వస్తువులు చేసేవారు 13. సంప్రదాయ బొమ్మలు తయారుచేసేవారు 14. నాయీలు 15. పూలమాలల తయారీదార్లు 16. రజకులు 17. టైలర్లు 18. చేపల వలల తయారీదార్లు

ఈ పథకం ద్వారా  గుర్తించిన చేతివృత్తుల వారికి పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులు అందిస్తారు.  నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి  5-7 రోజుల ప్రాథమిక శిక్షణతో పాటు 15 రోజులు లేదా అంతకు మించి అడ్వాన్స్ శిక్షణను అందిస్తారు, ఆయా శిక్షణా కాలాల్లో రోజుకి 500 రూపాయల భృతి, వెయ్యి రూపాయల రవాణా ఖర్చులు ఇస్తారు.

 పనిముట్ల కొనుగోలు కోసం ఇ - వోచర్ల ద్వారా రూ.15,000 వరకూ సొమ్మును అందిస్తారు. లబ్ధిదారులు తమ వ్యాపార కార్యకలాపాల అభివృద్ధికి  రూ. 3 లక్షల వరకూ  పూచీకత్తు లేని రుణం పొందవచ్చు. తొలివిడత కింద 18 నెలల కాలవ్యవధితో రూ. లక్ష, మలివిడతలో 30  నెలల కాల వ్యవధితో రూ. 2 లక్షలు అందిస్తారు.  ISTHAARU.  - 18 నెలల మొదటి విడత లో లక్ష రూపాయలు, 30 నెలల కాలం  మలి విడతలో 2 లక్షల రూపాయలను ఇస్తారు. లబ్ధిదారులు ఈ రుణంపై 5% వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వం 8% భరిస్తుంది. సాధారణ సర్వీస్ కేంద్రాల్లో  ఆధార్ ద్వారా బయో మెట్రిక్ ధ్రువీకరణ అనంతరం పీఎం విశ్వకర్మ పోర్టల్ లో పేర్లను నమోదు చేసుకోవాలి.  స్క్రీనింగ్ కమిటీ ఆమోదం అనంతరం నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.  

ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తయిన 20 లక్షల మంది తమ పేర్లను ఈ పథకం కింద నమోదు చేసుకొన్నారు. దాదాపు 8 లక్షల మంది శిక్షణా కేంద్రాల్లో తమ నైపుణ్యాలకి మెరుగులు దిద్దుకున్నారు. 8 లక్షల మంది రూ.15,000 విలువైన పనిముట్ల వోచర్లను పొందగా, ఆయా పనిముట్లు వారి ఇంటివద్దనే వారికి అందజేసే ఏర్పాట్లు జరిగాయి. అలాగే రూ.1400 కోట్ల విలువైన రుణాలను 1.60 లక్షల మందికి పైగా లబ్ధిదార్లు అందుకున్నారు. వీరంతా తమ వ్యాపారాలను అభివృద్ధి పరుచుకుని మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నారు.


 

 



తెలంగాణాలో పీ ఎం విశ్వకర్మ పథకం అమలు తీరు :

1.    నమోదు ధ్రువీకరణలు

నమోదు చేసుకున్నవారి సంఖ్య :  2,89,431

పూర్తయిన మూడు-దశల ధ్రువీకరణలు:  55,824

 

2.     శిక్షణ వివరాలు

- ప్రారంభమైన కేంద్రాలు : 85

- శిక్షణ జరుగుతున్న జిల్లాలు : 26

- శిక్షణ అందిస్తున్న విభాగాలు : 14 ( టైలర్లు, మేస్త్రీలు, వడ్రంగి పని వగైరా..)

 

3. నమోదు/ శిక్షణ పూర్తి

- మొత్తం నమోదైన సంఖ్య  (శిక్షణ పూర్తయిన వారు): 29,70161 (929 బృందాలు /బాచ్ లు )

- కొనసాగుతున్న శిక్షణ వివరాలు  : 1183 (48 బృందాలు /బాచ్ లు)

 

4. అందిస్తున్న సహకారం వివరాలు

- భృతి అందజేత : 20,037

- పనిముట్ల కిట్ కోసం ఎంపి కైనవారు : 30,496

- రుణాల ప్రక్రియ పూర్తయిన వారి సంఖ్య  : 2,951

 

5. నమోదు ఆధారంగా ముందున్న జిల్లాలు  

1. నల్గొండ

2. కరీంనగర్

3. కామారెడ్డి

4. నిజామాబాద్

5. నిర్మల్

 

****


(రిలీజ్ ఐడి: 2057123) సందర్శకుల సూచీ సంఖ్య : : 137
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English