శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా కర్బన వ్యర్ధ రహితంగా ఉండాలన్నది భారతదేశంలో తోలు పరిశ్రమ లక్ష్యమని పేర్కొన్న - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ఈరోజు చెన్నై లోని సి.ఎస్.ఐ.ఆర్- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వజ్రోత్సవ వేడుకల్లో ప్రసంగించిన - కేంద్ర మంత్రి

వినూత్నమైన మరియు మార్కెట్ స్నేహపూర్వక తోలు ఉత్పత్తులతో ముందుకు రావడానికి డి.ఎస్.టి. నుండి అంకుర సంస్థలకు ఆకర్షణీయమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్న - డాక్టర్ జితేంద్ర సింగ్

భారతీయుల పాదరక్షలను సిద్ధం చేయడం కోసం ఆ వ్యక్తి పాదాలు స్కాన్ చేయడానికి 3-డి. సాంకేతికతను ఉపయోగించడం ద్వారా వారికి ప్రత్యేకంగా పాదరక్షలను రూపొందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి; మొదటి దశలో ఈ ప్రాజెక్టు అమలు కోసం దేశవ్యాప్తంగా 73 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది

ఆవిష్కరణలు, తదుపరి తరం సాంకేతికతలు మరియు బ్రాండ్ బిల్డింగ్ ప్రపంచ మార్కెట్‌లో కొత్త సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవడానికి రాబోయే 25 సంవత్సరాల పాటు సి.ఎల్.ఆర్.ఐ. తన ప్రయాణాన్ని నిర్ధారించుకోవాలి : డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 19 MAY 2022 4:57PM by PIB Hyderabad

పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా కర్బన వ్యర్ధ రహితంగా ఉండాలన్నది  భారతదేశంలో తోలు పరిశ్రమ లక్ష్యమని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ (ఇంచార్జ్) సహాయ మంత్రి, భూ విజ్ఞాన శాస్త్ర శాఖ (ఇంచార్జ్) సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి, కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 

ఈరోజు చెన్నైలోని సి.ఎస్.ఐ.ఆర్.-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, తోలు ప్రాసెసింగ్ కార్యకలాపాలలో కర్బన కాలుష్యం సున్నా స్థాయికి చేరుకోవాలనీ, జంతువుల చర్మం నుంచి తయారయ్యే ఉత్పత్తుల జీవ-ఆర్థిక వ్యవస్థ అనేది ప్రస్తుత సమయంలో కొత్త మంత్రమనీ, అన్నారు.  తమిళనాడు వంటి ప్రాంతాల్లో తోలు వస్తువుల రంగ సామర్థ్య అభివృద్ధి అవసరాల దృష్ట్యా పర్యావరణ ప్రమాణంగా "జీరో-లిక్విడ్-డిశ్చార్జ్‌" ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయని, ఏ విషయం పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ఆయన చెప్పారు. 

కొత్త ఆవిష్కరణలు, తదుపరి తరం సాంకేతికతల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తపన గురించి, డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావిస్తూ,  వజ్రోత్సవాల నుంచి శతాబ్ది ఉత్సవాల వరకు ప్రయాణంలో సి.ఎస్.ఐ.ఆర్.-సి.ఎల్.ఆర్.ఐ. కి తోలు రంగం స్థిరత్వం ఒక కొత్త సవాలుగా ఉద్భవించే అవకాశం ఉందని పేర్కొన్నారు.  రాబోయే 25 సంవత్సరాల్లో తోలు పరిశోధన, పరిశ్రమల కోసం కొత్త దృష్టి నిలకడ, కర్బన వ్యర్ధాలు లేకుండా చూడడం, తోలు ఆధారిత పదార్థాల మొత్తం పునర్వినియోగం పొందడం, జంతువుల చర్మం నుంచి తయారయ్యే ఉత్పత్తుల జీవ-ఆర్థిక వ్యవస్థ, బ్రాండ్ ను వృద్ధి చేసుకోవడంతో పాటు కార్మికులకు సమానమైన ఆదాయాన్ని సమకూర్చడంపై కూడా భరోసా కల్పించవలసి ఉంటుందని ఆయన అన్నారు.

