గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

గ్రామీణ రోడ్ల అనుసంధానం కొనసాగింపునకు కేబినెట్ ఓకె!


పి.ఎం.జి.ఎస్.వై. పథకం,.. వామపక్ష తీవ్రవాద
ప్రభావిత ప్రాంతాల రోడ్ల అనుసంధాన ప్రాజెక్టు
గడువు పొడగింపునకు సి.సి.ఎస్.ఇ. ఆమోదం..

పి.ఎం.జి.ఎస్.వై. ప్రస్తుత పనులకు
రూ 1,12,419 కోట్ల వ్యయం..
వామపక్ష ప్రభావిత ప్రాంతాల రోడ్ల అనుసంధానంలో
ఇప్పటికే 4,490 కిలోమీటర్ల రోడ్లు,..105 వంతెనల పూర్తి..

ఈశాన్య, పర్వత ప్రాంత రాష్ట్రాల్లో
పెడింగ్ పనులు పూర్తికి
సెప్టెంబరువరకూ గడువు పొడిగింపు..

Posted On: 17 NOV 2021 3:36PM by PIB Hyderabad

  ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పి.ఎం.జి.ఎస్.వై.) పథకం ఒకటవ, రెండవ దశలను 2022 సెప్టెంబరు నెలవరకూ పొడించాలని కేంద్ర  గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి విభాగం చేసిన ప్రతిపాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సి.సి.ఇ.ఎ.) ఆమోదించింది. ఈ పథకంలో భాగంగా మిగిలిన రహదారుల, వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా ఈ ప్రతిపాదనలకు సి.సి.ఇ.ఎ. ఆమోదం తెలిపింది. అలాగే,. దేశంలో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాల ప్రభావం ఉన్న ప్రాంతాలకోసం చేపట్టిన రహదారుల అనుసంధాన పథకాన్ని 2023 మార్చి వరకూ కొనసాగించాలన్న ప్రతిపాదనలను కూడా సి.సి.ఇ.ఎ. ఆమోదించింది.

 

  మైదాన ప్రాంతాల్లో500మందికి మించిన జనావాసాలకు, ఈశాన్య, హిమాలయ ప్రాంతాల్లో 250 మందికి మించిన ఆవాసాలకు రహదారులతో అనుసంధానం కల్పించే లక్ష్యంతో పి.ఎం.జి.ఎస్.వై. తొలిదశ పథకాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. ఇక, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అయితే, వంద అంతకు మించిన జనాభా కలిగిన జనావాసాలకు కూడా ఈ పథకం కింద రహదారులతో అనుసంధానం కల్పించవలసి ఉంది. ఈ పథకం కింద మొత్తం 1,84,444 జనావాసాలకు రోడ్ల అనుసంధానం ఏర్పాటు చేయవలసి ఉండగా, 2,432 ఆవాసాలకు ఇంకా రహదారుల అనుసంధానం ఏర్పడలేదు. మొత్తం 6,45,627 కిలోమీటర్ల నిడివితో రోడ్లు, 7,523 వంతెనలు నిర్మించాల్సి ఉండగా, 20,950 కిలోమీటర్ల నిడివిగల రోడ్లను,..1,974 వంతెనలను ఇంకా నిర్మించాల్సి ఉంది. తాజా సి.సి.ఇ.ఎ. తెలిపిన ఆమోదంతో మిగిలిన రోడ్ల నిర్మాణం. వంతెనల నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది.

 

  ఇక, పి.ఎం.జి.ఎస్.వై. 2వ దశ కింద 50,000కిలోమీటర్లమేర రహదారుల వ్యవస్థను నవీకరించాలని నిర్ణయించారు. 49,885 కిలోమీటర్ల నిడివితో రోడ్లు, 765 వంతెనలు నిర్మించేందుకు అనుమతి లభించింది. అయితే, ఇందులో 4,240 కిలోమీటర్ల నిడివిగల రోడ్ల నిర్మాణం, 254 వంతెనల నిర్మాణం ఇంకా జరగాల్సి ఉంది. సి.సి.ఇ.ఎ. ఆమోదంతో ఇపుడు ఈ పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఏర్పడింది.

