రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భాగస్వామ్య విలువలు, ఉమ్మడి ప్రయోజనాలకు కట్టుబడి, భారత్-అమెరికా దేశాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కీలక భాగస్వాములుగా ఉన్నాయని ఇండస్-ఎక్స్ సదస్సులో రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనే చెప్పారు


భారత్-అమెరికా రక్షణ సదస్సులో ఆవిష్కరణల 2వ ఎడిషన్ న్యూఢిల్లీలో ముగిసింది

Posted On: 21 FEB 2024 5:28PM by PIB Hyderabad

భాగస్వామ్య విలువలు మరియు ఉమ్మడి ప్రయోజనాలకు కట్టుబడి, ఇండో-పసిఫిక్ ప్రాంత సంక్లిష్ట గతిశీలతను ముందుకు తీసుకువెళ్తూ, భారత్-అమెరికా దేశాలు ఈ ప్రాంతంలో కీలక భాగస్వాములుగా ఉన్నాయని, రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనే పేర్కొన్నారు.  న్యూఢిల్లీలో 2024 ఫిబ్రవరి, 21వ తేదీన జరిగిన ఇండస్-ఎక్స్ సదస్సు రెండవ ఎడిషన్ లో ఆయన ప్రసంగించారు. 

 

ఈ సందర్భంగా రక్షణ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ, “ఈ రోజు, ఇండో-పసిఫిక్ ప్రాంత చరిత్రలో ఒక కీలక ఘట్టాన్ని మనం చూస్తున్నాము.  ఇండో-పసిఫిక్ ప్రాంతం, దాని విస్తారమైన సముద్రాలు, వ్యూహాత్మక జలమార్గాలతో, ప్రపంచ వాణిజ్యం, భౌగోళిక రాజకీయాలు,  భద్రతకు కేంద్ర బిందువుగా నిలిచింది.  భాగస్వామ్య విలువలు, సాధారణ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్న భారత్-అమెరికా దేశాలు ఈ ప్రాంత సంక్లిష్ట గతిశీలతను ముందుకు నడిపించడంలో,  తమను తాము కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దుకున్నాయి.” అని పేర్కొన్నారు. 

 

పరస్పర గౌరవం, వ్యూహాత్మక కలయికతో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న పటిష్టమైన రక్షణ భాగస్వామ్యం గురించి శ్రీ గిరిధర్ అరమనే ప్రముఖంగా పేర్కొంటూ, 2022 సంవత్సరంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంయుక్తంగా ప్రారంభించిన క్లిష్టమైన, నూతన సాంకేతిక కార్యక్రమాలు (ఐ.సి.ఈ.టి) గురించి ప్రస్తావించారు.  “మన మధ్య అభివృద్ధి చెందుతున్న సంబంధాల్లో ఐ.సి.ఈ.టి. ఒక ముఖ్యమైన అంశం.   ఎక్స్-పో లు, హ్యాకథాన్ లు, పిచింగ్ సెషన్ల ద్వారా రక్షణ తో సహా కీలక రంగాల్లో 'ఇన్నోవేషన్ బ్రిడ్జి' లను స్థాపించాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది.” అని ఆయన వివరించారు. 

 

రక్షణ రంగంలో భారత్, అమెరికా దేశాలకు చెందిన అంకుర సంస్థల మధ్య సహకారానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తున్న ఐ.సి.ఈ.టి. ముఖ్యమైన ఫలితం అయిన "డిఫెన్స్-ఇన్నోవేషన్-బ్రిడ్జి" గురించి కూడా ఆయన తెలియజేశారు. 

 

రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో సహ అభివృద్ధి, సహ-ఉత్పత్తి కార్యక్రమాలను సమిష్టిగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా సంయుక్త ఇంపాక్ట్ సవాళ్ళను ప్రవేశపెట్టడం ఒక  విలక్షణమైన విధానమని రక్షణ శాఖ  కార్యదర్శి పేర్కొన్నారు.  “మార్గదర్శక పరిష్కారాలలో చురుకుగా పాల్గొన్న అంకుర సంస్థల విలీనం ఈ భాగస్వామ్య శక్తి, సామర్ధ్యాల నూతన విధానాన్ని పరిచయం చేస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. 

 

ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యం గురించి శ్రీ గిరిధర్ అరమనే మాట్లాడుతూ,  “మన ద్వైపాక్షిక సంబంధం వృద్ధి చెందుతోంది, అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం కోసం భారతదేశం ఎక్కువగా అమెరికా వైపు మొగ్గు చూపుతోంది.  అందుకు ప్రతిగా అమెరికా తన ఇండో-పసిఫిక్ వ్యూహంలో భారతదేశాన్ని కీలక భాగస్వామిగా చూస్తూ, భారతదేశ పెరుగుతున్న రక్షణ సామర్థ్యాలను వినియోగించుకుంటోంది.” అని వివరించారు.  ఇరు దేశాలు భాగస్వాములుగా ఉన్న బహుపాక్షిక ఒప్పందాల గురించి కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. 

