రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

అత్యాధునిక, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దు ప్రాంతాల్లో వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి సామర్థ్యాన్ని పెంచుకోండి: 63వ రైజింగ్ డే సందర్భంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కు రక్షణమంత్రి పిలుపు


మారుతున్న కాలానికి అనుగుణంగా సన్నద్ధంగా ఉండేందుకు నిరంతరంగా సరిహద్దు ప్రాంత అభివృద్ధి మా రక్షణ వ్యూహంలో భాగం: రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్

Posted On: 07 MAY 2022 12:58PM by PIB Hyderabad

సాంకేతికతను సరైన రీతిలో ఉపయోగించడం ద్వారా సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని మరియు సరిహద్దు ప్రాంతాల మౌలిక సదుపాయాలను వేగంగా బలోపేతం చేయడానికి కృషి చేయాలని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)కు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్  పిలుపునిచ్చారు. బీఆర్ఓ  యొక్క 63వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 07, 2022న న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఓ యొక్క అన్ని శ్రేణులను ఉద్దేశించి రాజ్నాథ్సింగ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో  రక్షణశాఖ సహాయమంత్రి అజయ్ భట్, ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, రక్షణశాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్స్ (డీజీబీఆర్) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి మరియు బీఆర్ఓ ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఓ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ..  “ఈ మధ్య కాలంలో ఉత్తర సెక్టార్‌లో చైనా ఉనికి పెరిగింది. పర్వత ప్రాంతాల్లో నిర్మాణంలో వారి నైపుణ్యం కారణంగా, వారు చాలా త్వరగా వివిధ ప్రాంతాలకు చేరుకోగలుగుతారు. ఈ పరిస్థితికి దీటుగా బీఆర్ఓ  పనిచేయాలి.  సాంకేతికతను పూర్తిగా ఉపయోగించడం ద్వారా సామర్థ్యాన్ని పెంచుకోవడంపై బీఆర్ఓ దృష్టి పెట్టాలి” అన్నారు. ఈ విషయంలో  బీఆర్ఓకి అవసరమైన సహాయసహకారాలను అందించడానికి ప్రభుత్వం తన వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తోందని  రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.

2022–-23 ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఓ మూలధన బడ్జెట్‌ను 40% పెంచి రూ. 3,500 కోట్లకు పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయాన్ని  రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు, దేశ భద్రత మరియు సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. కేవలం బడ్జెట్ పెంచడం మాత్రమే కాకుండా, ఈ ప్రయత్నంలో సాధ్యమైన అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ బీఆర్ఓకి హామీ ఇచ్చారు.

సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ సమగ్ర రక్షణ వ్యూహంలో ప్రధాన భాగమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఇది దేశ భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేస్తుందని మరియు మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువస్తుందని అన్నారు. రక్షణ వ్యూహంలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలక భాగమని ఆయన పేర్కొన్నారు. “సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎంత శక్తివంతం అవుతారో, ఆ ప్రాంతాల భద్రత గురించి వారు మరింత అవగాహన మరియు ఆందోళన కలిగి ఉంటారు. పౌరులు దేశం యొక్క గొప్ప శక్తి. కాబట్టి, మారుతున్న కాలానికి అనుగుణంగా, మన సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి మేము ముందుకు వెళ్లడానికి కట్టుబడి ఉన్నాము. మా భద్రత కోసం 24 గంటలూ పని చేసే వారికి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం మా మొదటి ప్రాధాన్యత,” అని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.

బీఆర్ఓ తాను ప్రాజెక్టులు చేపట్టే ప్రాంతాల్లోనే కాకుండా..  మొత్తం దేశానికి భద్రత మరియు శ్రేయస్సు యొక్క కొత్త తలుపులు తెరిచిందంటూ ప్రశంసించారు. బీఆర్ఓ కేవలం నిర్మాణ సంస్థ మాత్రమే కాదని, ఐక్యత, క్రమశిక్షణ, అంకితభావం మరియు విధి పట్ల అంకితభావానికి ఉజ్వల ఉదాహరణ అని ఆయన అభివర్ణించారు.
దేశ ప్రగతిలో రోడ్లు, వంతెనలు మరియు సొరంగాల ప్రాముఖ్యతను మంత్రి రాజ్నాథ్ సింగ్ నొక్కి చెబుతూ... బీఆర్ఓ పూర్తి చేసిన ప్రాజెక్టులు సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతను మెరుగుపరిచాయని మరియు సుదూర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచాయని అన్నారు. "సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ ఊహించిన విధంగా బలమైన, సురక్షితమైన మరియు స్వావలంబనతో కూడిన 'న్యూ ఇండియా'ను నిర్మించేందుకు ప్రభుత్వం యొక్క తిరుగులేని నిబద్ధతకు సూచిక" అని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

