జల శక్తి మంత్రిత్వ శాఖ
బహిరంగ ప్రదేశాల్లోని తాగునీటి వనరులు కలుషితం కాకుండా రక్షించడం
Posted On:
24 JUL 2023 6:24PM by PIB Hyderabad
తాగునీటి సరఫరా అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. గ్రామీణ జనాభాకు సురక్షిత మంచినీటి సరఫరాను మెరుగుపరచడం కోసం, కేంద్ర ప్రాయోజిత పథకం జల్ జీవన్ మిషన్ ద్వారా సాంకేతికత & ఆర్థిక సాయం అందించడం ద్వారా రాష్ట్రాల ప్రయత్నాలకు భారత ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
జల్ జీవన్ మిషన్ కింద వివిధ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు అందాయి. అవి, సంబంధిత వాటాదార్లు, గ్రామ పంచాయితీలు, దాని ఉప-కమిటీలు అంటే వీడబ్ల్యూసీఎస్/ పానీ సమితి/వినియోగదార్ల సంఘం మొదలైనవాటికి నీటి నాణ్యత శిక్షణ తీసుకోవడం; నీటి నాణ్యత సమస్యలు, నీటి వల్ల కలిగే వ్యాధులు, ఆరోగ్య ప్రభావంపై అవగాహన కల్పించడం; 'నాణ్యత లేని నీటి వినియోగాన్ని తప్పనిసరిగా నివారించడం'పై ప్రవర్తన మార్పు సమాచారం; పోషకాహారంలో నాణ్యమైన తాగునీటి ప్రాముఖ్యతపై ప్రతి వ్యక్తికి సమాచారం; కలుషిత నీటిని తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, పారిశుద్ధ్య తనిఖీ ప్రాముఖ్యత, ప్రైవేట్ నీటి నాణ్యత వనరులను పరీక్షించే ప్రక్రియపై దృశ్య, శ్రవణ మార్గాల ద్వారా ప్రచారం.
కేటాయించిన నిధుల్లో 2% వరకు, నీటి నాణ్యత పర్యవేక్షణ & నిఘా (డబ్ల్యూక్యూఎం&ఎస్) కార్యక్రమాల కోసం రాష్ట్రాలు ఉపయోగించవచ్చు. ఇందులో, వివిధ స్థాయుల్లో నీటి నాణ్యత ప్రయోగశాలలను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న వాటిని ఆధునీకరించడం, ప్రయోగశాలలకు అవసరమైన రసాయనాలు & వినియోగ వస్తువులను అందించడం వంటివి ఉంటాయి.
నీటి నాణ్యత పరీక్షించడానికి ప్రతి గ్రామంలో ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, వీడబ్ల్యూఎస్సీ సభ్యులు, ఉపాధ్యాయులు మొదలైన ఐదుగురు వ్యక్తులను గుర్తించి శిక్షణ ఇవ్వాలని ప్రతి రాష్ట్రం/యూటీని అభ్యర్థించడం జరిగింది. గ్రామ స్థాయిలో తగిన సంఖ్యలో ఎఫ్టీకేలు/బ్యాక్టీరియాలజికల్ వైల్స్ను అందుబాటులో ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. రాష్ట్రాలు/యుటీల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, 21.07.2023 నాటికి, ఎఫ్టీకేలను ఉపయోగించి నీటి నాణ్యత పరీక్ష చేసేలా 22.42 లక్షల మందికి పైగా మహిళలు శిక్షణ పొందారు. ఇప్పటివరకు, 167.20 లక్షలకు పైగా నమూనాలను ఎఫ్టీకేల ద్వారా పరీక్షించారు.
నీటి కాలుష్యాన్ని నివారించడం & నియంత్రించడం, నీటి సంపూర్ణతను నిర్వహించడం లేదా పునరుద్ధరించడం కోసం జల (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టాన్ని 1974లో తీసుకొచ్చారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ), నీటి వనరుల కాలుష్యాన్ని అడ్డుకోవడానికి పరిశ్రమల వ్యర్థాలను నిర్వీర్యం చేసే ప్రమాణాలను నిర్దేశించింది. పర్యావరణ పరిరక్షణ నియమాలు-1986 కింద ఆ నియమాలను నిర్దేశించింది.
జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని తెలిపారు.
*****
(Release ID: 1942397)
Visitor Counter : 103