రక్షణ మంత్రిత్వ శాఖ
తీవ్ర తుపాను ‘బిపోర్జాయ్’ సహాయక చర్యల్లో భాగంగా గుజరాత్లోని ఓఖా వద్ద 50 మందిని రక్షించిన భారత తీర రక్షక దళం
Posted On:
13 JUN 2023 5:12PM by PIB Hyderabad
తీవ్రమైన తుపాను బిపోర్జాయ్ సహాయక చర్యల్లో భాగంగా, చక్కటి సమన్వయం & వేగంతో, భారత తీర రక్షక దళం (ఐసీజీ) 13 జూన్ 2023న గుజరాత్లోని ఓఖా వద్ద 50 మందిని కాపాడింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్), 12 జూన్ 2023న, గుజరాత్లోని ఓఖాకు పశ్చిమాన 25 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న 'కీ సింగపూర్/01' చమురు క్షేత్రంలో ఉన్న 50 మంది సిబ్బందిని తరలించాల్సిందిగా భారత తీర రక్షక దళాన్ని అభ్యర్థించింది.
అభ్యర్థనను స్వీకరించిన ఐసీజీ, కఠినమైన వాతావరణం, ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సముద్ర అలల మధ్యే చమురు క్షేత్రంలోని మొత్తం 50 మంది సిబ్బందిని సురక్షితంగా తరలించడానికి ఆపరేషన్ ప్రారంభించింది. ఐసీజీ నౌక షూర్ వెంటనే సహాయక చర్యల కోసం సముద్రంలోకి వెళ్లింది. ఐసీజీ హెలికాప్టర్ (సీజీ 858) కూడా రాజ్కోట్ నుంచి ఓఖా వరకు వెళ్లింది.
అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆపరేషన్లో, ఐసీజీ 12 జూన్ 2023 సాయంత్రం నాటికి 26 మంది సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించింది. 13 జూన్ 2023న, ఉదయాన్నే తిరిగి పని ప్రారంభించింది. మిగిలిన 24 మంది సిబ్బందిని కూడా సురక్షితంగా తరలించింది. దీంతో, మొత్తం 50 మంది ఉద్యోగులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.
06 జూన్ 2023 నుంచి అరేబియా సముద్రంలో 'బిపోర్జాయ్' (అత్యంత తీవ్ర తుపాను) ఏర్పడుతున్నట్లు గుర్తించారు. ఐసీజీ, సముద్రంలో ముందస్తు సహాయక చర్యలను ప్రారంభించింది.
***
(Release ID: 1932054)
Visitor Counter : 126