వినూత్నమైన, మార్కెట్ అనుకూలమైన తోళ్ళ ఉత్పత్తులతో ముందుకు రావడానికి అంకుర సంస్థలకు డి.ఎస్.టి. నుంచి ఆకర్షణీయమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని, డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు.   భారతీయుల పాదరక్షలను తయారు చేసేందుకు 3డి టెక్నాలజీని ఉపయోగించి వారి పాదాలను స్కాన్ చేయడం ద్వారా వారి కోసం ప్రత్యేకంగా పాదరక్షలను రూపొందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.  దేశంలోని 73 జిల్లాల్లో మొదటి దశలో ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు ఎంపిక చేయడం జరిగిందని కూడా ఆయన తెలియజేశారు.

పాదాల పరిశుభ్రత, ధరించేవారి సౌకర్యాలతో పాద సంరక్షణ పరిష్కారాలుగా తోలు పాదరక్షలను రూపొందించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు.  పాదాల్లో చెమట పట్టే ప్రక్రియకు ఉపయోగపడే దాదాపు అర మిలియన్ కణాలు ఉన్నాయని, శరీరంలో నుంచి నీరు విడుదల కావడానికి చర్మానికి సాటిలేని సామర్థ్యం ఉంటుందని ఆయన చెప్పారు.  అరికాలి పాదాల పీడనం యొక్క అసాధారణ పంపిణీలో తగ్గింపు కారణంగా మెరుగైన జీవన నాణ్యతను నిర్ధారించే అటువంటి ఉత్పత్తిలో "డయాబెటిక్ పాదరక్షలు" ఒకటి అని మంత్రి తెలియజేశారు. 

మానవ ఆరోగ్య సంరక్షణకు ఉపయోగించే తోలు ఆధారిత వినూత్న జీవ సంబంధమైన వస్తువులు మరిన్ని కొత్త అవకాశాలు కల్పిస్తామని, అదేవిధంగా, తరువాతి తరం తోలు-తయారీ సాంకేతికతలు సున్నం, సల్ఫైడ్ తో పాటు అనేక ఇతర సున్నితమైన రసాయనాలతో చర్మ-ఆధారిత మాతృక పదార్థాలను కలుషితం చేయకుండా నివారించినట్లయితే. తోలు ఉత్పత్తులకు ఉప-ఉత్పత్తులుగా మారే అవకాశం  కూడా ఉందని, మంత్రి తెలియజేశారు.  నాలెడ్జ్ డొమైన్‌లో గేమ్ ఛేంజర్‌గా ఉద్భవించే అవకాశంతో పాటు, భవిష్యత్తులో కొత్త భారతదేశానికి తోళ్ల పరిశ్రమ రంగాన్ని మరింత ముఖ్యమైనదిగా మార్చే అవకాశం కూడా సి.ఎల్‌.ఆర్‌.ఐ. కి ఉందని ఆయన పేర్కొన్నారు. 

1947లో భారత తోళ్ళ పరిశ్రమ రంగం దాదాపు 50,000 మందికి మాత్రమే జీవనోపాధి అవకాశాలను కల్పించిందని,   అయితే, ప్రస్తుతం, దేశంలో 45 లక్షల మందికి పైగా ప్రజల జీవనోపాధికి తోళ్ళ పరిశ్రమ రంగం దోహదపడుతోందన్న విషయం అందరికీ తెలిసిందేనని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.   2021లో తోళ్ళ పరిశ్రమ రంగం నుంచి 40,000 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరిగినందుకు, ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అకాడమీ-పరిశోధన-పరిశ్రమల మధ్య విశిష్ట భాగస్వామ్యానికి కేంద్ర బిందువుగా సి.ఎస్.ఐ.ఆర్-సి.ఎల్.ఆర్.ఐ. పోషించిన పాత్ర ఈ సందర్భంగా స్మరించుకోదగినదని మంత్రి పేర్కొన్నారు.  దీనితో పాటు, భారతీయ తోళ్ళ పరిశ్రమ రంగం సామాజిక సమానత్వానికి స్పష్టమైన, గుర్తించదగిన సహకారాన్ని అందించింది.  అదేవిధంగా, పాదరక్షల పరిశ్రమలో సాంకేతికత వినియోగం మహిళా సాధికారతకు గణనీయంగా దోహదపడిందని శాస్త్రీయంగా రుజువయ్యింది.  1950 సంవత్సరం నుంచి తోళ్ళ పరిశ్రమ ద్వారా వెలువడుతున్న మహిళా సాధికారత యొక్క సామాజిక ప్రయోజనాలు ప్రశంసనీయమని మంత్రి ఉద్ఘాటించారు.

