సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి సంగ్రహాలయం విశేషాలు
నాడు పోస్టు చేయడమైనది:
21 DEC 2023 3:14PM by PIB Hyderabad
ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని 2022 ఏప్రిల్ 14న ప్రధానమంత్రి ప్రారంభించారు. భారతదేశ ప్రధాన మంత్రులందరి జీవిత విశేషాలను ఇది వివరిస్తుంది. సమాజంలోని ప్రతి తరగతి, ప్రతి శ్రేణి నాయకులకు దేశ నిర్మాణంలో సహకరించడానికి మన ప్రజాస్వామ్యం ఎలా అవకాశాన్ని అందించిందో చూపిస్తుంది. ప్రధాన మంత్రి సంగ్రహాలయం రెండు భవనాల్లో విస్తరించిన కొత్త డిజిటల్ మ్యూజియం. భవనం-1లో పాత తీన్ మూర్తి భవనం, శ్రీ జవహర్లాల్ నెహ్రూ గ్యాలరీ, రాజ్యాంగ గ్యాలరీలు, తోషఖానా, శ్రీ జవహర్లాల్ నెహ్రూ ప్రైవేట్ విభాగం ఉన్నాయి. భవనం-2లో శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నుంచి డా.మన్మోహన్ సింగ్ వరకు అందరు ప్రధాన మంత్రులు తీసుకొచ్చిన సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కరణలు, వారి వ్యక్తిగత జీవిత విశేషాలు ఉంటాయి.
ప్రధానమంత్రి సంగ్రహాలయంలో, సందర్శకులు మమేకమయ్యే ‘అనుభూతి’ అనే జోన్ ఉంది. ఇక్కడ, సందర్శకులు 'ప్రధానమంత్రితో సెల్ఫీ', 'ప్రధానితో నడవడం', 'ప్రధానమంత్రి నుంచి లేఖ అందుకోవడం' వంటివాటితో పాటు దేశ నిర్మాణం, సాంకేతిక అద్భుతాలను ప్రదర్శించే వర్చువల్ హెలికాప్టర్ విహారాన్ని ఎంచుకోవచ్చు. తాము కోరుకునే ప్రధానమంత్రిని సందర్శకులు ఇక్కడ ఎంచుకోవచ్చు. అలాగే, విజన్ 2047 అభిప్రాయాల గోడ మీద తమ సందేశాన్ని రాయవచ్చు. 'యూనిటీ చైన్'లో, ఒక సమూహంలోని పెద్ద గోడపై తమ ఉనికిని నమోదు చేయవచ్చు. సంగ్రహాలయాన్ని ప్రజలు సాఫీగా సందర్శించేందుకు గోల్ఫ్ వాహనాలు, చక్రాల కుర్చీలు, మార్గదర్శకాలు/శ్రవణ మార్గదర్శకాలు, ఫలహారశాల, సావనీర్ దుకాణం కూడా ఉన్నాయి.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 1989256)
సందర్శకుల సూచీ సంఖ్య : : 117