వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌-ఈయూ టీటీసీ మంత్రుల స్థాయి సమావేశం సందర్భంగా డోంబ్రోవ్‌స్కిస్‌తో పీయూష్‌ గోయల్ సమావేశం

Posted On: 16 MAY 2023 1:01PM by PIB Hyderabad

భారత్‌-యూరోపియన్ యూనియన్ 'ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్' (టీటీసీ) మొదటి మంత్రిత్వ స్థాయి సమావేశం సందర్భంగా, భారత వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, యురోపియన్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌ వాల్డిస్ డోంబ్రోవ్‌స్కిస్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. వాణిజ్య సంబంధిత వ్యవహారాలకు యూరోపియన్ కమిషన్‌ తరపున వాల్డిస్ డోంబ్రోవ్‌స్కిస్‌ బాధ్యత వహిస్తారు. ఇరు పక్షాల ఉన్నతాధికారులు కూడా ఈ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.

రెండు పక్షాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని ఈ చర్చల సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యం, నియమ ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థల పట్ల ప్రకటించిన నిబద్ధతకు అనుగుణంగా, ఇరు వర్గాల అనుబంధాన్ని మరింత బలోపేతం చేసేలా కలిసి పని చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎఫ్‌టీఏ చర్చలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించారు. ఇరువైపుల ఆర్థిక వ్యవస్థలకు, ఉపాధికి దన్నుగా నిలిచే సమతుల్య & అర్థవంతమైన ఫలితాల కోసం, మార్కెట్‌ అనుమతులు సహా సున్నితమైన అంశాలను పరిశీలించి, ఆయా సమస్యలకు ఉమ్మడి పరిష్కారాలను కనుగొనడం ద్వారా చర్చలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

వివాద పరిష్కార యంత్రాంగాలు, వ్యవసాయం & మత్స్య పరిశ్రమలకు రాయితీలు, ఈ-కామర్స్ మారటోరియంలు, దేశీయ చట్టాలకు సంబంధించిన అంశాలు సహా డబ్ల్యూటీవో సంస్కరణల విషయంలో ఉమ్మడి ప్రాధాన్యతలపై కలిసి పనిచేయాలన్న నిబద్ధతను ఇరువర్గాలు స్పష్టంగా వెల్లడించాయి. భారతదేశం సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కోట్లాది ప్రజల జీవనోపాధికి, ఆహార భద్రతకు మద్దతుగా నిలిచే ఏకాభిప్రాయ ఆధారిత పరిష్కారాలను కొనసాగించేందుకు ఉమ్మడి లక్ష్యాలను రూపొందించుకోవాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు గుర్తించాయి. ఈ ఉమ్మడి ప్రయత్నాలు రాబోయే డబ్ల్యుటీవో మంత్రుల సమావేశంలో అర్ధవంతమైన పరిష్కారాలకు దారి చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశం తర్వాత, పీయూష్‌ గోయల్‌, డోంబ్రోవ్‌స్కిస్‌ సహ-అధ్యక్షతన వర్కింగ్ గ్రూప్-3 సమావేశం జరిగింది. భారత్‌, యూరోపియన్‌ యూనియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వాటాదార్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడి, స్థితిస్థాపక సరఫరా గొలుసులపై వర్కింగ్ గ్రూప్-3 దృష్టి పెడుతుంది. బిజినెస్ యూరోప్, డిజిటల్ యూరోప్, ఫుడ్ డ్రింక్స్ యూరప్, కోపా-కోగేకా, ఈఎఫ్‌పీఐఏ, ఈసీఈఏ వంటి యూరోపియన్ పారిశ్రామిక రంగాల ప్రతినిధులు యూరప్‌ వైపు నుంచి పాల్గొన్నారు. వ్యక్తిగతంగా సమావేశానికి హాజరైన భారతీయ వ్యాపార ప్రముఖులు రసాయనాలు, లోహాలు, వస్త్రాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఉక్కు స్టీల్‌ సహా వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహించారు. వ్యవసాయ-ఆహార పరిశ్రమ, సముద్రం, రవాణా వంటి ఇతర రంగాల ప్రతినిధులు వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

***


(Release ID: 1924506)
Read this release in: English , Urdu , Hindi , Tamil