ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రపంచ టిబి దినోత్సవం సందర్భంగా స్టెప్-అప్ టు ఎండ్ టిబి – వరల్డ్ టిబి డే సమ్మిట్ను ప్రారంభించనున్న డాక్టర్ మన్సుఖ్ మాండవియా
నాడు పోస్టు చేయడమైనది:
22 MAR 2022 6:30PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రపంచ టిబి దినోత్సవం (24 మార్చి 2022) సందర్భంగా స్టెప్ - అప్ టు ఎండ్ టిబి- వరల్డ్ టిబి డే సదస్సును కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభిస్తారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి. ఆనందీబెన్ పటేల్ వర్చువల్గా హాజరవుతారు. 2025 నాటికి TBని నిర్మూలించడానికి భారతదేశం యొక్క వేగవంతమైన ఆవిష్కరణలు మరియు విజయాలను వెలుగులోకి తీసుకొచ్చే చర్చలకు నేతృత్వం వహిస్తారు. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ కూడా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు.
2018, మార్చి నెలలో ఢిల్లీ వేదికగా జరిగిన టీబీ సదస్సుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. టీబీ సంబంధిత ఎస్డీజీ లక్ష్యాలను 2030 కంటే ఐదేళ్ల ముందే.. అంటే, 2025 నాటికే భారతదేశంలో టీబీని అంతమొందించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
మార్చి 24, 2022న నిర్వహిస్తున్న స్టెప్ అప్ టు ఎండ్ వరల్డ్ టీబీ డే సదస్సు.. 2018లో నిర్వహించిన సదస్సుకు కొసాగింపు మాత్రమే కాదు.. టీబీ నిర్మూలన ప్రయాణంలో భారతదేశం ఏస్థాయిలో పురోగమించిందో అంచనా వేయనుంది. అంతేకాకుండా టీబీ నిర్మూలన విషయంలో భారతదేశ చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తుంది. టీబీ నిర్మూలన లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన సరైన చర్యలను సమీకరించే ప్రయత్నం చేస్తుంది. జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం యొక్క విజయాలను, ప్రణాళికలను ఈ సదస్సు ద్వారా చాటడమే కాకుండా టీబీతోపాటు సంబంధిత అంటువ్యాధు నిర్మూలన కోసం ఓ వేదికను ఏర్పాటుచేయడానికి ఈ సదస్సు కల్పిస్తుందన్నారు. కోవిడ్ తదనంతర పరిణామాల నేపథ్యంలో టీబీ నిర్మూలన కోసం వ్యాక్సిన్ అభివృద్ధి నుంచి వివిధ విభాగాలు, మంత్రిత్వశాఖలు, రాష్ట్రాల సహకారంలో చేయాల్సిన మార్పులపై కూడా ఈ సదస్సులో చర్చిస్తారు.
టీబీ నిర్మూలనలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన, లక్ష్యాలను సాధించిన రాష్ట్రాలు మరియు జిల్లాలకు ఈ సదస్సులో కేంద్ర ఆరోగ్య మంత్రి అవార్డులను అందజేస్తారు. టీబీ నిర్మూలనలో తమ ప్రయాణాన్ని, వ్యాధిని అధిగమించేందుకు చేపట్టిన చర్యలను టీబీ సూపర్ వైజర్లు తమ అనుభవాలను ఈ సదస్సు ద్వారా మిగతావారితో పంచుకుంటారు.
ఈ సదస్సులోభాగంగా ఆయా రాష్ట్రాల మంత్రులతో నిర్వహించే సమావేశానికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నేతృత్వం వహిస్తారు. టీబీ నిర్మూలనలో రాష్ట్రాల అనుభవాలను పంచుకోవడంతోపాటు, రాష్ట్రాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు.. టీబీ నిర్మూలన చర్యలను మరింత తీవ్రతరం చేసేందుకు అవసరమైన సూచనలు సలహాలు ఇస్తారు. జాతీయ టీబీ వ్యాప్తి సర్వే ఫలితాల నుంచి గుర్తించిన అంశాలపై చర్చించడంతోపాటు టీబీ నిర్మూలనకు, ఎస్డీజీ లక్ష్యాలను చేరుకునేందుకు భారతదేశ కార్యచరణపైనా ఈ సదస్సులో చర్చిస్తారు. టీబీ నిర్మూలనలో భాగస్వామ్య సంస్థలు రూపొందించిన వివిధ కార్యక్రమాల ప్రదర్శన కూడా ఈ సదస్సులో ఉంటుంది. భారతదేశ భవిష్యత్తును టీబీ రహితంగా మార్చేందుకు.. భాగస్వామ్య సంస్థలు రూపొందించిన ప్రణాళికలను సదస్సుకు హాజరైన వారికి అందజేస్తారు.
టీబీ నిర్మూలన కార్యక్రమాల అమలు కోసం మంత్రిత్వశాఖలు, రాష్ట్రాల నుంచి కమిటీలను ఎంపిక చేస్తారు. ఈ కమిటీల ద్వారా ప్రజల్లో టీబీపై అవగాహన పెంచేందుకు, చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు.. చివరి వ్యక్తివరకు ఈ సమాచారం చేరవేసేందుకు ఈ సదస్సు నాయకత్వాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, అట్టడుగుస్థాయి నాయకులకు లక్ష్యాలను నిర్దేశిస్తుంది.
రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య మంత్రులు, రాష్ట్ర ఆరోగ్య విభాగాల అధికారులు, భారతదేశంలో టిబి నిర్మూలన సమస్యపై పనిచేస్తున్న ఇతర కీలక భాగస్వాములు హాజరవుతారు.
***
(రిలీజ్ ఐడి: 1808533)
సందర్శకుల సూచీ సంఖ్య : : 208