 

  పి.ఎం.జి.ఎస్.వై. పథకం కింద అసంపూర్తిగా నిలిచిపోయినన పనుల్లో ఎక్కువ ఈశాన్య ప్రాంతంలోనే ఉన్నాయి. కోవిడ్ లాక్ డౌన్ ఆంక్షలు, ఎడతెరిపి లేని వర్షాలు, శీతాకాలం, అటవీపరమైన సమస్యలు ఇందుకు కారణం. అయితే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ఈ పనులన్నింటినీ పూర్తి చేయించేందుకు గడువును పెంచాలని సంబంధిత రాష్ట్రాలు కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. మిగిలిపోయిన ఈ పనులను పూర్తి చేయడానికి వీలుగా పథకం అమలు గడువును 2022 సెప్టెంబరు నెల వరకూ పొడిగించారు.

 

  దేశంలో వామపక్ష తీవ్రవాదంతో ప్రభావితమైన 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాలకు రోడ్ల అనుసంధాన్ని మెరుగు పరిచే లక్ష్యంతో  వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల రహదారుల అనుసంధాన పథకాన్ని 2016లో ప్రారంభించారు. ఇందుకు సంబంధించి 5,714 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం, 358 వంతెనల నిర్మాణం ఇంకా జరగాల్సి ఉంది. దీనికి తోడు1,887కిలోమీటర్ల రహదారులను, 40 వంతెనలను నిర్మించేందుకు అనుమతిస్తున్నారు. పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తయ్యేందుకు వీలుగా ఈ పథకం గడువును 2023మార్చి వరకూ పొడిగిస్తున్నారు. ఈ పనులతో కమ్యూనికేషన్ సదుపాయాల మెరుగుపడతాయి. భద్రతా పరంగా కూడా ఈ పనులు పూర్తికావడం ఎంతో అవసరం.

 

  పి.ఎం.జి.ఎస్.వై. పథకం కింద చేపట్టే జరిగే  గ్రామీణ రహదారుల నిర్మాణంలో అధునాతనమైన, పర్యావరణ హితమైన సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఖర్చుకు తగిన ప్రయోజనాన్ని రాబట్టేందుకు, వేగంగా పనులు సాగించేందుకు వీలుగా, స్థానికంగా అందుబాటులో ఉన్న సరంజామానే నిర్మాణంలో వినియోగిస్తున్నారు. నూతనమైన, పర్యావరణ హితమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటివరకూ లక్ష కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టారు. అందులో ఇప్పటికే 61,000కిలోమీటర్లమేర నిర్మాణం పూర్తయింది. ఫుల్ డెప్త్ రిక్లమేషన్ టెక్నాలజీ సహాయంతో 1,255కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి లభించింది. ఈ టెక్నాలజీ వినియోగంతో నిర్మాణం వ్యయం, వ్యవధి భారీస్థాయిలో తగ్గిపోయింది. అంతేకాక, ప్రకృతి వనరులను రక్షించేందుకు, వాతావరణంలో కర్భన ఉద్గారాల స్థాయిని తగ్గించేందుకు అవకాశం ఏర్పడింది.

 

  నిర్మాణ దశలోనే కాక, నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా రోడ్లు నాణ్యంగా ఉండేలా చూసేందుకు, పి.ఎం.జి.ఎస్.వై. పథకం మూడంచెల నాణ్యతా ప్రమాణాల యంత్రాంగాన్ని నిర్దేశించింది. ఈ యంత్రాంగం కింద రాష్ట్ర స్థాయిలో, కేంద్రప్రభుత్వ స్థాయిలో నాణ్యతపై పర్యవేక్షక యంత్రాంగాన్ని పెంచారు. అలాగే,మెరుగైన నాణ్యతా ప్రమాణాల రక్షణకోసం తనిఖీలపై కూడా మరింత ఎక్కువ శ్రద్ధను కేంద్రీకరించారు. దీనితో వివిధ రహదారి పనుల సంతృప్త స్థాయి ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతోంది.

 

  ఇక, పి.ఎం.జి.ఎస్.వై. 3వ దశను కూడా ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. 2025 మార్చి నాటికి 1,25,000వకిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణాన్నిఈ దశలో నిర్దేశించారు. ఇందులో ఇప్పటికే, 72,000కిలోమీటర్ల నిడివిగల రహదారుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఇందులో 17,750 కిలోమీటర్ల మేర నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.