సరిహద్దు ప్రాంతాలు కొత్త అభివృద్ధి కేంద్రాలుగా ఆవిర్భవించాయని..  ఈశాన్య ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా దేశ సర్వతోముఖాభివృద్ధికి గేట్‌వేగా మారాయని రాజ్నాథ్ సింగ్ నొక్కి చెప్పారు. ఈశాన్య ప్రాంతం భారతదేశాన్ని దక్షిణాసియా మరియు ఆగ్నేయాసియా దేశాలతో  కలుపుతున్నందున.. అంతర్జాతీయ స్థాయిలో దేశం యొక్క పురోగతికి ఈ ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.

75 కేఫ్‌లు మరియు టూరిజం పోర్టల్ (https://marvels.bro.gov.in) ద్వారా సుదూర ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించినందుకు కూడా బీఆర్ఓను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మెచ్చుకున్నారు.  ఈ కార్యక్రమాలు నిరంతరంగా పెరుగుతున్న సంస్థ ఎదుగుదలకు ప్రతీకగా ఆయన అభివర్ణించారు.

ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కోల్‌కతా నగరాలను కలుపుతూ, దేశమంతటా పెద్ద సంఖ్యలో ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన పునాదిని అందించిన స్వర్ణ చతుర్భుజికి పునాది వేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని  రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. దేశంలో కనెక్టివిటీని పెంపొందించే ఈ దృక్పథం ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ రూపొందించిన ‘పీఎం గతి శక్తి- నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ-మోడల్ కనెక్టివిటీ’లో ప్రతిబింబిస్తుందని మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఇది దేశ సమగ్రాభివృద్ధికి మాస్టర్‌ స్ట్రోక్‌ ప్రణాళికగా నిలుస్తుందని ఆయన అంచనా వేశారు.

డీజీబీఆర్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి మాట్లాడుతూ... నూతన శక్తి మరియు అంకితభావంతో శ్రేష్ఠత మార్గంలో కొనసాగించాలని బీఆర్ఓ సిబ్బందికి ఉద్బోధించారు. కొన్ని క్లిష్టమైన సొరంగాలు మరియు ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణ ప్రాజెక్టులను త్వరలో ముగించాంటూ ఆయన వారిని ప్రోత్సహించారు.

బీఆర్ఓ సిబ్బంది కోసం ఢిల్లీలోని తోడాపూర్లో  నిర్మించనున్న వివాహిత వసతి సముదాయానికి ఈ సందర్భంగా.. రక్షణ రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్శంకుస్థాపన చేశారు. ఈ కాంప్లెక్స్‌లో 323 క్వార్టర్‌లు, సిబ్బంది కోసం అనుబంధ మౌలిక సదుపాయాలు ఉంటాయి.

భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (బీఐఎస్ఏజీన్) అభివృద్ధి చేసిన .. బీఆర్ఓ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మరియు బీఆర్ఓ బడ్జెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ అనే రెండు సాఫ్ట్వేర్లను  కూడా రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. -  -ఈ సాఫ్ట్‌వేర్‌లు వనరుల పంపిణీ మరియు వినియోగాన్ని అలాగే బీఆర్ఓ యొక్క బడ్జెట్‌ను ఆటోమేట్ చేస్తాయి.

బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్63వ రైజింగ్ డే సందర్భంగా నిర్వహించిన 'బీఆర్ఓ@63 మల్టీ-డైమెన్షనల్ ఎక్స్‌పెడిషన్'కు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఫ్లాగ్ ఇన్ చేశారు.

ఆరుగురు మహిళలతో సహా అరవై-మూడు మంది బీఆర్ఓ సిబ్బంది 12-రోజుల యాత్రలో పాల్గొన్నారు. ఇందులో నాలుగు విభిన్న కార్యకలాపాలు ఉన్నాయి.  అంటే.. సుమారు 50 కిలోమీటర్ల దూరం.. 15,000 అడుగుల పంగర్చులా శిఖరానికి పర్వతారోహణ ; 35 కిలోమీటర్లు గంగా నదిలో రాపిడ్‌లో రాఫ్టింగ్; 591 కిలోమీటర్ల దూరంతో డెహ్రాడూన్ నుండి ఢిల్లీ వరకు సైక్లోథాన్  మరియు రూర్కీ నుండి ఢిల్లీ వరకు 190 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ నిర్వహించిన ఫిట్ బీఆర్ఓఎండ్యూరెన్స్ ఈ యాత్రలో భాగంగా ఉన్నాయి. ఇందులో పాల్గొన్న బృందాలు వివిధ ప్రజా సంబంధ కార్యక్రమాలను కూడా నిర్వహించాయి మరియు ప్రజలతో, ముఖ్యంగా యువతతో సంభాషించాయి. దేశ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చాయి. ఈ యాత్రను ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుండి ఏప్రిల్ 26, 2022న జెండా ఊపి ప్రారంభించారు.

