వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రైతు ఉత్పత్తిదార్ల సంస్థలు ఏర్పాటు

Posted On: 25 JUL 2023 5:09PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం, "10,000 రైతు ఉత్పత్తిదార్ల సంస్థల (ఎఫ్‌పీవోలు) ఏర్పాటు & ప్రోత్సాహం" కోసం 2020లో ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని బడ్జెట్‌ వ్యయం రూ.6865 కోట్లు. బేరమాడే శక్తిని రైతుల్లో పెంపొందించడానికి, ఆర్థిక స్థితి పెంచడానికి, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా, స్థిరమైన ఆదాయాల దిశగా రైతులను నడిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు, ఎఫ్‌పీవోలో ఒక్కో రైతు సభ్యుడికి రూ.2,000 వరకు మ్యాచింగ్ ఈక్విటీ గ్రాంట్‌ను, మొత్తం రూ.15 లక్షల పరిమితి దాటకుండా ప్రతి ఎఫ్‌పీఓకు అందించడం జరిగింది. ఎఫ్‌పీవోలకు రుణాలు అందేలా, అర్హత కలిగిన రుణ సంస్థ నుంచి ఒక్కో ఎఫ్‌పీవోకు రూ.2 కోట్ల వరకు ప్రాజెక్టు రుణ  భరోసా సౌకర్యం కూడా అందించడం జరిగింది. దీంతోపాటు, ప్రతి ఎఫ్‌పీవోకు ఐదు సంవత్సరాల వరకు మద్దతునిచ్చేలా CBBOలకు రూ.25 లక్షలు ఇవ్వడం జరిగింది.

రైతులను సమీకరించే ప్రయత్నాలను ఏకీకృతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, దాని యంత్రాంగం ప్రాముఖ్యతను, వ్యూహాత్మక పాత్ర చాలా కీలకం. దీనిని దృష్టిలో ఉంచుకుని, వివిధ ఉత్పత్తి & ఉత్పత్తి తర్వాతి సేవలను అందిస్తూ, ఎఫ్‌పీవోల అభివృద్ధి & పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, 10,000 రైతు ఉత్పత్తిదార్ల సంస్థల పథకం కోసం నిబంధనలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిలో భాగంగా ఎస్‌ఎల్‌సీసీ పేరిట రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేసింది. అదనపు ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి, వ్యవసాయ/వ్యవసాయ మార్కెటింగ్ ఇన్‌ఛార్జ్‌ ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఉంటారు.

పైన చెప్పిన వాటితో పాటు, 10,000 ఎఫ్‌పీవోల పథకం కింద, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్/సీఈవో/ జిల్లా పరిషత్ అధ్యక్షతన జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ (డీ-ఎంసీ) ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధిత విభాగాల ప్రతినిధులు, నిపుణులు అందులో ఉంటారు. ఈ కమిటీ, ఒక బ్లాక్‌లోని ఉత్పత్తి క్లస్టర్లకు ఆమోదం అందిస్తుంది & జిల్లా స్థాయిలో పథకం సమన్వయం, పర్యవేక్షణ, అమలుకు బాధ్యత వహిస్తుంది. భారత ప్రభుత్వ పథకాలలో కూడా కేటాయింపులు చేయబడ్డాయి.
 ఇది బ్లాక్‌లోని సంభావ్య ఉత్పత్తి క్లస్టర్‌లకు ఆమోదం అందిస్తుంది మరియు మొత్తం జిల్లా స్థాయిలో సమన్వయం మరియు అమలు పర్యవేక్షణకు బాధ్యత వహిస్తుంది. ఎఫ్‌పీవోలు భారత ప్రభుత్వ పథకాల ద్వారా కూడా ప్రయోజనం పొందేలా నిబంధనలు రూపొందించడం జరిగింది.

ఈ ఏడాది జూన్ 30 నాటికి, వివిధ అమలు సంస్థలకు (ఏఐలు) 10,000 ఎఫ్‌పీవోలను కేటాయించడం జరిగింది. వాటిలో 6,319 ఎఫ్‌పీవోలు దేశవ్యాప్తంగా నమోదు చేసుకున్నాయి.

      ఎఫ్‌పీవోలు వ్యాపార లావాదేవీలు ప్రారంభించాయి, అవి చేపట్టే పని వివరాలు ఇవి:

  1. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటివి సరఫరా
  2. మార్కెటింగ్/అమ్మకం కోసం రైతు సభ్యుల వ్యవసాయ ఉత్పత్తులను ఒకచోటికి చేర్చడం
  3. సభ్యుల కోసం అవసరాలకు అనుగుణంగా యంత్రాలు, సామగ్రిని అందుబాటులో ఉంచడం
  4. వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధి చేయడం, పరీక్షించడం, క్రమబద్ధీకరించడం, గ్రేడింగ్, చేయడం, ప్రాసెసింగ్ చేయడం వంటి విలువ జోడింపులు చేపట్టడం

 

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.

 

***** 



(Release ID: 1942632) Visitor Counter : 138


Read this release in: English , Urdu