  పి.ఎం.జి.ఎస్.వై. పథకం కింద ప్రస్తుతం కొనసాగుతున్న పనులు పూర్తి కావడానికి 2021-22నుంచి 2024-25వరకూ రాష్ట్రాల వాటాతో సహా మొత్తం 1,12,419కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది.

 

 

అంశాలవారీగా వివరాలు

పి.ఎం.జి.ఎస్.వై.- 1వ దశ

 

  • పి.ఎం.జి.ఎస్.వై. పథకం తొలిదశను 2,000వ సంవత్సరంలో ప్రారంభించారు. 2001వ సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం,..మైదాన ప్రాంతాల్లో అయితే, 500 లేదా అంతకు మించిన జనాభా ఉన్న ఆవాసాలకు, ఈశాన్య ప్రాంతాలు, హిమాలయ ప్రాంత రాష్ట్రాల్లో అయితే 250మంది అంతకు మించిన జనాభా ఉన్న ఆవాసాలకు రహదారులతో అనుసంధానం కల్పించే లక్ష్యంతో ఈ పథకం తొలిదశను చేపట్టారు. ఆయా జిల్లాల పరిధిలో అర్హమైన జనావాసాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న గ్రామీణ రోడ్లను నవీకరించే అంశాన్ని కూడా ఈ పథకంలోనే పొందుపరిచారు.

 

  • ఇక, 2013లో తీసుకున్న నిర్ణయం ప్రకారం, వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలతో ప్రభావితమైన ప్రాంతాల్లో వందనుంచి 249మంది ఉంటున్న జనావాసాలను కూడా ఈ పథకం పరిధిలోకి తెచ్చారు. వామపక్ష ప్రభావితమైనవిగా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ గుర్తించిన ప్రాంతాల్లో పనులు చేపట్టాలని నిర్ణయించారు.

 

  • 250మంది నుంచి 500మంది వరకూ జనాభా కలిగిన ప్రాంతాలకు ఈ పథకాన్ని వర్తింపజేయడంలో భాగంగా, మొత్తం 1,78,184 జనావాసాలకు గాను ఇప్పటివరకూ 1,71,494 ఆవాసాలకు రహదారుల అనుసంధానం పూర్తయింది. 2021వ సంవత్సరం నవంబరు 15వరకూ అందిన సమాచారం ప్రకారం ఇంకా 1,968 జనావాసాలకు అనుసంధానం కల్పించాల్సి ఉంది. మిగిలిన 4,722 జనావాసాలకు గాను కొన్నిచోట్ల రహదారుల అనుసంధానం పనులను ఉపసంహరించుకున్నారు. మరికొన్ని చోట్ల పనులు చేపట్టడం ఆచరణసాధ్యం కాదని నిర్ణయించారు. వందనుంచి 249 మందివరకూ కలిగిన జనావాసాల కేటగిరీకి సంబంధించి మొత్తం 6,260 ఆవాసాలకు రోడ్ల అనుసంధాన పథకం మంజూరు కాగా, 2021, నవంబరు 15నాటికి ఇంకా 464 ఆవాసాలకు పనులు పూర్తి కావలసి ఉంది.

 

  • పి.ఎం.జి.ఎస్.వై. తొలిదశ కింద ఇప్పటివరకూ మొత్తం 6,45,627 కిలోమీటర్ల నిడివిగల రోడ్ల నిర్మాణానికి, 7,523 వంతెనల నిర్మాణానికి ఆమోదం లభించింది. 2021 నవంబరు 15నాటి సమాచారం ప్రకారం ఇంకా, 20,950 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం, 1,974 వంతెనల నిర్మాణం జరగాల్సి ఉంది. 

 

  • నిర్మాణం పెండింగులో ఉన్న పనుల్లో ఎక్కువ భాగం ఈశాన్య ప్రాంతంలో, హిమాలయ పర్వత ప్రాంతపు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

 

  • పనుల గడువును 2019 మార్చి నెలవరకూ పొడిగించే ప్రతిపాదనలను సి.సి.ఇ.ఎ. 2018 ఆగస్టులో ఆమోదించింది.

