ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెయిల్-భిలాయ్ ఉక్కు కర్మాగారానికి చెందిన దల్లి గనుల్లో 'సిలికా రిడక్షన్ ప్లాంటును ప్రారంభించనున్న ఉక్కు శాఖ మంత్రి


బ్లాస్ట్ ఫర్నేస్ ఉత్పాదకత పెంచడం, సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం సిలికా రిడక్షన్ ప్లాంట్ ఏర్పాటు ఉద్దేశం

Posted On: 22 JUN 2023 4:26PM by PIB Hyderabad

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, 23 జూన్ 2023న, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్‌) భిలాయ్ ఉక్కు కర్మాగారానికి చెందిన దల్లి గనుల్లో సిలికా రిడక్షన్ ప్లాంటును ప్రారంభించనున్నారు. న్యూదిల్లీ నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఈ ప్లాంటును ప్రారంభిస్తారు.

సెయిల్-భిలాయ్ ఉక్కు కర్మాగారానికి చెందిన 60 ఏళ్ల నాటి దల్లి గనుల్లో, రాఝార గ్రూప్‌నకు చెందిన గనుల్లో ఇనుప ఖనిజం నిల్వలు వేగంగా క్షీణిస్తున్నాయి. బ్లాస్ట్ ఫర్నేస్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే నాణ్యమైన ఇనుప ఖనిజం కావాలి. ఇందుకోసం 1 మి.మీ. కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ఇనుప ఖనిజాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధ్యయనం వెల్లడించింది. ₹149 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటు చేసిన సిలికా రిడక్షన్ ప్లాంటును, దల్లిలో ప్రస్తుతం ఉన్న క్రషింగ్, స్క్రీనింగ్, వాషింగ్ (సీఎస్‌డబ్ల్యూ) వెట్ ప్లాంట్‌తో అనుసంధానిస్తారు. ఈ ప్లాంట్‌లో అత్యాధునిక శుద్ధి పరికరాలు ఉన్నాయి. భిలాయ్ స్టీల్ ప్లాంటుకు సరఫరా చేసే ఇనుప ఖనిజం నాణ్యతను మెరుగుపరచడం, తద్వారా బ్లాస్ట్ ఫర్నేస్‌ వార్షిక ఉత్పాదకతను పెంచడం, బొగ్గు వినియోగం & కర్బన ఉద్గారాలను తగ్గించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

భారతీయ ఉక్కు పరిశ్రమలో కర్బన ఉద్గారాల నిర్మూలనను ప్రోత్సహించడం, హరిత ఉక్కు ఉత్పత్తి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడంపై ఉక్కు మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. సున్నా కర్బన ఉద్గారాల జాతీయ లక్ష్యానికి అనుగుణంగా సెయిల్‌ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దల్లి-రాఝార గనుల్లో సిలికా రిడక్షన్ ప్లాంటును ఏర్పాటు చేసింది.

వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తయింది.

 

*****


(Release ID: 1934689)
Read this release in: English , Urdu , Hindi