ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయి నీటి కనెక్షన్ను అందించడానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. పంజాబ్లో జల్ జీవన్ మిషన్ అమలును వేగవంతం చేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి 402.24 కోట్లను విడుదల చేసింది. జల్ జీవన్ మిషన్ అమలు కోసం 2021–-22కుగానూ రాష్ట్రానికి రూ.1,656.39 కోట్ల కేంద్ర నిధులను కేటాయించారు. 2020–-21 నిధులతో పోలిస్తే ఇవి దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ.
పంజాబ్ రాష్ట్రంలో 34.41 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉన్నాయి. వీటిలో 31.55 లక్షల గ్రామీణ కుటుంబాలకు (91.68శాతం) కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయి. 2021–-22లో రాష్ట్రం 8.69 లక్షల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
జల్ జీవన్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. దీనికోసం బడ్జెట్ కేటాయింపులు రూ. 2021–-22లో 92,309 కోట్లు, కాగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 23,022 కోట్లు. ఇక 2021–-22లో పంజాబ్ గ్రామీణ స్థానిక సంస్థలు/పంచాయతీ రాజ్ సంస్థలకు నీరు & పారిశుధ్యం కోసం 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్గా రూ.616 కోట్లు కేటాయించింది. గ్రామీణ, స్థానిక సంస్థలకు వచ్చే ఐదేళ్లకు అంటే 2025–-26 వరకు రూ. 3,246 కోట్ల నిధులు ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ 'కిందిస్థాయి' విధానాన్ని అనుసరించి వికేంద్రీకృత పద్ధతిలో అమలవుతుంది. ఇది స్థానిక గ్రామ సంఘం ప్రణాళిక అమలు మొదలు నిర్వహణ నుండి ఆపరేషన్ వరకు కీలక పాత్ర పోషిస్తుంది. గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీని బలోపేతం చేయడం, గ్రామ కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయడంతో పాటు గ్రామసభలో ఆమోదించడం వంటి అనేక కార్యక్రమాలను చేపడుతుంది. గ్రామానికి అమలు చేయాల్సిన నీటి సరఫరా పథకాలపై చర్చిస్తుంది. ఏ ఇంటిలోనైనా మహిళలు నీటి నిర్వాహకులు కాబట్టి ఈ చర్చల్లో వారు పాల్గొనడాన్ని జల్జీవన్ మిషన్ ప్రోత్సహిస్తుంది. మిషన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, సురక్షితమైన నీటి ప్రాముఖ్యత గురించి వారిలో చైతన్యం తేవడానికి, సంఘంతో పాలుపంచుకోవడానికి, ప్రోగ్రామ్ అమలు కోసం పంచాయతీ రాజ్ సంస్థలకు (పీఆర్ఐలు) మద్దతునిచ్చేందుకు ఇంప్లిమెంటింగ్ సపోర్ట్ ఏజెన్సీలు (ఐఎస్ఏలు) పనిచేస్తాయి.
2021–-22లో ప్రభుత్వ అధికారులు, ఐఎస్ఏలు, ప్రజారోగ్య ఇంజనీర్లు, గ్రామ నీరు పారిశుద్ధ్య కమిటీ, నిఘా కమిటీ పంచాయతీ సభ్యులతో కూడిన 60 వేల మంది వాటాదారుల సామర్థ్యాన్ని నిర్మించాలని రాష్ట్రం ప్రణాళిక రచించింది. అదనంగా, రాష్ట్రంలో 8 వేల మందికి పైగా నైపుణ్య శిక్షణ కార్యక్రమం కింద శిక్షణ పొందనున్నారు. మేసన్, ప్లంబర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ పంప్ ఆపరేటర్గా పనిచేసేలా స్థానికులను తీర్చిదిద్దుతారు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్ సెక్షన్ల కింద గ్రామాల్లో ఉపాధి కల్పించే ఇటువంటి కార్యక్రమం గ్రామాల్లో ఆదాయాన్ని పెంచే అవకాశాలను అందిస్తుంది.
ప్రజారోగ్యం కోసం దేశవ్యాప్తంగా 2,000కిపైగా నీటి నాణ్యత పరీక్షా ప్రయోగశాలలు సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా వారు నామమాత్రపు ఖర్చుతో ఎప్పుడంటే అప్పుడు వారి నీటి నమూనాలను పరీక్షించవచ్చు. పంజాబ్లో 33 నీటి పరీక్ష ప్రయోగశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగడానికి, మధ్యాహ్న భోజనం వండడానికి, చేతులు కడుక్కోవడానికి, మరుగుదొడ్లలో వాడుకోవడానికి కుళాయి నీరు ఉండేలా కృషి చేస్తున్నారు. ఈ రోజు వరకు, పంజాబ్లోని 22,389 పాఠశాలలకు (100శాతం) 22,120 (100శాతం) అంగన్వాడీ కేంద్రాలకు కుళాయి నీటి సరఫరా ఉంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికీ కుళాయి నీటి సరఫరాను అందించాలనే ఉద్దేశ్యంతో జల్ జీవన్ మిషన్ను 2019 ఆగస్ట్ 15న ప్రకటించారు. ఈ కార్యక్రమం రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలవుతోంది. కరోనా మహమ్మారి తదుపరి లాక్డౌన్ల కారణంగా మిషన్ సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ, కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి 5.38 కోట్ల (28శాతం) కుటుంబాలకు కుళాయి నీటి సరఫరా అందించారు. ఇప్పటి వరకు 8.62 కోట్ల (45శాతం) గ్రామీణ కుటుంబాలు కుళాయిల ద్వారా తాగునీటిని పొందుతున్నాయి. గోవా, తెలంగాణ, అండమాన్ & నికోబార్ దీవులు, దాద్రా & నగర్ హవేలీ డామన్ & డయ్యూ, పుదుచ్చేరి హర్యానా ‘హర్ ఘర్ జల్’ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంగా మారాయి. అంటే గ్రామీణ గృహాల్లో 100 శాతం మందికి కుళాయి కనెక్షన్లను అమర్చారు. 2022 నాటికి ‘హర్ ఘర్ జల్’ రాష్ట్రంగా మారాలని పంజాబ్ లక్ష్యంగా పెట్టుకుంది.