 

  • ఆయా జనావాసాల్లో పెండింగులో ఉన్న పనులన్నింటినీ 2022 సెప్టెంబరు లోగా పూర్తిచేయాలన్నది లక్ష్యంగా నిర్దేశించారు. 20,950 కిలోమీటర్ల నిడివిగల రోడ్లను, 1,974 వంతెనలను నిర్మించడం ద్వారా ఈ లక్ష్యాన్ని పూర్తిచేయనున్నారు.  

 

 

 

 

 

పి.ఎం.జి.ఎస్.వై.-2వ దశ

  • దేశ వ్యాప్తంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న 50,000కిలోమీటర్ల నిడివిగల రహదారుల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు పి.ఎం.జి.ఎస్.వై. 2వ దశను చేపట్టారు. ఇందుకు 2013 మే నెలలో కేంద్ర మంత్రివర్గం తన ఆమోదం తెలిపింది.

 

  • రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతిపాదనలన్నింటికీ ఆమోదం లభించింది.

 

  • ఈ పథకం కింద మొత్తం 49,885కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి, 765 వంతెనల నిర్మాణానికి ఆమోదం లభించింది. అయితే, కేవలం 4,240 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, 254 వంతెనల నిర్మాణం మాత్రమే ఇంకా మిగిలి ఉంది.

 

  • పెండింగులో ఉన్న పనుల్లో ఎక్కువ భాగం ఈశాన్య ప్రాంతపు రాష్ట్రాల్లోను, హిమాలయ పర్వత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోను ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలో కూడా కొన్ని పనులు పెండింగులో ఉన్నాయి.

 

  • ఈ పనుల గడువును 2020 మార్చి వరకూ పొడిగించే ప్రతిపాదనకు సి.సి.ఇ.ఎ. 2018 ఆగస్టు 9న ఆమోదం తెలిపింది.

 

  • పొడిగించిన గడువులోగానే పెండింగు పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అంటే, వచ్చే ఏడాది సెప్టెంబరు నెలలోగా పనులను పూర్తి చేయనున్నారు.

 

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు రహదారుల అనుసంధాన పథకం

  • తొమ్మిది రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో వ్యూహాత్మక ప్రాముఖ్యం గల 5,412 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, నవీకరణతో పాటు, 126 వంతెనల నిర్మాణంకోసం 2016లో ఈ పథకం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, చత్తీస్.గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం రూ. 11,725కోట్ల వ్యయంతో పనులను చేపట్టారు. 

 

  • పథకం అమలు కాలం : 2016-17 నుంచి 2019-20 వరకూ.

 

  • ఈ పథకం కింద చేపట్టే రోడ్లు, వంతెనల నిర్మాణం పనులను కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ గుర్తించింది. వివిధ రాష్ట్రాలు, భద్రతా దళాలతో సంప్రదింపుల అనంతరం కేంద్ర హోమ్ మంత్రిత్వశాక ఈ పనులను గుర్తించింది.

 

  • ఇప్పటివరకూ ఈ పథకం కింద,.. రూ. 9,822 కోట్ల వ్యయంతో, 10,231 కిలోమీటర్ల రోడ్లు, వంతెనల నిర్మాణం మంజూరైంది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సిఫార్సు చేసే ప్రతిపాదనలను కూడా అదనంగా చేపట్టేందుకు ఈ పథకంలో తగిన ఏర్పాటు చేశారు.

 

  • 4,490 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, 105 వంతెనల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.  

 

  • మిగిలిన దాదాపు 1,887కిలోమీటర్ల రహదారుల ప్రాజెక్టులకు, అదనపు ప్రాజెక్టులకు ఇంకా ఆమోదం లభించాల్సి ఉంద. వీటిని కూడా పొడిగించిన గడువులోగా అంటే,..2023 మార్చి నెలలోగా పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు.

 

 పథకం ప్రభావం, ఉపాధి కల్పనా అవకాశాలతో సహా..

 

  • వివిధ దశల కింద చేపట్టిన పి.ఎం.జి.ఎస్.వై. పథకం ప్రభావితం చేసే అంశాలపై పలు రకాల స్వతంత్ర అధ్యయనాలు జరిగాయి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పట్టణీకరణ, ఉపాధి కల్పన, తదితర అంశాలపై ఈ పథకం ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపినట్టు ఈ అధ్యయనాలు తేల్చి చెప్పాయి.