 'బీఆర్ఓ@63-ఆల్ ఉమెన్ ఎలక్ట్రిక్ వెహికల్ ర్యాలీ'ని కూడా రక్షణమంత్రి రాజ్ నాథ్సింగ్ జెండా ఊపి ప్రారంభించారు.  10 మంది మహిళా అధికారులు మరియు బీఆర్ఓలోని అన్ని ర్యాంక్‌లతో కూడిన బృందం జాతీయ రాజధాని ప్రాంతం, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ మీదుగా దాదాపు 750 కిలోమీటర్లు ఎలక్ట్రిక్ కార్లపై ప్రయాణిస్తుంది. 2030 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలన్న ప్రధాన మంత్రి దార్శనికతకు అనుగుణంగా 'పర్యావరణ పరిరక్షణ మరియు వాతావరణ మార్పు'పై ప్రజలను చైతన్యం చేసేందుకు 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' స్మారకార్థం నిర్వహిస్తున్న కార్యక్రమాల శ్రేణిలో భాగంగా ఈ మొట్టమొదటి-రకం ఎలక్ట్రిక్ వాహన ర్యాలీ నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలోభాగంగానే రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్.. లడఖ్‌లోని ప్రాజెక్ట్ హిమాంక్ మరియు జమ్మూ కశ్మీర్‌లోని 13 బోర్డర్ రోడ్స్ టాస్క్‌ఫోర్స్ అధికారులను సత్కరించారు.

 తూర్పులో ప్రాజెక్ట్ టస్కర్ మరియు ఉత్తరాన ప్రాజెక్ట్ బెకన్ .. కేవలం రెండు ప్రాజెక్టులతో 1960లో ప్రారంభించబడిన  బీఆర్ఓ నేడు వివిధ రాష్ట్రాల్లో 18 ప్రాజెక్ట్‌లతో శక్తివంతమైన సంస్థగా మారింది. ఇది 60,000 కిలోమీటర్ల రోడ్లు, 840 పైగా వంతెనలు, నాలుగు సొరంగాలు మరియు 19 ఎయిర్‌ఫీల్డ్‌లను.. ప్రతికూల వాతావరణంలో, అత్యంత క్లిష్టమైన   భౌగోళిక భూభాగాలు కలిగిన ప్రాంతాల్లో నిర్మించింది.  భారతదేశ సరిహద్దులతో పాటు స్నేహపూర్వక సంబంధాలు నెరుపుతున్న దేశాల్లో కూడా బీఆర్ఓ నిర్మాణాలు చేపట్టింది.  తద్వారా మన వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు బీఆర్వో దోహదపడింది.

2021-–22లో.. మొత్తం 102 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, - 87 వంతెనలు మరియు 15 రోడ్లను బీఆర్ఓ పూర్తిచేసింది.   ఒకే సంవత్సరంలో బీఆర్ఓ పూర్తిచేసిన అత్యధిక ప్రాజెక్టులు ఇవే కావడం విశేషం. ఇందులో ప్రపంచంలోనే అతి పొడవైన హైవే టన్నెల్ , 10,000 అడుగుల కంటే పొడవైన అటల్ టన్నెల్తోపాటు  రోహ్‌తంగ్ మరియు తూర్పు లడఖ్‌లోని ఉమ్లింగ్ లా మీదుగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ రోడ్డు నిర్మాణం ఉన్నాయి. బీఆర్ఓ చరిత్రలో మొట్టమొదటిసారిగామహిళా అధికారులకు యూనిట్ల బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ప్రస్తుతం మూడు రోడ్డు నిర్మాణ సంస్థల (ఆర్సీసీలు)కు వారే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇది ఉత్తరాఖండ్‌లోని జోషిమత్‌లో మొట్టమొదటి ఆల్ ఉమెన్ ఆర్సీసీగా గుర్తింపు పొందింది. 

***



(Release ID: 1823788) Visitor Counter : 163


Read this release in: English , Urdu , Hindi , Tamil