బొగ్గు మంత్రిత్వ శాఖ
పిల్లల్లో పోషకాహార లోపం అరికట్టడానికి అమలు జరుగుతున్న' ఫుల్వారీ' ప్రాజెక్ట్ ను మరింత పటిష్టంగా అమలు చేయడానికి ఆజాది కా అమృత్ మహోత్సవ్ కింద సహకారం అందించనున్న నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సిఎల్)
Posted On:
20 SEP 2021 6:28PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సిఎల్) మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి జిల్లాలో పిల్లల్లో పోషకాహార లోపం అరికట్టడానికి 75 ' ఫుల్వారీ' కేంద్రాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే పనిచేస్తున్న 25 ' ఫుల్వారీ' కేంద్రాల్లో ఆర్ నెలల నుంచి మూడు సంవత్సరాల మధ్య వయస్సు గల దాదాపు 220 మంది పిల్లలు ఉన్నారు. ' ఫుల్వారీ' ప్రాజెక్టును అమలు చేయడానికి సామాజిక బాధ్యత కార్యక్రమం కింద ఎన్సిఎల్ 128.86 లక్షల రూపాయలను విడుదల చేసింది.
మంత్రిత్వ శాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు సుస్థిర వ్యాపార విధానంలో భాగంగా ' ఫుల్వారీ' ప్రాజెక్టును ఎన్సిఎల్ రూపొందించి అమలు చేస్తున్నది. తన కార్యకలాపాలు సాగుతున్న ప్రాంతంలో పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, ప్రజా సంక్షేమం, విద్యా కార్యక్రమాలను సంస్థ అమలు చేస్తున్నది.
సింగ్రౌలి జిల్లాలో పిల్లలు పోషకాహార లోపం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో వెల్లడయ్యింది. సమస్యను నివారించి పిల్లలకు పౌష్ఠిక ఆహారాన్ని అందించి వారి ఆరోగ్య సంరక్షణకు ' ఫుల్వారీ' ప్రాజెక్టును అమలు చేయడానికి జిల్లా యంత్రంగంతో ఎన్సిఎల్ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పోషకాహార సమస్యను దానితో పాటు పిల్లల్లో ఎదురయ్యే శారీరక మానసిక లోపాలను సరిదిద్దడానికి ఈ పథకాన్ని రూపొందించారు.
పోషకాహార సమస్యను ఎదుర్కొంటున్న పిల్లలకు ' ఫుల్వారీ' కేంద్రాల్లో సంరక్షిస్తూ వారి బరువు, శారీరక మరియు మానసిక అభివృద్ధి సాధారణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
పిల్లల పెరుగుదలను తరచూ పర్యవేక్షించి తగిన చర్యలను అమలు చేయడానికి ఈ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. పోషకాహార లోపాన్ని సవరించి సుస్థిర అభివృద్ధి సాధించడానికి కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఎన్సిఎల్ అమలు చేస్తున్న' ఫుల్వారీ' ప్రాజెక్టు సహకరిస్తున్నది.
పోషకాహారం అందించి పిల్లలు శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉండేలా చూడడానికి వయస్సుల వారీగా ఆటబొమ్మలను అందిస్తూ విద్యా కార్యక్రమాలను ఈ కేంద్రాలలో అమలు చేస్తున్నారు. గ్రామాలకు చెందిన ఆశా సిబ్బంది ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్నారు. ఏఎన్ఎం ల సహకారంతో పిల్లలకు క్రమం తప్పకుండా అవసరమైన టీకాలను ' ఫుల్వారీ' కేంద్రాలలో వేయడం జరుగుతుంది.
ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఎన్సిఎల్ పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోంది. దేశంలో జాతీయ పోషకాహార మాసం 2021 ని నిర్వహిస్తున్న నేపథ్యంలో సింగ్రౌలి జిల్లాలో పోషకాహార సమస్యను నివారించడానికి ఎన్సిఎల్ అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ప్రాజెక్టు కింద 25 మంది మహిళలతో సహా 32 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. కేంద్రాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఉపాధి పొందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది.
***
(Release ID: 1756560)
Visitor Counter : 176