 

  • అభివృద్ధి జరగాలంటే గ్రామీణ ప్రాంతాలతో  రోడ్ల అనుసంధానం కల్పించడం అనివార్యం. ఇలా,  అనుసంధానం కాకుండా మిగిలిపోయిన జనావాసాలకు అన్నికాలాల్లో పటిష్టంగా మన్నికగా ఉండే తారురోడ్లతో అనుసంధానం కల్పిస్తే,. ఆలాంటి జనావాసాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరగుతాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న గ్రామీణ ప్రాంతాల రహదారులను నవీకరిస్తే, రహదారుల వ్యవస్థ మొత్తం సమర్థవంతంగా, మరింత ప్రయోజనకరంగా తయారవుతుంది. ప్రజల ప్రయాణాలకు, సరకులకు రవాణాకు తగిన సేవలందించే వ్యవస్థలుగా రహదారులు మారతాయి. రహదారుల నిర్మాణం, నవీకరణతో స్థానిక ప్రజలకు ప్రతక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.

 

అమలు వ్యూహం, లక్ష్యాలు

  • పి.ఎం.జి.ఎస్.వై. పథకంకింద పనుల వ్యవధి పొడిగింపు ఇప్పటికే అమలులోకి వచ్చింది. పి.ఎం.జి.ఎస్.వై. 1వ దశ, 2వ దశ కింద పనులన్నింటికీ ఇప్పటికే ఆమోదం లభించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అనుసంధాన ప్రాజెక్టుల్లో మిగిలిన పనులు, అదనపు పనుల ప్రతిపాదనలకు రాబోయే డిసెంబరు నెలలోగా మంజూరు చేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కృషి చేస్తుంది.

 

  • పొడిగించిన కాలవ్యవధిలోగా మిలిగిన పనులు పూర్తయ్యేలా చూసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి  మంత్రిత్వ శాఖ పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది.  సంబంధిత రాష్ట్రాలతో కలసి పనులను సమీక్షిస్తూ ఉంటుంది.

 

 

  నేపథ్యం

  • ఇప్పటి వరకూ రోడ్ల అనుసంధాన సదుపాయం లేని జనావాసాలకు తారు రోడ్లతో అనుసంధానం కల్పించే లక్ష్యంతో పి.ఎం.జి.ఎస్.వై. పథకం మొదటి దశను ప్రభుత్వం చేపట్టింది. ( మైదాన ప్రాంతాల్లో 500మందికి మించిన జనావాసాలకు,... ఈశాన్యం, పర్వత ప్రాంతాలు, ఎడారి ప్రాంతాల్లో అయితే 250కి మించిన జనావాసాలకు రహదారులతో అనుసంధానం కల్పించడానికి ఈ పథకం చేపట్టారు. 2001వ సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం ఈ పనులు చేపట్టారు.) ఆయా ప్రాంతాల సంపూర్ణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ఈ పనులు జరుగుతాయి. అనంతరం పి.ఎం.జి.ఎస్.వై. పథకం 2వ దశను, వామపక్ష ప్రభావిత ప్రాంతాల రోడ్ల అనుసంధాన పథకాన్ని, పి.ఎం.జి.ఎస్.వై. 3వ దశను కూడా ప్రభుత్వం చేపట్టింది.  

 

  • ఈ పథకాలన్నింటి పరిధిలో చేపట్టే పనుల కాలవ్యవధిని పొడిగింపుకోసం ప్రస్తుతం ప్రతిపాదనలు రూపొందించారు.

 

  • పి.ఎం.జి.ఎస్.వై. పథకం 3వ దశను 2019లో ప్రారంభించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1,25,000కిలోమీటర్ల నిడివిగల రహదారులను మరింత పటిష్టం చేసేందుకు, గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ జనావాసాల మధ్య ప్రధాన అనుసంధాన రోడ్లను అభివృద్ధి చేసేందుకు పి.ఎం.జి.ఎస్.వై. 3వ దశకు శ్రీకారం చుట్టారు.  దీనితోపాటు గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు, మాధ్యమికోన్నత పాఠశాలలకు, ఆసుపత్రులకు అనుసంధాన రోడ్ల నిర్మాణాన్ని కూడా ఈ పథకం పరిధిలోకి తెచ్చారు. పనుల అమలు వ్యవధిని 2025 మార్చి నెలవరకూ పొడిగించారు.

 

***



(Release ID: 1772769) Visitor Counter : 148