మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన హైదరాబాద్‌లో మత్స్య.. ఆక్వా పరిశ్రమ రౌండ్‌టేబుల్‌ సమావేశం


సంయుక్తంగా నిర్వహించిన ఇన్వెస్ట్ ఇండియా.. నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ సంయుక్తంగా నిర్వహించే పరిశ్రమల పరస్పర చర్యల ద్వారా మద్దతిచ్చే మత్స్యశాఖ యొక్క ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్;

ఇన్వెస్ట్‌ ఇండియా/నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుల మద్దతుతో పరిశ్రమల మధ్య పరస్పర చర్చలు నిర్వహించిన మత్స్యశాఖ ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ సెల్;

విలువ శ్రేణిలోని ఉత్పాదక/తయారీ ప్రక్రియలో భాగస్వాములైన ప్రముఖ కంపెనీలు.. పరిశ్రమ సంఘాల ప్రతినిధులు పరస్పర చర్చలకు హాజరు

Posted On: 16 AUG 2023 8:06PM by PIB Hyderabad

   ప్రపంచ ఆహార భద్రత, పోషకాహారం, జీవనోపాధి కల్పనలో మత్స్య, ఆక్వాకల్చర్ రంగాలు అందిస్తున్నట్లు తోడ్పాటుకు నేడు గుర్తింపు లభిస్తోంది. కాగా, భారత మత్స్య రంగం దశాబ్దాలుగా ఉత్పత్తి/ఎగుమతులలో ఇతోధిక వృద్ధిని సాధించింది. విలువ శ్రేణిలోని భాగస్వాముల ప్రశంసనీయమైన కృషిని ఇందుకు కారణంగా పేర్కొనవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రంగంలోగల అపార అవకాశాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి, ఈ కీలక రంగం సమగ్ర వృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా మత్స్య, ఆక్వా రంగాల పరివర్తనాత్మక వృద్ధికి కేంద్ర మత్స్య శాఖ విశేషంగా కృషి చేస్తోంది, ఆ మేరకు వ్యాపార సౌలభ్య వాతావరణ సృష్టిసహా వ్యవస్థాపన మెరుగుకు ప్రోత్సాహం అందిస్తోంది.

   ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నిర్దేశం మేరకు మత్స్యశాఖసహా సంబంధిత ఇతర మంత్రిత్వశాఖలు/విభాగాల్లో ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌ (పిడిసి) ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో పెట్టుబడులను వేగిరపరచడం, అందుకు అనువైన ప్రాజెక్టులకు రూపకల్పన, సమస్యల పరిష్కారం, పెట్టబడిదారులకు/సంస్థలకు చేయూత వంటి కార్యకలాపాలను ‘పిడిసి’ నిర్వహిస్తుంది. ఈ బాధ్యతల నిర్వహణలో ఇన్వెస్ట్‌ ఇండియాలోని ప్రత్యేక బృందం కూడా సహకరిస్తుంది.

   ఈ మేరకు ‘పిడిసి’, ఇన్వెస్ట్‌ ఇండియా సభ్యులు దేశంలోని విలువ శ్రేణిలోగల వివిధ భాగస్వాములతో మమేకం అవుతున్నారు. తద్వారా ఆయా కంపెనీల నిర్దిష్ట పెట్టుబడి ప్రణాళికలు, సమస్యలు వగైరాలపై అవగాహన పెంచుకుంటున్నారు. తద్వారా ఈ రంగం వృద్ధికిగల సవాళ్ల పరిష్కారంతోపాటు చేపల పెంపకందారుల ఆదాయం రెట్టింపు చేయడం, ఉపాధి సృష్టి, ఎగుమతుల పెంపు వంటి అంశాలను విస్తృతస్థాయిలో చక్కదిద్దడానికి కృషి చేస్తారు.

   ఈ కార్యకలాపాలకు అనుగుణంగా నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌ఎఫ్‌డిబి), ఇన్వెస్ట్ ఇండియా సంయుక్తంగా ఇవాళ హైదరాబాద్‌లోని ‘ఎన్‌ఎఫ్‌డిబి’, మత్స్య-పశుసంవర్ధక-పాడి పరిశ్రమ శాఖ  సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన ఈ రంగంలోని కేంద్రీకృత పరిశ్రమ ప్రతినిధులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించాయి. విలువ శ్రేణిలో భాగస్వామ్యంగల పరిశ్రమ సంఘాలు,  స్వయంప్రతిపత్తిగల సంస్థలతోపాటు, ఉత్పత్తి-తయారీలోగల ప్రముఖ కంపెనీలు ఈ పరస్పర  చర్చల్లో పాల్గొన్నాయి. ఇందులో భాగంగా భాగస్వామ్య కంపెనీల భవిష్యత్‌ ప్రణాళికలు, పరిశ్రమల ప్రత్యేక సమస్యలు, మద్దతుగల రంగాల గురించి చర్చించారు.

   ఈ సమావేశం ప్రాముఖ్యాన్ని ‘ఎన్‌ఎఫ్‌డిబి’ ముఖ్య కార్యనిర్వహణాధికారి ముందుగా వివరించారు. అంతేకాకుండా మత్స్య, ఆక్వా రంగాల్లు ఉత్పాదకత పెంచేదిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సామర్థ్య వికాస కార్యక్రమాలు-కార్యకలాపాలుసహా నీలి విప్లవం, ఎఫ్‌ఐడిఎఫ్‌, పిఎంఎంఎస్‌వై వంటి పథకాలను ప్రవేశపెట్టడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దేశీయ, ఎగుమతి మార్కెట్ల కోసం ఆక్వా ఉత్పత్తుల నాణ్యత, పరిమాణం, వైవిధ్యానికి భరోసా ఇవ్వడంలో నిర్దిష్ట ఉత్పత్తుల ప్రాముఖ్యాన్ని మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి తన కీలకోపన్యాసంలో ఉద్ఘాటించారు. మత్స్య, ఆక్వా రంగంలో వ్యవస్థీకృత మార్కెట్‌  సృష్టికి “వేట నుంచి వాడకందారు” దాకా భాగస్వామ్య సమూహాలతో కూడిన బలమైన ప్రాసెసింగ్ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

   ఈ సమావేశంలో పాల్గొన్న కంపెనీ ప్రతినిధులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ మేరకు మత్స్య విలువ శ్రేణిలో మెరుగుదల, చేపల ఉనికి గుర్తింపు, ఎగుమతి మార్కెట్ల బలోపేతం, దేశీయ వినియోగం పెంపు వ్యూహాలు తదితరాలపై తమ సూచనలను అందజేశారు. మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి తన తుదిపలుకుల సందర్భంగా-  వ్యాపార, పరిశ్రమల సంఘాలు సూచనలు, సలహాలు అందజేయడంతోపాటు మత్స్య, ఆక్వా రంగాల్లో పెట్టుబడి మార్గాలను విశదీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

*****



(Release ID: 1949770) Visitor Counter : 131


Read this release in: English , Urdu , Hindi