రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత్‌-కజకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసాలు కజింద్‌-2023లో పాల్గొనేందుకు బయలుదేరిన భారత సైన్యం, వైమానిక దళ బృందం

Posted On: 29 OCT 2023 10:14AM by PIB Hyderabad

7వ దఫా ‘ఎక్సర్‌సైజ్ కజింద్‌-2023’లో పాల్గొనేందుకు 120 మందితో కూడిన భారత సైన్యం, వైమానిక దళ బృందం ఈ రోజు కజకిస్తాన్‌ బయలుదేరింది. కజకిస్తాన్‌లోని ఒటార్‌లో ఈ నెల 30 నుంచి నవంబర్ 11 వరకు విన్యాసాలు జరుగుతాయి.

డోగ్రా రెజిమెంట్‌కు చెందిన బెటాలియన్ నేతృత్వంలోని 90 మంది సిబ్బంది భారత సైన్యం తరపున పాల్గొంటున్నారు. కజకిస్తాన్‌ బృందంలో ప్రధానంగా 'కజఖ్ గ్రౌండ్ ఫోర్సెస్‌'కు చెందిన సిబ్బంది ఉంటారు. రెండు వైమానిక దళాలకు చెందిన తలో 30 మంది సిబ్బంది కూడా ప్రస్తుత విన్యాసాల్లో పాల్గొంటారు.

భారత్‌-కజకిస్తాన్ మధ్య ఉమ్మడి సైనిక విన్యాసాలను 2016లో 'ఎక్సర్‌సైజ్‌ ప్రబల్ దోస్తిక్' పేరిట ప్రారంభమయ్యాయి. రెండో దఫా కసరత్తుల తర్వాత వాటిని కంపెనీ స్థాయికి పెంచి, 'ఎక్సర్‌సైజ్ కజింద్‌'గా పేరు మార్చారు. ఈ సంవత్సరం వైమానిక దళాలను చేర్చడం ద్వారా ద్వివిద దళాల విన్యాసాలుగా స్థాయిని మరింత పెంచారు.

ప్రస్తుత విన్యాసాల్లో భాగంగా, ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను ఇరుపక్షాలు సాధన చేస్తాయి. దాడులు నిర్వహించడం, తనిఖీలు చేయడం, ధ్వంసం చేయడం, చిన్న బృందాలతో ఆపరేషన్లు వంటి వ్యూహాత్మక కసరత్తులను సంయుక్తంగా అమలు చేస్తారు. మానవరహిత వైమానిక కార్యకలాపాలు కూడా ఈ విన్యాసాల్లో భాగం అవుతాయి.

ఐక్యరాజ్యసమితి పరిధిలో కలిసి పని చేసేటప్పుడు అవలంబించాల్సిన వ్యూహాలు, యుద్ధ కసరత్తులు, పరస్పర విధానాలపై అవగాహన పెంచుకోవడానికి ఇరుపక్షాలకు ఒక అవకాశాన్ని ‘ఎక్సర్‌సైజ్ కజింద్‌-2023’ అందిస్తుంది. ఉమ్మడి విన్యాసాల ద్వారా సెమీ-అర్బన్, పట్టణ ప్రాంతాల్లో కలిసి సైనిక కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాలు, సమన్వయం కూడా పెరుగుతుంది.

రెండు పక్షాలు పోరాట నైపుణ్యాలపై కసరత్తు చేయడానికి, పరస్పరం నేర్చుకోవడానికి, అభిప్రాయాలను మార్చుకోవడానికి, ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి కూడా అవకాశం వస్తుంది. ‘ఎక్సర్‌సైజ్ కజింద్‌-2023’ రెండు సైన్యాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. 

***



(Release ID: 1973012) Visitor Counter : 60