నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో స్థాపిత పవన విద్యుత్‌ శక్తి సామర్థ్యం 43.7 గిగావాట్లు, ఇది 2029-30 నాటికి 99.9 గిగావాట్లకు పెరిగే అవకాశం

Posted On: 01 AUG 2023 5:53PM by PIB Hyderabad

ఈ ఏడాది జూన్ 30 నాటికి, దేశంలో స్థాపిత పవన విద్యుత్‌ శక్తి సామర్థ్యం 43,773 గిగావాట్లు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, దేశంలో పవన శక్తి ద్వారా ఉత్పత్తయిన విద్యుత్ పరిమాణం 71,814 మిలియన్ యూనిట్లు. ఆ ఆర్థిక సంవత్సరంలో పవన విద్యుత్‌ ఉత్పత్తి చేసిన ప్రధాన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ.

కాప్‌26లో ప్రధాన మంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా, 2030 నాటికి శిలాజ రహిత వనరుల నుంచి 500 గిగావాట్లు స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడానికి కేంద్ర నూతన & పునరుత్పాదక విద్యుత్‌ శక్తి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది.  ఇందులో పవన విద్యుత్‌ సామర్థ్యం కూడా కలిసి ఉంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇచ్చిన 'రిపోర్ట్‌ ఆన్‌ ఆప్టిమల్ జనరేషన్ కెపాసిటీ మిక్స్‌ ఫర్‌  2029-30 వెర్షన్‌ 2.0' ప్రకారం, 2029-30 చివరి నాటికి పవన విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం 99,895 గిగావాట్లుగా అంచనా వేశారు.

కేంద్ర విద్యుత్, నూతన & పునరుత్పాదక విద్యుత్‌ శక్తి శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ఆర్.కె.సింగ్, ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని తెలిపారు.

 

***


(Release ID: 1944853)
Read this release in: English , Urdu