1948 ఏప్రిల్, 24వ తేదీన శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ సి.ఎల్.ఆర్.ఐ. కి శంకుస్థాపన చేసిన విషయాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేస్తూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మొదటి సంవత్సరం లోపలే స్థాపించడం జరిగిందని చెప్పారు.   ఆ విధంగా సంస్థ వజ్రోత్సవం, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వ వార్షికోత్సవం ఒకే సారి జరుపుకుంటున్నామని ఆయన అన్నారు.  ఈ విధంగా, దేశాభివృద్ధి తో సమానంగా నడుస్తున్న జాతీయ ప్రయోగశాలలు చాలా తక్కువగా ఉన్నాయని, ఆయన అన్నారు.

తమిళనాడు లో 1996 సంవత్సరంలో  తోళ్లను శుద్ధి చేసే దాదాపు 400 గోదాములను మూసివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పుడు, తొమ్మిది నెలల్లో మొత్తం 764 తోళ్ళ శుద్ధి కర్మాగారాలలో  "డూ ఎకాలజీ" - పర్యావరణ పరిష్కారాల వంటి వినూత్న విధానాలు అవలంబించడం ద్వారా, వాటి కార్యకలాపాలను పునరుద్ధరించి, తోళ్ల శుద్ధి రంగానికి సహాయం చేయడంలో సి.ఎల్.ఆర్.ఐ. నిర్వహించిన అద్భుతమైన పాత్రను మంత్రి ప్రశంసించారు.  దేశంలో ప్రభుత్వ నిధులతో జరిగిన పరిశోధనలకు ఇది ఒక మైలురాయిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.  భారతదేశంలో తోలు రంగం అభివృద్ధిలో అంతర్భాగమైన సి.ఎల్.ఆర్.ఐ. అనేక రకాలుగా సహాయ సహకారాలను అందించింది. 

1948 సంవత్సరం నుంచి చెన్నైలోని సి.ఎల్.ఆర్.ఐ. పరిణామ క్రమం గురించి, డాక్టర్ జితేంద్ర సింగ్ వివరిస్తూ,  మొదటి 25 సంవత్సరాలలో, సాంకేతికతలు అందుబాటులో లేని వారికి వాటిని చేరవేయడం తో పాటు ఈ రంగం ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ని సులభతరం చేయడం పై సంస్థ దృష్టి సారించగా,  తదుపరి 25 సంవత్సరాల్లో, భారతీయ తోలు పరిశోధన, పరిశ్రమ ఆధునికీకరణ, పర్యావరణ సంసిద్ధతను పెంపొందించడంపై దృష్టి సారించినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు.  కాగా, గత 25 సంవత్సరాలుగా అంతర్జాతీయ మార్కెట్‌ లో తోలు వస్తువుల విలువ పెంచడానికి వినియోగించుకోవడంపై దృష్టి పెట్టడం జరిగింది.  వచ్చే 25 సంవత్సరాల్లో, తోలు పరిశోధన, పరిశ్రమల కోసం నూతన దృక్పధంతో ఆవిష్కరణ, బ్రాండ్ బిల్డింగ్ ద్వారా ప్రపంచ మార్కెట్‌లో కొత్త సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవలసి ఉంటుంది. 

<><><>



(Release ID: 1826804) Visitor Counter : 99


Read this release in: English , Urdu , Hindi , Tamil