హోం మంత్రిత్వ శాఖ
ఎన్డీఆర్ఎఫ్ ద్వారా పెను విపత్తుల నిర్వహణ
Posted On:
09 AUG 2023 5:32PM by PIB Hyderabad
'జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందం' (ఎన్డీఆర్ఎఫ్) బలగాలను విదేశాలకు సాయంగా పంపిన వివరాలు:
-
2011 మార్చిలో ఒకేసారి మూడు విపత్తులు (భూకంపం, సునామీ, అణు విద్యుత్ ప్లాంటు నుంచి రేడియేషన్ లీకేజీ) ఎదుర్కొన్న జపాన్కు సాయంగా, 'ఇండియా రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ మిషన్' కింద, 46 మంది సిబ్బంది & సహాయ పరికరాలతో ఉన్న ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని భారత ప్రభుత్వం పంపింది.
-
2014 మార్చిలో, భూటాన్లోని గోంగ్రీ నదిలో పడవ బోల్తా పడి ఐదుగురు భూటాన్ జాతీయులు గల్లంతైన ఘటనకు సంబంధించి, 42 మంది సిబ్బంది & సహాయ పరికరాలతో ఉన్న ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని భూటాన్కు భారత ప్రభుత్వం పంపింది.
-
2015 ఏప్రిల్లో, 8.1 తీవ్రతతో వచ్చిన భూకంపంతో అల్లాడిన నేపాల్లో మానవత సాయం అందించడానికి డాగ్ స్క్వాడ్, సహాయ పరికరాలు, 700 మంది సిబ్బందితో ఉన్న 16 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆ దేశానికి పంపడం జరిగింది.
-
2023 ఫిబ్రవరిలో, తుర్కియేలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత, మానవత సాయం అందించడానికి డాగ్ స్క్వాడ్, సహాయ పరికరాలు, 152 మంది సిబ్బందితో ఉన్న మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడికి పంపడం జరిగింది.
ఎన్డీఆర్ఎఫ్ను మరింత బలోపేతం చేసేందుకు, మరో నాలుగు బెటాలియన్లను పెంచడానికి భారత ప్రభుత్వం ఆమోదించింది. దీనివల్ల ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ల సంఖ్యను 12 నుంచి 16కు చేరింది. విపత్తులు లేదా ప్రమాదకర పరిస్థితుల సమయంలో తక్షణం స్పందించేలా, వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ బెటాలియన్లు మోహరించి ఉంటాయి.
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సామర్థ్యం పెంచడానికి, నిరంతరం ఆధునీకరించడానికి, సంపూర్ణ శిక్షణ అందించడానికి ఎన్డీఆర్ఎఫ్ అకాడమీని 2018లో నాగ్పూర్లో స్థాపించారు. అంతేకాదు, ఎన్డీఆర్ఎఫ్ పటిష్టతను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది, సమీక్షిస్తుంది. దేశంలో సంభవించే అనూహ్య విపత్తుల దృష్ట్యా ఈ కింది కార్యక్రమాలు జరుగుతున్నాయి:
(i) ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు, ప్రాంతీయ ప్రతిస్పందన కేంద్రాలు, ఎన్డీఆర్ఎఫ్ అకాడమీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం, 2021-22 నుంచి 2025-26 వరకు, రూ.949.81 కోట్ల వ్యయంతో “ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్” అనే సమగ్ర పథకాన్ని ప్రారంభించడం జరిగింది.
(ii) వివిధ మానవ ప్రేరేపిత, ప్రకృతి విపత్తు పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్లో అత్యాధునిక పరికరాలు ఉన్నాయి.
(iii) ఎన్డీఆర్ఎఫ్తో పాటు వివిధ వాటాదార్ల సామర్థ్యం పెంచేలా, పాఠశాలల్లో భద్రత వంటి ప్రజా సన్నద్ధతను పెంచే కార్యక్రమాలు చేపడుతున్నారు.
(iv) అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలను పరిచయం చేసేందుకు అంతర్జాతీయ కార్యశాలలు/క్షేత్ర స్థాయి విన్యాసాలను ఎన్డీఆర్ఎఫ్ ద్వారా చేపట్టడం జరుగుతోంది. శిక్షణ కోర్సులు/సెమినార్లు/కార్యశాలలు/విన్యాసాలు సహా వివిధ అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపడం జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి, విపత్తు నిర్వహణలో అత్యుత్తమ పద్ధతులను నేర్చుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా అవలంబిస్తున్న అధునాతన పరికరాలు & సాంకేతికతల గురించి తెలుసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.
(v) అవసరమైనప్పుడు అధునాతన పరికరాలు, యంత్రాల కొనుగోలుకు ఆమోదం తెలపడం ద్వారా బలగాల సామర్థ్యాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్కి అన్ని విధాలా మద్దతుగా నిలుస్తోంది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.
*****
(Release ID: 1947357)