మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎన్.ఆర్.ఐ. పెళ్లిళ్లపై అవగాహనకు పంజాబ్లో పలు కార్యక్రమాలు.. ఎన్.సి.డబ్ల్యు. ఆధ్వర్యంలో నిర్వహణ..
ఎన్.ఆర్.ఐ. వివాహాల్లో తలెత్తే ఇబ్బందులపై
సమాచారాన్ని పంచుకోవడం,..
ముందుజాగ్రత్తలు, అందుబాటులోని
న్యాయపరిష్కారాలపై
బాధితులకు అవగాహన కల్పించడమే లక్ష్యాలు
Posted On:
11 JUL 2022 4:42PM by PIB Hyderabad
‘ప్రవాస భారతీయుల (ఎన్.ఆర్.ఐ.ల) వివాహాల తీరుపై, ఎదురయ్యే ఇబ్బందులపై అవగాహనా కార్యక్రమాలు: చేయవలసిన పనులు, చేయకూడనివి, మన ముందున్న మార్గం’ అనే అంశంపై పంజాబ్లోని వివిధ జిల్లాల్లో అనేక కార్యక్రమాలను జాతీయ మహిళా కమిషన్ (ఎన్.సి.డబ్ల్యు) ప్రారంభించింది. ప్రవాస భారతీయులతో జరిగే వివాహాల్లో ఎదురయ్యే ముప్పు గురించి సమాచారాన్ని తెలియజెప్పేందుకు, వాటిని నిరోధించగలగే ముందుజాగ్రత్త చర్యలు, బాధితులకు అందుబాటులో ఉన్న న్యాయ పరిష్కారాల గురించి తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఎన్.సి.డబ్ల్యు. చైర్పర్సన్ రేఖా శర్మ, పంజాబ్ రాష్ట్ర ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్, పంజాబ్ విశ్వవిద్యాలయం వైస్చాన్సిలర్ ప్రొఫెసర్ అరవింద్, ఎన్.సి.డబ్ల్యు సభ్య కార్యదర్శి మీతా రాజీవ్ లోచన్ ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.
పంజాబ్ విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విభాగం సహకారంతో ఈ అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్.జి.పి.సి), పంజాబ్ రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థ, గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం, పంచాయతీలు, పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానిక పోలీసుల సహాయంతో ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
ఎన్.ఆర్.ఐ. వివాహాల్లో బాధితులైన వారికి వారి హక్కుల గురించి తెలియజెప్పేందుకు, భారతీయ న్యాయవ్యవస్థ పరిధిలో అందుబాటులో ఉన్న సహాయం పొందడంలో బాధిత మహిళలు ఎదురవుతున్న సవాళ్లను గురించి చర్చించేందుకు, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన తగిన పరిష్కారాలు కనుగొనడం లక్ష్యాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. బాధిత మహిళలకు సహాయం అదించేందుకు వివిధ అధికార యంత్రాగాలు నిర్వర్తించే పాత్రపై కార్యక్రమంలో పాల్గొనే వారికి అవగాహన కల్పించేందుకు ప్రముఖ న్యాయ నిపుణులు, పరిపాలనా, విద్యారంగ నిపుణులను కూడా ఎన్.సి.డబ్ల్యు. ఆహ్వానించింది.
ఈ సందర్భంగా ఎన్.సి.డబ్ల్యు చైర్పర్సన్ రేఖా శర్మ మాట్లాడుతూ, ప్రత్యేకించి విద్యారంగంలో బాలికలకు బాలురతో సమాన అవకాశాలు కల్పించవలసిన అవసరం చాలా ఉందని అన్నారు. అప్పుడే బాలికలు సాధికారత సాధించి, సమాజంలో స్వతంత్రంగా నిలదొక్కుకోగలరని అన్నారు. “కుటుంబాలు, సమాజాలు తమ ఆలోచనా ధోరణిని, భావాలను మార్చుకున్నపుడే ఈ అవగాహనా కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. మీ కుమార్తెకు వివాహం చేసే ముందుగా అన్ని విషయాలు సక్రమంగా చూసుకోండి. ఈ విషయంలో పూర్తి అవగాహనతో ఉండండి. ఈ దురాచారాన్ని నిర్మూలించడం మనందరి సమష్టి బాధ్యత. ఇందుకు సంబంధించి అవగాహన కల్పించేందుకు ఎన్.సి.డబ్ల్యు. చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. మాతో చేదోడుగా పనిచేయవలసిందిగా కోరుతున్నాం.” అని రేఖాశర్మ అన్నారు.
ఈ అవగాహనా కార్యక్రమాలన్నింటినీ సాంకేతికంగా నాలుగు సమావేశ విభాగాలుగా విభజించారు. ‘ఎన్.ఆర్.ఐ. వివాహాల్లో నష్టపోయిన మహిళలకు సహాయం అందించడంలో న్యాయశాఖ సహాయం’ అనే అంశంపై మొదటి సమావేశం నిర్వహించారు. ‘పోలీసుల పాత్ర’పై రెండవ సమావేశం, ‘న్యాయ వ్యవస్థ యంత్రాంగం పాత్ర’పై మూడవ సమావేశం నిర్వహించారు. ‘ఎన్.ఆర్.ఐ. వివాహాల్లో సామాజిక అంశాల పాత్ర’పై నాలుగవ సమావేశం నిర్వహించారు.
***
(Release ID: 1840839)
Visitor Counter : 115