రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మలబార్-22 నౌకాదళ విన్యాసాలు

Posted On: 16 NOV 2022 3:01PM by PIB Hyderabad

బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు 'మలబార్‌-22' నవంబర్‌ 15, 2022న జపాన్ సముద్రంలో ముగిసింది. ఇది 26వ దఫా కార్యక్రమంతో పాటు 30వ వార్షికోత్సవం. ఈ విన్యాసాలకు జేఎంఎస్‌డీఎఫ్‌ అతిథ్యం ఇచ్చింది.

తూర్పు నౌకదళ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ రియర్ అడ్మిరల్ సంజయ్ భల్లా నేతృత్వంలో తూర్పు నౌకాదళానికి చెందిన శివాలిక్, కమోర్త నౌకలు భారత నావికాదళానికి ప్రాతినిధ్యం వహించాయి. భారత్‌, అమెరికా నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక విన్యాసాల రూపంలో మలబార్ పరంపర 1992లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, జపాన్‌ కూడా ఈ బృందంలో చేరడంతో విన్యాసాలకు మరింత ప్రాముఖ్యత వచ్చింది.

మలబార్-22 సముద్ర దశ విన్యాసాలు యోకోసుకా సమీపంలో ఐదు రోజుల పాటు జరిగాయి. ఆయుధ కాల్పులు, ఉపరితల, విమాన విధ్యంసక, జలాంతర్గామి విధ్యంసక యుద్ధ విన్యాసాలు, వ్యూహాత్మక విధానాలను ప్రదర్శించారు. 'సముద్రంపై యుద్ధం' కసరత్తు నిర్వహించడం సముద్ర దశలోని మరొక ముఖ్యాంశం. దీనివల్ల నాలుగు నౌకాదళాల సహకార చర్యలను ఏకతాటిపైకి తేవడానికి, వ్యూహాత్మక నైపుణ్యాలను మెరుగు పరచడానికి వీలవుతుంది.

అణు శక్తితో నడిచే విమాన వాహక నౌకతో పాటు పదకొండు ఉపరితల నౌకలు 'అధిక తీవ్రత' విన్యాసాల్లో పాల్గొన్నాయి. నాలుగు సుదూర సముద్ర గస్తీ విమానాలు, సమగ్ర హెలికాప్టర్లు, రెండు జలాంతర్గాములు కూడా వీటితో కలిశాయి. వివిధ నౌకల మధ్య 'సీ రైడర్స్' మార్పిడి కూడా జరిగింది.

కసరత్తులు, విన్యాసాలతో పాటు, బృంద దేశాల మధ్య ద్వైపాక్షిక రవాణా మద్దతు ఒప్పందాలను ఈ కార్యక్రమం ధృవీకరించింది.

ఒక దేశ కార్యాచరణ విధానాల మీద మరొక దేశం అవగాహన పెంచుకోవడానికి, సముద్ర సంబంధిత సవాళ్లను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి మలబార్-22 సహాయపడింది.


***



(Release ID: 1876626) Visitor Counter : 208


Read this release in: English , Urdu , Hindi