గనుల మంత్రిత్వ శాఖ
అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ నుంచి వ్యూహాత్మక ఖనిజాలను సేకరించేందుకు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కాబిల్) ప్రయత్నాలు
Posted On:
26 DEC 2022 5:45PM by PIB Hyderabad
లిథియం వెలికితీత కోసం ప్రాజెక్టులను ఏర్పాటు లక్ష్యంతో, గుర్తించిన రెండు ప్రాంతాల్లో తవ్వకాలు జరపడం కోసం అర్జెంటీనాకు చెందిన కేమైన్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కాబిల్) ఇటీవల ఆసక్తిని వ్యక్తం చేసింది. నిర్ణీత కాల పరిమితిలో ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. అర్జెంటీనాలో లిథియం, ఇతర ఖనిజాలను అన్వేషించడానికి అర్జెంటీనాకు చెందిన ప్రభుత్వ సంస్థలు జేఈఎంఎస్ఈ, కేమైన్, వైపీఎఫ్తో 2020 జులై-సెప్టెంబర్లో కాబిల్ మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఈ సంవత్సరం అక్టోబర్లో, అర్జెంటీనాలోని కాటమార్కాలో ఉన్న లా అగ్వాడా, ఎల్ ఇండియోలోని రెండు లిథియం ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని బ్యూనస్ ఎయిర్స్లోని భారత రాయబార కార్యాలయం ద్వారా కేమైన్ పంపింది. చిలీలోనూ ఉమ్మడి లిథియం మైనింగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు కాబిల్ ప్రయత్నాలు చేస్తోంది.
ఆస్ట్రేలియా పరిశ్రమలు, విజ్ఞానం & వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన క్రిటికల్ మినరల్ ఆఫీస్తో (సీఎంవో) వివరణాత్మక సహకార విధివిధానాలతో కూడిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) మీద 2022 మార్చిలో కాబిల్ సంతకం చేసింది.
ఆస్ట్రేలియాకు చెందిన లి & కో మినరల్ అసెట్స్లో ఉమ్మడి పెట్టుబడుల కోసం ఈ ఒప్పందం జరిగింది.
ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కాబిల్) పేరిట నాల్కో, హెచ్సీఎల్, ఎంఈసీఎల్ కలిసి 2019లో ఒక ఉమ్మడి ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. విదేశాల్లో లిథియం, కోబాల్ట్ వంటి వ్యూహాత్మక ఖనిజాలను తవ్వి, సేకరించడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం.
****
(Release ID: 1886785)
Visitor Counter : 204
Read this release in:
Urdu