వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పీఎం గతిశక్తి కింద ప్రతిపాదించిన మూడు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రైల్ సాగర్ కారిడార్ ను సమీక్షించిన పీఎం గతి శక్తి 64వ నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్పీజీ) సమావేశం
Posted On:
25 JAN 2024 3:27PM by PIB Hyderabad
9600 కోట్ల వ్యయంతో మంత్రిత్వ శాఖలు సిద్ధం చేసిన ప్రతిపాదనలను చర్చించిన నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్
సికింద్రాబాద్ లోని రైల్వేస్ ఇస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో సమావేశమైన నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్
పీఎం గతిశక్తి 64వ నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ సమావేశం 2023 జనవరి 23న సికింద్రాబాద్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో డీపీఐఐటీ ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) శ్రీమతి సుమితా దావ్రా అధ్యక్షతన జరిగింది. సమావేశానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న రోడ్డు రవాణా ,రహదారుల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, జలమార్గాలు మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ,ఇంధన మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ , నీతి ఆయోగ్, దక్షిణ మధ్య రైల్వే కు చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు.
సమావేశంలో రోడ్డు రవాణా ,రహదారుల మంత్రిత్వ శాఖ (2), రైల్వే శాఖ(1) 9,600 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రతిపాదించిన మూడు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులను సమీక్షించారు. సమావేశంలో సమీక్షించిన ప్రాజెక్టుల వివరాలు :
1. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రతిపాదిత కొత్త బీజీ లైన్
వాణిజ్య, పర్యాటక ప్రాంతాలను ఏకీకృతం చేయడానికి తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బ్రాడ్-గేజ్ లైన్ను నిర్మించాలని రైవే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ మల్టీ మోడల్ రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం, సరకు రవాణా , ప్యాసింజర్ రైళ్ల సామర్థ్యాన్ని పెంచడం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య వేగవంతమైన రైలు సౌకర్యం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా ప్రాజెక్ట్ ఉపాధి అవకాశాలు కల్పించి, పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది.అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించడం కోసం ప్రాంతీయ అభివృద్ధి విధానంలో సమగ్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లోని రేవులకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తారు.
2. భారత్ మాల పరియోజన కింద కొత్త రీజియన్ రింగ్ రోడ్డు నిర్మాణం
ఒడిశా లో నిర్మించి తలపెట్టిన న్యూ రీజియన్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్ ) ప్రతిపాదిత నిర్మాణాన్ని నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ సభ్యులు విశ్లేషించారు. చెన్నై- కోల్కతా మధ్య సరుకు రవాణాను సులభతరం చేయడానికి ప్రాజెక్టును నిర్మించాలని రహదారులు,రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఆర్థిక కారిడార్లు, ఇండస్ట్రియల్ పార్కులు, మినరల్ , మైనింగ్ జోన్లు, గూడ్స్ షెడ్లు మొదలైన వాటితో పాటు రవాణా, ప్రజల అవసరాలు ప్రాజెక్టు వల్ల తీరుతాయి. ఇది ఒడిశాలోని ప్రధాన పట్టణాల మీదుగా సాగుతున్న వాహనాల రాకపోకలను తగ్గిస్తుంది. నగరాల్లో ట్రాఫిక్ రద్దీ నివారిస్తుంది . ప్రయాణ సమయాన్ని 37.5% తగ్గించడం ద్వారా రవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది.
3. ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి -727 ని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించడం
ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి -727 ని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించడానికి ప్రతిపాదించిన మరో ముఖ్యమైన ప్రాజెక్ట్ సమావేశంలో చర్చకు వచ్చింది. పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ బౌద్ధ సర్క్యూట్ రూట్, 2 సోషల్ , 3 ఇండస్ట్రియల్ పార్కులు, ఫిషింగ్ సీఫుడ్, టెక్స్టైల్ క్లస్టర్లు, అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లతో సహా పదకొండు రవాణా సేవలకు మెరుగైన రవాణా సౌకర్యం అందిస్తుంది. ప్రాజెక్టు వల్ల సరిహద్దుల మధ్య వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయని, సామాజిక-ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని , ఆర్థిక కేంద్రాలు, పారిశ్రామిక మండలాలు, వ్యవసాయ ప్రాంతాలు, పారిశ్రామిక పార్కులు మొదలైన వాటికి రహదారి సౌకర్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు, వాణిజ్యం, పెట్టుబడులు అభివృద్ధి చెందుతాయని అంచనా. గిడ్డంగులు , పంపిణీ కేంద్రాలు, లాజిస్టిక్స్ హబ్లతో సహా అనుబంధ రంగాల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలు కల్పించి , పెరుగుతున్న ట్రాఫిక్ మరియు ప్రయాణ డిమాండ్ను తీర్చడానికి సౌకర్యాలు, గ్యాస్ స్టేషన్లు మరియు విశ్రాంతి ప్రాంతాల వంటి కొత్త సేవలు అందించడానికి ప్రాజెక్టు ద్వారా కార్యక్రమాలు అమలు జరుగుతాయి.
2031 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ల వృద్ధిని కొనసాగించడంలో మరియు 2031 నాటికి 8464 మిలియన్ మెట్రిక్ టన్నుల లాజిస్టిక్స్ మార్కెట్ వృద్ధిని సాధించడంలో రైలు మౌలిక సదుపాయాలు కీలక పాత్ర వహిస్తాయని సమావేశం స్పష్టం చేసింది. అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో రవాణా రంగం అవసరాలు తీర్చడానికి 2031 నాటికి 35% సరుకులను రైలు మార్గం ద్వారా రవాణా చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దీనివల్ల రవాణా ఖర్చు తగ్గి, చమురు దిగుమతులు తగ్గుతాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని (i) ఎనర్జీ, మినరల్, సిమెంట్ కారిడార్లు, (ii) హై ట్రాఫిక్ డెన్సిటీ రూట్లు (iii) రైల్ సాగర్ కారిడార్లు (రేవులకు రవాణా సౌకర్యం ) మూడు ఆర్థిక కారిడార్లు అభివృద్ధి చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందించింది. . ఈ ప్రాజెక్ట్లు ఉపాధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి దోహదం చేస్తాయి. ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి సహకరిస్తాయి.
ఈ ప్రాజెక్టులు వివిధ రకాల రవాణా మార్గాలను ఏకీకృతం చేసి, గణనీయమైన సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను అందించి ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని ప్రత్యేక కార్యదర్శి పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ రూపకల్పనలో ప్రాంతీయ అభివృద్ధి అంశాన్ని పొందుపరచాలని, మౌలిక సదుపాయాల అవసరాలు గుర్తించడానికి, సమగ్ర ప్రణాళిక అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రిత్వ శాఖ లతో సహా స్థానిక అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆమె సూచించారు.
(Release ID: 1999616)