బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు రంగంలో పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులపై సలహాల కోసం స్టాండింగ్ సైంటిఫిక్ రీసెర్చ్ కమిటీ సమావేశం
Posted On:
22 AUG 2024 1:29PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా అధ్యక్షతన స్టాండింగ్ సైంటిఫిక్ రీసెర్చ్ కమిటీ (ఎస్ఎస్ఆర్సీ) ప్రత్యేక సమావేశం 2024 ఆగస్టు 21న ద్విమాథ్యమ విధానంలో జరిగింది. ఈ సమావేశంలో బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి రూపిందర్ బ్రార్.. సంయుక్త కార్యదర్శి, ఆర్థిక సలహాదారు శ్రీమతి విస్మితా తేజ్, సలహాదారు(ప్రాజెక్టులు) శ్రీమతి నిరుపమ కొట్రు, మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు, ఎస్ఎస్ఆర్సీ సభ్యులు, వివిధ విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు, ప్రముఖ మైనింగ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. బొగ్గు రంగంలోని పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) ప్రాజెక్టులు, అన్వేషణ పద్ధతులను అభివృద్ధి చేయడం, బొగ్గు ఉత్పత్తిని పెంచడం, భద్రతా చర్యలను మెరుగుపరచడం, పర్యావరణాన్ని రక్షించడంపై ఈ సమావేశం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
శాస్త్ర, సాంకేతిక విభాగం(డీఎస్టీ), నీతి ఆయోగ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(డీజీఎంఎస్) వంటి మంత్రిత్వ శాఖలు, విభాగాల ప్రతినిధులతో పాటు కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్(ఎన్ఎల్సీఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్), సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇనిస్టిట్యూట్ (సీఎంపీడీఐ) నుంచి పరిశ్రమ ప్రతినిధులు ఎస్ఎస్ఆర్సీలో ఉన్నారు. ఐఐటీ(ఐఎస్ఎం) ధన్బాద్, ఐఐటీ(బీహెచ్యూ) వారణాసి, ఐఐటీ కాన్పూర్ వంటి ప్రముఖ విద్యా సంస్థలతో పాటు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ (సీఐఎంఎఫ్ఆర్), సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీఎంఈఆర్ఐ) వంటి పరిశోధనా సంస్థలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి.
ఈ సమావేశంలో బొగ్గు రంగంలో పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇస్తూ సవాళ్లు, తీసుకుంటున్న చర్యలు, ముందుకు సాగే మార్గాన్ని సీఎంపీడీఐ ప్రతినిధులు నొక్కి చెప్పారు. పరిశోధన ఫలితాలను వివిధ వర్గాల వారికి అందించడానికి చేపట్టిన కీలక కార్యక్రమాలు, చర్యల గురించి వివరించారు. బొగ్గు, ఇంధన రంగాల్లోని వివిధ విభాగాల్లో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు రాంచీలోని సీఎంపీడీఐలో 'నేషనల్ సెంటర్ ఫర్ కోల్ అండ్ ఎనర్జీ రీసెర్చ్(ఎన్ఏసీసీఈఆర్)' ఫేజ్-1ను ఏర్పాటు చేస్తున్నారు. అదనంగా, సీఐఎల్/ఎంఓసీ(బొగ్గు మంత్రిత్వ శాఖ) ఆర్ అండ్ డీ లేదా ఎస్ అండ్ టీ పథకాల కింద పూర్తైన, కొనసాగుతున్న అనేక అధిక ప్రభావ ప్రాజెక్టులను వివరించారు.
ప్రజంటేషన్ తరువాత, హాజరైనవారు వివరణాత్మక చర్చలలో నిమగ్నమయ్యారు, అనేక కీలక సూచనలు చేశారు, అవి:
- తరచుగా సమీక్షలు: రంగాల వారీగా లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు నిర్ధారించుకునేందుకు అధిక-ప్రభావ ఆర్ అండ్ డీ ప్రాజెక్టులపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలి.
- ప్రోత్సాహకాలు: ప్రభావవంతమైన ఫలితాలను కనబరిచే ఆర్&డీలో పాల్గొన్న గనులు, సంస్థలకు చెందిన పరిశోధకులకు ప్రోత్సాహకాలు అందించాలి.
- వార్షిక జాతీయ సెమినార్: ప్రయోజనకరమైన ఆర్ అండ్ డీ ప్రాజెక్టుల ఫలితాలను ప్రధానంగా చర్చించేందుకు ప్రతి సంవత్సరం ఒక జాతీయ సెమినార్ నిర్వహించాలి.
- సలహా కమిటీ ఏర్పాటు: బొగ్గు, ఇంధన రంగంలో కొనసాగుతున్న ఆర్ అండ్ డీ కార్యకలాపాలు, సవాళ్లపై విద్యార్థులు, పరిశోధకులకు అవగాహన కల్పించేందుకు ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ప్రఖ్యాత ప్రభుత్వ, ప్రైవేటు మైనింగ్ సంస్థలతో కూడిన సలహా కమిటీని ఏర్పాటు చేయాలి.
- అవగాహన కార్యక్రమాలు: బొగ్గు, ఇంధన రంగంలో ఆర్ అండ్ డీ కార్యకలాపాలపై అవగాహన కల్పించడానికి సీఎంపీడీఐ దేశవ్యాప్తంగా మైనింగ్ సంస్థలు, పరిశోధనా సంస్థలను సందర్శించాలి.
- శక్తి పరివర్తన పరిశోధన(ఎనర్జీ ట్రాన్సిషన్ రీసెర్చ్): శక్తి పరివర్తన, నికర-సున్నా ఉద్గారాలను సాధించడానికి సంబంధించిన రంగాలలో పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- డిజిటల్ కార్యక్రమాలు: డిజిటల్ వేదికలు, సోషల్ మీడియా ద్వారా పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు, వాటి కార్యకలాపాల విజయాలను ప్రచారం చేయటాన్ని ప్రోత్సహించాలి.
- ఏకీకృత ఆర్ అండ్ డీ ప్లాట్ఫామ్: ఒకే దానిపై ఎక్కువ సార్లు పరిశోధన జరగటాన్ని నివారించేందుకు బొగ్గు, లిగ్నైట్ రంగంలోని అన్ని ఆర్ అండ్ డీ కార్యకలాపాలకు ఒకే వేదికను ఏర్పాటు చేయాలి.
బొగ్గు రంగంలో ఆర్ అండ్ డీ భవిష్యత్ కార్యాచరణను రూపొందించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ సలహాలను స్వీకరిస్తోంది. బొగ్గు రంగంలో పరిశోధన, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం, సృజనాత్మకత, సుస్థిరత, ఇంధన రంగంలో అభివృద్ధి చెందుతున్న సవాళ్లను పరిష్కరించడంపై నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ సమావేశం ముగిసింది.
***
(Release ID: 2047950)
Visitor Counter : 28