గనుల మంత్రిత్వ శాఖ
కీలకమైన ఖనిజాల అన్వేషణ కోసం వ్యూహాత్మక మైనింగ్ కార్యక్రమం
నాడు పోస్టు చేయడమైనది:
29 JUL 2024 3:08PM by PIB Hyderabad
దేశంలో కీలకమైన ఖనిజాల(క్రిటికల్ మినరల్స్) అన్వేషణ, తవ్వకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది.
24 కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాలకు సంబంధించి బ్లాకులను వేలం వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కల్పించేందుకు 1957 గనులు,ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) చట్టాన్ని సవరించారు. ఇప్పటివరకు 14 బ్లాకులను విజయవంతంగా వేలం వేశారు. కీలకమైన, లోతైన ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడానికి.. 29 కీలకమైన, లోతైన ఖనిజాలకు సంబంధించి అన్వేషణ లైసెన్స్( ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఖనిజాలకు సంబంధించి ప్రాథమిక సర్వే, అన్వేషణకు సంబంధించి అధ్యయనం తదితర కార్యకలాపాలను చేపట్టడానికి ఈ లైసెన్స్ అనుమతిస్తుంది.
అన్వేషణలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు గనుల మంత్రిత్వ శాఖ 22 ప్రైవేటు అన్వేషణ ఏజెన్సీలను (ఎన్పీఈఏ)నోటిఫై చేసింది. నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్(ఎన్ఎంఈటీ) నిధులతో ఈ సంస్థలు అన్వేషణ ప్రాజెక్టులను చేపడుతున్నాయి.
2015, 2021, 2023లలో ఎంఎండీఆర్ చట్టం 1957లో సవరణల ద్వారా భారత ప్రభుత్వం వివిధ విధాన సంస్కరణలను ప్రవేశపెట్టింది. మరింత పారదర్శకత కోసం వేలం ద్వారా ఖనిజలకు సంబంధించిన అనుమతులు,గ్రాంట్ల మంజూరు.. మైనింగ్ సంబంధిత కార్యకలాపాలతో ప్రభావితమైన వ్యక్తులు, ప్రాంతాల ప్రయోజనాలు కోసం పనిచేసే లక్ష్యంతో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఏర్పాటు.. అన్వేషణకు ఊతమిచ్చేందుకు ఎన్ఎంఈటీ (నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్) ఏర్పాటు.. వార్షిక ఉత్పత్తిలో 50 శాతం వరకు విక్రయించేందుకు వీలు కల్పించటం ద్వారా క్యాప్టీవ్, వాణిజ్య గనుల మధ్య వ్యత్యాసాన్ని తొలగించడం… 24 కీలకమైన ఖనిజాల గనుల లీజు, కాంపోజిట్ లైసెన్స్ కోసం ప్రత్యేకంగా వేలం నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం.. ఖనిజ అన్వేషణలో ప్రైవేట్ భాగస్వామ్యం కోసం ఎన్పీఈఏల(నోటిఫైడ్ ప్రైవేట్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీలు) గుర్తింపు, 29 కీలకమైన(క్రిటికల్ మినరల్స్), లోతైన ఖనిజాల విషయంలో అన్వేషణ లైసెన్స్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టటం వంటివి ఈ సవరణల్లో ముఖ్యమైనవి.
ఈ సంస్కరణలన్నీ గనుల తవ్వకం రంగంలో పెట్టుబడులను పెంచడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంపొందించనున్నాయి.
పైనేలను తొలగించడం, ఉపయోగించడం.. భూ ప్రకంపనల విషయంలో జాగ్రత్తలు..గాలి, శబ్ద కాలుష్య నివారణ, నియంత్రణ... విషపూరిత ద్రవం విడుదల చేయకుండా జాగ్రత్తలు, వృక్షజాల పునరుద్ధరణ వంటి పర్యావరణ అంశాలను 2017 ఖనిజ సంరక్షణ, అభివృద్ధి నిబంధనల్లోని ‘అధ్యయనం 5: సుస్థిర మైనింగ్’ తెలుపుతుంది. పర్యావరణ పరిరక్షణ చట్టం, అటవీ పరిరక్షణ చట్టం, కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర భూగర్భ జల ప్రాధికార సంస్థ మార్గదర్శకాలు తదితర నిబంధనలను ప్రతి లీజుదారుడు పాటించాలి. అదేవిధంగా, గనులలో పనిచేసే వ్యక్తుల వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యానికి సంబంధించి 1952 గనుల చట్టం, దీనిప్రకారం వచ్చిన నియమ నిబంధనలు తెలుపుతున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(డీజీఎంఎస్) ద్వారా కార్మిక రక్షణ ప్రామాణికతలకు సంబంధించి నిబంధనలు అమలు అవుతున్నాయి.
ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2038821)
సందర్శకుల సూచీ సంఖ్య : : 81