 

విమాన వాహకాలతో సహా నౌకా నిర్మాణం మొదలుకొని తేజస్ మల్టీ-రోల్ యుద్ధ విమానాల వంటి అధునాతన ఆయుధ సామాగ్రి అభివృద్ధి వరకు, అదేవిధంగా, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించిన దాడితో పాటు ఇతర అవసరాలకు వినియోగించే యుద్ధ హెలికాప్టర్ల అభివృద్ధి వరకు భారతదేశ రక్షణ ఉత్పత్తులకు సంబంధించిన విజయగాధలను రక్షణ శాఖ కార్యదర్శి ప్రముఖంగా వివరించారు. 

 

వ్యూహాత్మక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠపరచాలనీ, సహకారం విషయంలో పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలనీ, ఈ సదస్సులో పాల్గొన్న భారత్-అమెరికా దేశాలకు చెందిన వివిధ పరిశ్రమల ప్రతినిధులతో పాటు ఇతర భాగస్వాములకు శ్రీ గిరిధర్ అరమనే పిలుపునిచ్చారు.  “మన బలాలు, సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా, భారత్-అమెరికా దేశాలు ఇండో-పసిఫిక్ ప్రాంతానికి చెందిన భౌగోళిక, రాజకీయ ప్రకృతి దృశ్యాన్ని రూపొందించడంతోపాటు, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించగలవు” అని ఆయన చెప్పారు.

 

ఇండస్-ఎక్స్ సదస్సుకు చెందిన క్యాప్-స్టోన్-సెషన్ లో రక్షణ శాఖ కార్యదర్శి పాల్గొన్నారు.  ఇండోపాకామ్ కమాండర్ అడ్మిరల్ జాన్ సి అక్విలినో,  యు.ఎస్.ఐ.బి.సి. అధ్యక్షుడు ఏ.ఎం.బి. అతుల్ కశ్యప్ కూడా హాజరైన ఈ సెషన్ కు ది ఆసియా గ్రూప్ అధ్యక్షుడు మిస్టర్ రెక్సన్ ర్యూ సమన్వయకర్త గా  వ్యవహరించారు. 

 

2024 ఫిబ్రవరి 20, 21 తేదీల్లో న్యూఢిల్లీ లో జరిగిన ఇండస్-ఎక్స్ సదస్సు రెండవ ఎడిషన్ను భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్నోవేషన్స్-ఫర్-డిఫెన్స్-ఎక్సలెన్స్ (ఐ.డీ.ఈ.ఎక్స్), అమెరికా రక్షణ శాఖ (డి.ఓ.డి) సంయుక్తంగా  నిర్వహించాయి.  కాగా, ఈ కార్యక్రమాన్ని అమెరికా-భారత వ్యాపార మండలి (యూ.ఎస్.ఐ.బీ.సీ), భారత రక్షణ తయారీదారుల సంఘం (ఎస్.ఐ.డీఎం) సంయుక్త సమన్వయంతో నిర్వహించారు.   భారత్-అమెరికా దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృతమైన నేపథ్యంలో రక్షణ రంగంలో సాంకేతిక ఆవిష్కరణల కీలకపాత్రను ఈ సదస్సు నొక్కి చెప్పింది. 

 

సరిహద్దుల్లో రక్షణ పరిశ్రమలకు ఉమ్మడి పురోగతిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో, ముఖ్యంగా అంకుర సంస్థలు, ఎం.ఎస్.ఎం.ఈ. ల సాంకేతిక సామర్థ్యాలను ఒకే స్థాయి లోకి తీసుకురావడం కోసం, రెండు రోజుల పాటు నిర్వహించాలని తలపెట్టిన ఈ మార్గదర్శక ఇండస్-ఎక్స్ సమ్మిట్ 2024 ను రూపొందించడం జరిగింది.  అలాగే, ఇండస్-ఎక్స్ పరిధిలో వివిధ సంబంధిత లక్ష్యాలపై చర్చలు, ద్వైపాక్షిక సంభాషణల్లో పాల్గొనడంతో పాటు, సంబంధిత ఫలితాలను, ఇండస్-ఎక్స్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి తగిన చర్యలను ప్రతిపాదించాలనే ఉద్దేశ్యంతో కూడా ఈ సదస్సును రూపొందించడం జరిగింది. 

 

***



(Release ID: 2007921) Visitor Counter : 63


Read this release in: English , Urdu , Hindi