సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కాకినాడ ఉప్పాడ మండలం అమీనాబాద్‌లో రూ.422 కోట్లతో కేంద్ర నిధులతో ఫిషింగ్ హార్బర్‌: డాక్టర్‌ మురుగన్‌


ఎగుమతులలో వృద్ధికి అధిక సంభావ్యత కలిగిన ప్రధాన రంగాలలో మత్స్య పరిశ్రమ ఒకటి: కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మత్స్యకారుల జీవన స్థితిగతులను మార్చే లక్ష్యంతో ఉంది: మురుగన్

Posted On: 14 JUN 2022 7:53PM by PIB Hyderabad

విజయవాడ,

జూన్ 14, 2022.

కాకినాడలోని ఉప్పాడ మండలం అమీనాబాద్‌లో రూ. 422 కోట్లతో కేంద్ర నిధులతో నిర్మిస్తున్న కొత్త ఫిషింగ్ హార్బర్ సరైన మార్గంలో సాగుతోందని కేంద్ర మత్స్య, పశుసంవర్థక & పాడిపరిశ్రమ, సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ ఎల్‌. మురుగన్‌ తెలిపారు. పనులు వేగవంతం చేయాలని అధికారులు. మంత్రి మంగళవారం ఫిషింగ్ హార్బర్‌ను తనతో పాటు అధికారులతో సందర్శించి పురోగతిని పరిశీలించారు.

కాకినాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి, మత్స్య పరిశ్రమ ప్రధాన రంగాలలో ఒకటని, ఎగుమతుల్లో వృద్ధికి అధిక అవకాశం ఉందని, దేశంలో సముద్ర ఆధారిత ఉత్పాదకతను విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని సహకారాన్ని అందిస్తోందని అన్నారు. దేశంలోనే సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని, చేపల పరిశ్రమ, ఎగుమతుల అభివృద్ధికి కేంద్రంతో పాటు రాష్ట్రం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మత్స్యకార కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చేలా గరిష్టంగా ఉపయోగించుకోగల కేంద్రం యొక్క ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY)పై ఆయన ఉద్ఘాటించారు.

ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ కేంద్ర పథకాల అమలుపై జిల్లా అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి, నిరుపేదలకు చేరువయ్యేలా పకడ్బందీగా అమలు జరిగేలా పర్యవేక్షించాలని అధికారులను కోరారు.

అంతకముందు, ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’ సందర్భంగా మంగళవారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ... యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి నిరుపేదలను ఆదుకునేందుకు, ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఏడాదికి మూడుసార్లు రక్తదానం చేయవచ్చని అన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా దేశానికి ఎనలేని సేవలందిస్తున్నదని మంత్రి కొనియాడారు. రక్తదానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పలువురి ప్రాణాలను కాపాడేలా ప్రోత్సహిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం స్వచ్ఛంద రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోస్టర్‌ను ఆవిష్కరించారు. గతంలో పలుమార్లు రక్తదానం చేసిన జిల్లాలోని రక్తదాతలను ఈ సందర్భంగా మంత్రి సత్కరించారు.

అనంతరం కాకినాడలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ‘మిషన్ అమృత్ సరోవర్’ కింద పునరుద్ధరించిన కృష్ణంరాజు చెరువును డాక్టర్ మురుగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 75 ఏళ్ల ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా చెరువులు, సరస్సులను విజయవంతంగా పునరుద్ధరిస్తున్నామన్నారు. MGNRES లబ్ధిదారులతో మాట్లాడిన మంత్రి పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు, చెరువు గట్టున మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాకినాడలోని పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామంలో, ప్రధానమంత్రి సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ యొక్క తొమ్మిది శాస్త్రీయ మిషన్లలో ఒకటైన ‘వేస్ట్ టు వెల్త్ మిషన్‌’ను డాక్టర్ మురుగన్ సందర్శించారు. మిషన్ అమలు తీరును పరిశీలించి తడి, పొడి చెత్తను సేకరించే మున్సిపల్ కార్మికులకు రిక్షాలను పంపిణీ చేశారు.

డాక్టర్ మురుగన్ కోనపాపపేటలోని హేచరీలను సందర్శించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. పర్యటన సందర్భంగా ఆయన మత్స్యకారులతో కలిసి మధ్యాన్నం భోజనం చేశారు.

పార్లమెంటు సభ్యురాలు (కాకినాడ) శ్రీమతి. వంగగీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా, హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఎఫ్‌డిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ సి.సువర్ణ, ఇతర జిల్లా అధికారులు మంత్రి వెంట ఉన్నారు.

 

***



(Release ID: 1834009) Visitor Counter : 123


Read this release in: English